మయన్మార్‌లో ఇంటర్నెట్ నిషేధం

మయన్మార్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం ప్రజలపై ఆంక్షలు అంతకంతకూ పెంచుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి ఫేస్‌బుక్‌ను నిషేధించిన సైన్యం శనివారం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిషేధించింది.

Published : 06 Feb 2021 18:21 IST

ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు కూడా..

యాంగూన్‌: మయన్మార్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం ప్రజలపై ఆంక్షలు అంతకంతకూ పెంచుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి ఫేస్‌బుక్‌ను నిషేధించిన సైన్యం శనివారం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిషేధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను పర్యవేక్షించే ‘నెట్‌బ్లాక్స్‌’ బృందం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. శనివారం ఉదయం నుంచి ఈ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో లేవని వారు తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ఫేస్‌బుక్‌ను బ్లాక్‌ చేశామని చెప్పిన సైన్యం అదేవిధంగా ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాంలను కూడా నిషేధించింది. కాగా సామాజిక మాధ్యమాలను నిషేధించడంపై ఆయా కంపెనీలు స్పందించాయి. ఇది ప్రజల హక్కుల ఉల్లంఘనే అని వారు పేర్కొన్నారు.

ఫిబ్రవరి 1న సైన్యం తిరుగుబాటు చేసిన రోజు కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను నిషేధించిన సైన్యం తర్వాత దానిని పునరుద్ధరించింది. కాగా, సామాజిక మాధ్యమాల్లో సైన్యంపై వ్యతిరేకత పెరుగుతుండటంతో ఇప్పుడు పూర్తిగా ఇంటర్నెట్‌ను నిషేధించారు. సైన్యం తిరుగుబాటు చేసినప్పటి నుంచి ఫేస్‌బుక్‌లో దానికి సంబంధించిన చిత్రాలు, నిరసనలు వెల్లువెత్తడంతో సైన్యం ఫేస్‌బుక్‌పై నిషేధం విధించింది. గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్‌ సూకీకి చెందిన నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (ఎన్‌ఎల్డీ) పార్టీ అవకతవకలకు పాల్పడిందని సైన్యం ఆరోపించింది. వాటిపై అధికారపార్టీ సరైన రీతిలో స్పందించకపోవటంతో తిరుగుబాటు చేసినట్లు సైన్యం వెల్లడించింది.

ఇవీ చదవండి..

దేశంలో 20కోట్ల కరోనా టెస్టులు

అల్లు అర్జున్‌ కారవాన్‌కు ప్రమాదం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని