Ap News: సినీ పరిశ్రమ బిడ్డగా సీఎంతో మాట్లాడేందుకు వచ్చాను: చిరంజీవి

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానం మేరకు విజయవాడ వచ్చినట్లు నటుడు చిరంజీవి తెలిపారు.

Updated : 13 Jan 2022 14:37 IST

అమరావతి‌: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానం మేరకు విజయవాడ వచ్చినట్లు సినీ నటుడు చిరంజీవి తెలిపారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన చిరంజీవి.. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘‘సినీ పరిశ్రమ బిడ్డగా సీఎంతో మాట్లాడేందుకు వచ్చా. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలను సీఎంతో చర్చిస్తాను. సీఎంతో భేటీ తర్వాత అన్ని విషయాలు చెబుతా. గంటన్నరలో సీఎంతో చర్చించిన విషయాలను మీకు వివరిస్తాను’’ అని చిరంజీవి అన్నారు. అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చిరంజీవి బయలుదేరారు.

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల గురించి చిరు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా టికెట్ల వివాదంపై ప్రధానంగా వీరి మధ్య చర్చ జరగవచ్చు. రోజురోజుకీ ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని చిరు భావిస్తున్నారట. ఇందులో భాగంగానే జగన్‌ను కలిసి పరిస్థితి వివరించనున్నారట. చిత్ర పరిశ్రమపై పలువురు వైకాపా నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఈ సందర్భంగా సీఎం జగన్‌ దృష్టికి చిరంజీవి తీసుకెళ్లే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని