మాతృభాష విషయంలో ‘తానా’ కృషి అభినందనీయం: మన్నవ సుబ్బారావు

అమెరికాలోని మినియాపోలిస్‌లో తానా సంస్థ ఆధ్వర్యంలో ‘పాఠశాల’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అతిథులు సర్టిఫికెట్లు అందజేశారు. తెలుగు పుస్తకాలను

Updated : 22 Sep 2022 00:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలోని మినియాపోలిస్‌లో తానా సంస్థ ఆధ్వర్యంలో ‘పాఠశాల.. మన తెలుగు మన పిల్లల కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు పాఠశాల పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అతిథులు సర్టిఫికెట్లు అందజేశారు. తెలుగు పుస్తకాలను పంపిణీ చేశారు. తానా రీజనల్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. తెలుగు భాష తియ్యదనం, తెలుగుజాతి గొప్పతనాన్ని అమెరికాలో రుచి చూపించారన్నారు. భాషను భావితరాలకు అందజేసేందుకు తానా చేస్తున్న కృషి అభినందనీయం. భాషను చంపే తరంగా మనం మిగలకూడదు. ఇప్పటికే పాలకుల అనాలోచిత నిర్ణయాలు తెలుగుభాషకు శాపంగా మారాయి. కొన ఊపిరితో కొండెక్కుతున్న తెలుగు భాషను అమెరికాలోని తెలుగువారు బతికిస్తున్నారు. తమ మాతృభాషతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోతే ఆ జాతి అంతరిస్తుంది. ఒక జాతి అస్తిత్వాన్ని, ప్రత్యేకతను చాటి చెప్పేది మాతృభాషేనన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు.  

సాయి బొల్లినేని మాట్లాడుతూ.. భాష ఒక సాంస్కృతిక వారధి. తరాల మధ్య అంతరం రాకుండా మాతృభాష కాపాడుతుంది. మాతృమూర్తిని, మాతృభాషను, మాతృదేశాన్ని మరువకూడదన్నారు. భాష మానవ సంబంధాలను పెంపొందించి సమాజాన్ని విడిపోకుండా కాపలా కాస్తుందని పేర్కొన్నారు.  

అనంతరం పిల్లలు తెలుగులో చక్కటి గేయాలు, పద్యాలు పాడి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమంలో తానా పాఠశాల కోఆర్డినేటర్ మాలెంపాటి నాగరాజు, అరవపల్లి వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని