Stalin: దేశంలోనే తొలిసారి అల్పాహార పథకం.. పిల్లలకు స్వయంగా వడ్డించిన సీఎం స్టాలిన్‌

Tamil Nadu Breakfast Scheme: తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల పిల్లలకు ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. సీఎం స్టాలిన్‌ స్వయంగా చిన్నారులకు వడ్డించారు.

Updated : 25 Aug 2023 11:23 IST

నాగపట్టణం: తమిళనాడు (Tamil Nadu)లోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని (breakfast scheme)’.. సీఎం స్టాలిన్‌ (MK Stalin) శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దేశంలోనే విద్యార్థులకు పాఠశాలల్లో అల్పాహారం అందిస్తున్న తొలి రాష్ట్రం తమిళనాడే కావడం విశేషం.

నాగపట్టణం జిల్లాలోని తిరుక్కువళై ప్రాథమిక పాఠశాలలో ఈ స్కీం (breakfast scheme) రెండో విడతను ప్రారంభించిన సీఎం స్టాలిన్‌.. చిన్నారులకు అందించే అల్పాహారాన్ని దగ్గరుండి పరిశీలించారు. అనంతరం పిల్లలకు స్వయంగా బ్రేక్‌ఫాస్ట్‌ వడ్డించిన ముఖ్యమంత్రి.. తాను కూడా చిన్నారులతో కలిసి అల్పాహారం తిన్నారు. చెన్నైలో స్టాలిన్‌ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి ఈ పథకాన్ని ప్రారంభించారు.

ల్యాండర్‌ అడుగు పెడుతున్నప్పుడు జాబిల్లిని చూశారా?

వాస్తవానికి ఈ పథకాన్ని గతేడాది సెప్టెంబరులోనే ప్రకటించిన స్టాలిన్‌ సర్కారు.. ప్రయోగాత్మకంగా 1545 పాఠశాలల్లో ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆకలి బాధలు లేకుండా పిల్లలు పాఠశాలలకు హాజరయ్యేలా చూడటంతో పాటు, వారిలో తీవ్ర ప్రభావం చూపుతున్న రక్తహీనతను బాగా తగ్గించడం, పోషకాహార స్థితిని మెరుగుపర్చడం, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడం వంటి లక్ష్యాలతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకం విజయవంతమవడంతో ఇప్పుడు శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 31,008 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు దీన్ని విస్తరించారు. ఈ స్కూళ్లలో మొత్తం 15,75,900 మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ ఇప్పుడు ఈ అల్పాహార పథకం అందుబాటులోకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని