ప్రభుత్వ మార్గాల ద్వారానే టీకా సరఫరా: ఫైజర్‌

తాము భారత్‌లో సరఫరా చేయబోయే టీకాను ప్రభుత్వ మార్గాల ద్వారానే పంపిణీ చేస్తామని అమెరికాకు చెందిన ఫైజర్‌ సంస్థ వెల్లడించింది.

Published : 22 Apr 2021 17:39 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా ఇతర దేశాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే వెల్లడించింది. ఇందుకు ఆయా టీకాల సామర్థ్యాలను పరిశీలించి దేశంలో వినియోగించుకుంటామని తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వం, ప్రైవేటు మార్గాల ద్వారా టీకా పంపిణీ చేయవచ్చని పేర్కొంది. అయితే, తాము సరఫరా చేయబోయే టీకాను ప్రభుత్వ మార్గాల ద్వారానే పంపిణీ చేస్తామని అమెరికాకు చెందిన ఫైజర్‌ సంస్థ తాజాగా వెల్లడించింది.

ఎలాంటి లాభాపేక్ష లేకుండానే తమ టీకాను భారత ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫైజర్‌ యాజమాన్యం ప్రకటించింది. ఈ విషయంపై భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులో ఉండే ఉద్దేశంతో పేద, మధ్య, ధనిక ఆదాయ దేశాలకు అనుగుణంగా తాము వివిధ ధరలను నిర్ణయిస్తున్నామని ఫైజర్‌ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే టీకా ధర ఎంతనే విషయాన్ని మాత్రం ఫైజర్‌ వెల్లడించలేదు. ప్రస్తుతం అమెరికాలో ఫైజర్‌ టీకా ఒక డోసు ధర 19.5డాలర్లుగా ఉంది.

ఇదిలాఉంటే, భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ కొరతను అధిగమించేందుకు ఇప్పటికే వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. భారత్‌లో ఇప్పటికే రెండు దేశీయ టీకాలు అనుమతులు పొందగా.. రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ  కూడా ఈమధ్యే ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో విదేశీ సంస్థలు భారత్‌లో కరోనా టీకాను సరఫరా చూపేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇక అమెరికాకు చెందిన ఫైజర్‌, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన టీకా 95శాతం సమర్థత కలిగినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. భారత్‌లో వెలుగు చూసిన కొత్తరకం కరోనా వేరియంట్‌పై ఫైజర్‌ టీకా పాక్షికంగా పనిచేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ ఈమధ్యే వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు