ట్రంప్‌ ఆంక్షల్ని ఎత్తేశారు.. బైడెన్‌ కుదరదన్నారు!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్రెజిల్‌ సహా పలు ఐరోపా దేశాలకు రాకపోకలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ మేరకు సోమవారం కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు.......

Published : 19 Jan 2021 09:22 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్రెజిల్‌ సహా పలు ఐరోపా దేశాలకు రాకపోకలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ మేరకు సోమవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఆయా దేశాల్లో వైరస్‌ విజృంభణ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా, ఇరాన్‌పై ఉన్న ఆంక్షల్ని మాత్రం మార్చలేదు.

ఆయా దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువీకరణ పత్రాన్ని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు. ఆయా దేశాలు సీడీసీ నిబంధనల్ని పాటిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చైనాపై విరుచుకుపడ్డారు. మహమ్మారి వ్యాప్తికి కారణమైన దేశాలు మాత్రం సీడీసీ మార్గదర్శకాల్ని గౌరవిస్తాయన్న నమ్మకం లేదన్నారు. పరోక్షంగా చైనాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ట్రంప్‌ నిర్ణయాన్ని కాబోయే అధ్యక్షుడు బైడెన్‌ బృందం ఖండించింది. కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతాయని  బైడెన్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ తెలిపారు. తమ వైద్య బృందం సూచనల మేరకు విదేశీ ప్రయాణాలపై ఉన్న పర్యవేక్షణను మరింత పటిష్ఠం చేస్తామన్నారు. వైరస్‌ వ్యాప్తికి ఉన్న అన్ని అవకాశాల్ని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవీ చదవండి..

కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!

అధ్యక్షుడి కేబినెట్‌ ఎలా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని