Pallavi Prashanth: బిగ్‌బాస్‌ సీజన్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌.. రూ.35 లక్షలతో పాటు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్ సొంతం

Bigg Boss Telugu 7 Winner: ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన పల్లవి ప్రశాంత్‌ బిగ్‌బాస్‌-7 విజేతగా నిలిచినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు

Updated : 18 Dec 2023 07:04 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7 విజేతగా రైతు, యూట్యూబర్‌ పల్లవి ప్రశాంత్‌ (pallavi prashanth) నిలిచాడు. చివరి వరకూ నటుడు అమర్‌ దీప్‌, పల్లవి ప్రశాంత్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సంపాదించిన పల్లవి ప్రశాంత్‌ ‘బిగ్‌బాస్‌ సీజన్‌-7’ (bigg boss 7 telugu) టైటిల్‌ను సొంతం చేసుకున్నాడని వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు.‘ఉల్టా-పుల్టా’ అంటూ సెప్టెంబరు 3న ప్రారంభమైన బిగ్‌బాస్‌ సీజన్‌-7 మొత్తం 105 రోజుల పాటు సాగింది. మొదటి రోజు 14 మంది, 35వ రోజు ఐదుగురు హౌస్‌లోకి వెళ్లారు. చివరికి టాప్‌-6లో ఫైనలిస్ట్‌లుగా అమర్‌దీప్‌ (Amardeep), అర్జున్‌ (Arjun), ప్రశాంత్‌ (Prashanth), ప్రియాంక (Priyanka), శివాజీ (Sivaji), యావర్‌ (Yawar)లు నిలవగా పల్లవి ప్రశాంత్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. విన్నర్‌ (Bigg Boss Telugu 7 Winner) అయిన పల్లవి ప్రశాంత్‌ రూ.35లక్షల నగదుతో పాటు, వితారా బ్రెజా కారు, రూ.15లక్షల విలువైన డైమండ్‌ జ్యూయలరీ గెలుచుకున్నాడు.

ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్‌ (pallavi prashanth) మాట్లాడుతూ.. ‘‘నాకు ఓటు వేసిన అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు రుణపడి ఉంటా. తెలుగు రాష్ట్రాల ముద్దు బిడ్డ.. జనం మెచ్చిన రైతు బిడ్డగా మీకు ధన్యవాదాలు చెబుతున్నా. నేను ఇక్కడకు రావాలని ఎన్నో రోజులు తిరిగా. భోజనం చేయని రోజులు కూడా ఉన్నాయి. కానీ నన్ను నేను నమ్ముకున్నా. నేను చేయగలనని అనుకున్నా. ఇదే విషయాన్ని మా బాపునకు చెప్పా. ‘నీ వెనకాల నేను ఉన్నా’ అని ధైర్యం చెప్పాడు. నాగార్జున సర్‌ని చూడగానే మాటలు రాలేదు. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. చాలా మంది జీవితాలు బాగుపడతాయి. నేను గెలుచుకున్న రూ.35లక్షల్లో ప్రతి ఒక్క రూపాయి రైతులకే పంచుతా. మాట తప్పను. జై జవాన్‌.. జై కిసాన్‌.. ’’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

అమర్‌కు రవితేజతో కలిసి నటించే అవకాశం

అంతకుముందు రన్నరప్‌ అమర్‌దీప్‌ మాట్లాడాడు. ఇక్కడ వరకూ వస్తానని తాను అనుకోలేదని అన్నాడు. అందుకు సహకరించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నానని చెప్పాడు. తన స్నేహితులు, కుటుంబం, అనంతపురం వాసుల సహకారం మర్చిపోలేనన్న అమర్‌.. ‘ప్రశాంత్‌ ట్రోఫీ గెలిచాడు.. నేను మిమ్మల్ని (ప్రేక్షకులు) గెలిచాను’ అంటూ కృతజ్ఞతలు చెప్పాడు. ‘ఈగల్‌’ మూవీ ప్రమోషన్స్‌లో మాస్‌ హీరో రవితేజ (Ravi teja) బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా నాగార్జున, రవితేజ, అమర్‌ల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. అప్పటికి ఇంట్లో ఐదుగురు సభ్యులు ఉండగా, అమర్‌ బయటకు వచ్చేస్తే, రవితేజ తర్వాతి చిత్రంలో ఆయన పక్కన కలిసి నటించే అవకాశం ఇస్తానని నాగార్జున ఆఫర్‌ ఇచ్చారు. ఇది విన్న అమర్‌ మరో ఆలోచన లేకుండా బయటకు వచ్చేందుకు ఓకే చెప్పాడు. అమర్‌ అభిమానానికి ఫిదా అయిన రవితేజ తన తర్వాతి చిత్రంలో కలిసి నటించే అవకాశం ఇస్తానని చెప్పడంతో అమర్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు.

రూ.15లక్షలు తీసుకున్న యావర్‌

‘నా సామిరంగ’ ప్రమోషన్స్‌లో భాగంగా ‘అల్లరి’నరేష్‌, రాజ్‌తరుణ్‌, చిత్ర దర్శకుడు విజయ్‌ బిన్నీ, కథానాయిక ఆషికా రంగనాథ్‌ వచ్చి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా గోల్డెన్‌ బాక్సులో రూ.15లక్షలు తీసుకెళ్లిన అల్లరి నరేష్‌, రాజ్‌తరుణ్‌లు హౌస్‌మేట్స్‌కు ఆఫర్‌ ఇచ్చారు. ఆ ఆఫర్‌కు ప్రిన్స్‌ యావర్‌ ఒప్పుకొని రూ.15లక్షలు తీసుకుని హౌస్‌ బయటకు వచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని