India- Maldives: ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్

భారత్‌-మాల్దీవుల(India Maldives) విదేశాంగ మంత్రుల మధ్య నేడు భేటీ జరిగింది. రెండు దేశాల సంబంధాల్లో ఒడుదొడుకులు కొనసాగుతోన్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. 

Published : 09 May 2024 19:08 IST

దిల్లీ: రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోన్న తరుణంలో మాల్దీవుల(Maldives) విదేశాంగ మంత్రి మూసా జమీర్‌(Moosa Zameer) భారత్‌(India) పర్యటనకు వచ్చారు. ఈసందర్భంగా దిల్లీలో మన విదేశాంగ మంత్రి జై శంకర్‌(S Jaishankar)తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రయోజనాలు, పరస్పర గౌరవం మీద రెండు దేశాల మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టంచేశారు. తాము నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ (పొరుగు వారికి ప్రథమ ప్రాధాన్యం) విధానానికి కట్టుబడి ఉన్నామని, మాల్దీవులకు అవసరం ఉన్న ప్రతిసారీ ఆదుకున్నామని గుర్తుచేశారు. 

ఈ సమావేశంలో జైశంకర్‌ ఎక్కడా చైనా పేరు ప్రస్తావించలేదు. అలాగే ఈ భేటీ దృశ్యాలను తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు. మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు ముయిజ్జు చైనాకు అనుకూల వైఖరి ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశం నుంచి భారత్‌కు తొలి ఉన్నతస్థాయి అధికారిక పర్యటన ఇదే కావడం గమనార్హం. ఈక్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. 

మాల్దీవుల నుంచి భారత బలగాలను వెనక్కి తీసుకోవాలని ముయిజ్జు కోరిన విషయం తెలిసిందే. అందుకు ఆయన మే 10 గడువుగా విధించారు. అది సమీపించిన తరుణంలో ఇరుదేశాల మధ్య సమావేశం జరుగుతుండడం గమనార్హం. అక్కడున్న సైనికుల్లో చాలామందిని భారత్‌ ఇప్పటికే వెనక్కి రప్పించింది. ప్రస్తుత భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ప్రాంతీయపరమైన అంశాలు చర్చకు వస్తాయని ఇదివరకే విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘‘హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశానికి మాల్దీవులు కీలక భాగస్వామి. జమీర్ పర్యటన ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి మరింత ఊతమిస్తుందని భావిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని