Bheemla Nayak: పవన్‌ కల్యాణ్‌ కాదు ఎన్టీఆర్‌ సినిమా కోసం ఎదురుచూశారా? మంత్రి పేర్నినాని

పవన్‌ కల్యాణ్‌ గురించి కాదు ఎన్టీఆర్‌ సినిమా కోసం ఎప్పుడైనా ఎదురుచూశారా? అని ప్రశ్నించారు ఏపీ మంత్రి పేర్నినాని.

Published : 26 Feb 2022 01:38 IST

అమరావతి: పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) గురించి కాదు ఎన్టీఆర్‌ సినిమా కోసం ఎప్పుడైనా ఎదురుచూశారా? అని ప్రశ్నించారు ఏపీ మంత్రి పేర్నినాని. పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ చిత్ర విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందన్న ఆరోపణలపై స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘కొన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో బ్లాక్‌ మార్కెటింగ్‌ను ప్రోత్సహించాలనుకుంటున్నాయి. మరోవైపు, దాన్ని తప్పుబట్టాల్సిన టీవీ ఛానళ్లు కొన్ని ఒప్పుగా వార్తలను ప్రసారం చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన జీవోను తాత్కాలికంగా నిలిపి, జాయింట్‌ కలెక్టర్ల దగ్గర అనుమతి తీసుకోమని హైకోర్టు తీర్పునిచ్చింది. దానికి అనుగుణంగా మీరెందుకు చేయరు? మా ఇష్టారాజ్యం అంటే ఎలా కుదురుతుంది? ఈ నెల 21న టికెట్‌ ధరల విషయమై కమిటీతో భేటీ, 22న సినిమాటోగ్రఫీ హోం సెక్రటరీ జీవోకు ఓ డ్రాఫ్ట్ రూపొందించి, లా డిపార్ట్‌మెంట్‌కు పంపించటం, 23 లేదా 24న జీవో రావటం.. ఇదీ నేపథ్యం. మా మిత్రుడు, మంత్రి (గౌతమ్‌ రెడ్డి) మరణం కారణంగా ఆలస్యమైంది. మంచి మనిషిని కోల్పోయిన బాధలో మేం ఉంటే జీవో రావట్లేదంటూ కొందరు విమర్శిస్తున్నారు. చావును కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. అలాంటి వారిని ఏమనాలి?’’

‘‘గౌతమ్‌రెడ్డి మరణించిన రోజు ఒకలా మాట్లాడిన వారు తర్వాత రోజు నుంచి మరో విధంగా మాట్లాడుతున్నారు. రాజకీయం కోసం దిగజారే చంద్రబాబులాంటి వారికి మనిషి విలువ తెలియదు. ఎవరు చనిపోయినా వారి శవాలతో రాజకీయం చేస్తుంటారాయన. గౌతమ్‌రెడ్డి మరణం కారణంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను వాయిదా వేసుకున్నవారు సినిమాను రెండు రోజులు పోస్ట్‌పోన్‌ చేసుకోలేరా? అలా జరగనప్పుడు ప్రస్తుతమున్న నిబంధనలే పరిగణనలోకి వస్తాయి. అంతెందుకు సినిమాను ఉచితంగా చూపిస్తామని అన్నారు కదా అలా చేయకుండా బ్లాక్‌లో టికెట్లు ఎందుకు విక్రయిస్తున్నారు. విడుదలవకముందే లోకేశ్‌ సినిమా బాగుంటుందని చెప్పుకొచ్చారు. సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నామన్నారు. మరి జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా వస్తుంటే ఇలా ఎప్పుడైనా అన్నారా? పవన్‌ కల్యాణ్‌కు మాకూ వన్‌సైడ్‌ లవ్‌ ఉండదని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఇప్పుడేం ఏం చెబుతారు?’’ అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని