Sela Tunnel: భారత్‌-చైనా సరిహద్దులో సేలా టన్నెల్‌ ప్రారంభం.. జాతికి అంకితం చేసిన మోదీ

భారత సరిహద్దులో నేడు ప్రధాని మోదీ(Modi) ప్రతిష్ఠాత్మక సేలా టన్నెల్‌ను ప్రారంభించారు. 

Updated : 09 Mar 2024 18:52 IST

గువహటి: ఇండియా-చైనా (India-China) సరిహద్దులోని తూర్పు సెక్టార్‌లో నిర్మించిన సేలా టన్నెల్‌ (Sela Tunnel)ను శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఈటానగర్‌లో నిర్వహించిన ‘వికసిత్ భారత్‌- వికసిత్‌ నార్త్‌ ఈస్ట్’ కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ప్రపంచంలోనే పొడవైన రెండు వరుసల టన్నెల్‌గా ఇది గుర్తింపు పొందింది.

ఈ సొరంగం విశేషాలివే..

  • సేలా టన్నెల్‌ను సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలిపారా-చారిదౌర్‌-తవాంగ్‌(BCT) రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఉండే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. 
  • సరిహద్దు రహదారుల సంస్థ (BRO).. ఈ రెండు వరుసల టన్నెల్‌ను నిర్మించింది. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలు ఉన్నాయి. టన్నెల్‌-1 సింగిల్‌ ట్యూబ్‌తో 1,003 మీటర్ల పొడవుండగా.. టన్నెల్‌-2 రెండు సొరంగమార్గాలతో 1,595 మీటర్ల పొడవు కలిగి ఉంది. రెండింటిని కలిపే రోడ్డు పొడవు 1200 మీటర్లు. టన్నెల్‌-2 సొరంగమార్గాల్లో ఒకటి సాధారణ ట్రాఫిక్‌కు, మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు.
  • పర్వతాల మధ్య సేలా పాస్‌కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. ఈ టన్నెల్‌ వల్ల చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు. భారత్-చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. సరిహద్దు ప్రాంత ప్రజలకు సామాజిక-ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చనుంది. 
  • దీంతో తవాంగ్‌-దిరాంగ్‌ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. 
  • ఈ టన్నెల్‌ మెరుగైన భద్రతా సామర్థ్యాన్ని కలిగి ఉంది. వెంటిలేషన్‌ వ్యవస్థలు, లైటింగ్‌, అగ్నిమాపక పరికరాలు వంటి అధునాతన సదుపాయాలను సొరంగాల్లో ఏర్పాటు చేశారు. 
  • 2019 ఫిబ్రవరి 9న ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీనికోసం ప్రభుత్వం రూ.825 కోట్లు వెచ్చించింది.
  • అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ చైనా సరిహద్దుల్లో ఉంటుంది. ఈ సొరంగమార్గంతో అత్యవసర పరిస్థితుల్లో భారత దళాలు త్వరితంగా సరిహద్దులకు చేరుకునే అవకాశం కలిగింది.
  • చైనా సరిహద్దులు ఎత్తుగా ఉండటంతో డ్రాగన్‌ బలగాలు సులభంగా భారత దళాల కదలికలను కనిపెట్టగలవు. అయితే సొరంగమార్గం అందుబాటులోకి రావడంతో వారికి ఆ అవకాశం మూసుకుపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు