Annaatthe: రజనీ మూవీలో బాల సుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట విన్నారా?

బాల సుబ్రహ్మణ్యం ఆలపించిన ‘అన్నాత్తే అన్నాత్తే’ గీతం విడుదలైంది. రజనీకాంత్‌ హీరోగా రూపొందుతోన్న చిత్రమిది. 

Published : 04 Oct 2021 20:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం భౌతికంగా ఈ లోకాన్ని విడిచివెళ్లినా సంగీత అభిమానుల మదిలో నిలిచే ఉన్నారు. అంతలా తన గానంతో అలరించారాయన. ఆయన అభిమానులకి ‘అన్నాత్తే’ చిత్ర బృందం ఎప్పటికీ మర్చిపోలేని కానుక అందించింది. బాల సుబ్రహ్మణ్యం చివరిగా ఈ సినిమా కోసం ‘అన్నాత్తే అన్నాత్తే’ అంటూ సాగే హుషారైన గీతాన్ని ఆలపించారు. తాజాగా ఆ పాటని చిత్ర బృందం విడుదల చేసింది. రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. శివ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం టైటిల్‌ గీతంతో ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎప్పటిలానే ఎస్పీబీ గానం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. వివేక రచించిన ఈ  పాటకి డి. ఇమ్మాన్‌ స్వరాలు సమకూర్చారు. కళానిధి సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ,  ప్రకాష్ రాజ్, రోబో శంకర్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సందర్భంగా రజనీకాంత్‌ భావోద్వేగమైన ట్వీట్‌ చేశారు. ‘‘నా నటన జీవితంలో 45ఏళ్ల పాటు ఎస్పీబీ నా గొంతుక అయ్యారు. ‘అన్నాత్తే’ కోసం ఆయన పాడిన ఈ పాట చివరిది అవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఎస్పీబీపై ఉన్న నాకున్న ప్రేమ ఆయన గాత్రం రూపంలో ఎప్పటికీ జీవించి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని