‘బంతి మీ కోర్టులోనే ఉంది’: రైతులతో తోమర్‌

వ్యవసాయ చట్టాలపై రైతులతో కేంద్రం చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌......

Updated : 22 Jan 2021 20:53 IST

మళ్లీ అసంపూర్తిగానే ముగిసిన చర్చలు

దిల్లీ: వ్యవసాయ చట్టాలపై రైతులతో కేంద్రం చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌ శుక్రవారం జరిపిన 11వ విడత చర్చల్లోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తదుపరి చర్చలకు సంబంధించి తేదీ ఖరారు చేయకుండానే చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ సమావేశంలో రైతుల వ్యవహార శైలిపై కేంద్రమంత్రులు అసంతృప్తి వ్యక్తంచేశారు. చట్టంలో లోపం లేకపోయినా ప్రతిపాదనలు చేశామన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్‌.. 18 నెలల పాటు ఈ చట్టాలను ప్రతిష్టంబింపజేసే ప్రతిపాదనను మించింది ఏదీ తమవద్ద లేదన్నారు. దీనిపై రైతులు నిర్ణయం తీసుకోలేదన్నారు. ‘బంతి మీ కోర్టులోనే ఉంది.. కేంద్రం ప్రతిపాదనలపై మీ నిర్ణయం చెబితే మళ్లీ చర్చించేందుకు సిద్ధం’ అని రైతుల వద్ద పునరుద్ఘాటించినట్టు సమాచారం. అనంతరం తోమర్‌ మీడియాతో మాట్లాడుతూ..  రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నేతలు చర్చలు జరపకపోవడం బాధాకరమన్నారు. గత సమావేశంలో కేంద్ర ప్రభుత్వ చేసిన ప్రతిపాదనలను దేశం, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పునఃపరిశీలించాలని కోరామన్నారు. ఈ మూడు చట్టాల రద్దు మినహా మరే ప్రతిపాదనతోనైనా రావాలని రైతు నేతలను కోరినట్టు తెలిపారు. కేంద్రం ఇచ్చిన ఆఫర్‌ కంటే మెరుగైన ప్రతిపాదనతో వస్తే చర్చించేందుకు తాము సిద్ధమేనని స్పష్టంచేశారు. 

మరోవైపు, 10 నిమిషాల కన్నా మించి చర్చలు జరగలేదని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. తదుపరి చర్చలు కొనసాగుతాయని కూడా తాము అనుకోవడంలేదన్నారు. తాము మాత్రం ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసినట్టు చెప్పారు.ఈ రోజు తొలి రౌండ్‌లో పది నిమిషాల కన్నా మించి చర్చలు సాగలేదన్నారు. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత మళ్లీ కేంద్రమంత్రులు వచ్చి ఇంతకన్నా మంచి ప్రతిపాదనలు చేయలేమని చెప్పారని, మాట్లాడుకొని వచ్చి చెబితే తదుపరి సమావేశానికి తేదీ ఖరారు చేస్తామని చెప్పారన్నారు. రిపబ్లిక్‌ డే రోజున తలపెట్టిన పరేడ్‌ కోసం పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఆ రోజు శాంతియుతంగా పరేడ్‌ నిర్వహిస్తామన్నారు. జనవరి 26తర్వాత ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే అంశంపై సమావేశమై చర్చిస్తామన్నారు.

ఇదీ చదవండి..

కొవిడ్‌ టీకాపై భయం తొలగించాలి: మోదీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని