Asia Cup 2022: 15 రోజుల వ్యవధిలో మూడుసార్లు భారత్‌ x పాక్‌ మ్యాచ్‌లు!

 ఇండియా x పాకిస్థాన్‌ మ్యాచ్‌ అభిమానులకు ఎప్పుడూ పండగే.

Published : 05 Aug 2022 01:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇండియా x పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే క్రికెట్‌ అభిమానులకు ఎప్పుడూ పండగే. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ వంటి మెగా ఈవెంట్లలోనే క్రికెట్‌ ప్రేమికులకు ఈ ముచ్చట తీరుతుంది. అయితే, ఈ సారి ఆసియా కప్‌ పుణ్యమా అని 15 రోజుల వ్యవధిలో భారత్‌, పాక్‌ మూడు సార్లు పోటీపడే అవకాశం ఉంది. ఈ నెల 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్‌ ప్రారంభంకానుంది. భారత్‌ డిఫెడింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా, గత ఏడాది భారత్‌ను టీ 20 ప్రపంచకప్‌లో ఓడించామన్న ఉత్సాహంతో పాక్‌ ఆసియా కప్‌కు సిద్ధం అవుతోంది.

3 సార్లు ఎలా అంటే..!

ఈ ఏడాది ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు పోటీపడతాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు ఏ లో భారత్‌, పాక్‌లతోపాటు మరో క్వాలిఫయర్‌ జట్టు ఉంటుంది. ఈ గ్రూపులో అర్హత సాధించేందుకు యూఏఈ, సింగపూర్, హాంకాంగ్, కువైట్ క్వాలిఫయింగ్‌ మ్యాచులు ఆడనున్నాయి. ఈ నెల 28న  దుబాయ్‌ వేదికగా పాక్‌తో, ఆ తర్వాత 31న క్వాలిఫయర్‌ జట్టుతో టీమ్‌ఇండియా తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి నెగ్గినా భారత్‌ సూపర్‌ 4కు అర్హత సాధిస్తుంది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెప్టెంబర్‌ 4న సూపర్‌ 4లో తలపడతాయి. గ్రూప్‌ ఏలో భారత్‌, పాక్‌లు కొత్తజట్టుపై గెలవడం దాదాపు ఖాయం. దీంతో ఈ రెండు జట్లే సూపర్‌ 4లో మరోసారి ఆడే అవకాశం ఉంది. 

మరోవైపు గ్రూప్‌ బిలో శ్రీలంక, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ఉన్నాయి. బి గ్రూప్‌లో టాప్‌2 జట్లు సూపర్‌ 4లో మరోసారి ఆడుతాయి.  ఇలా రెండు గ్రూపుల్లోని టాప్‌ 2 జట్లు సూపర్‌ 4లో మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడతాయి. అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యాక, ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్లు సెప్టెంబర్‌ 13న ఫైనల్‌ పోరులో టైటిల్‌ కోసం పోటీపడతాయి. ప్రస్తుత ఫామ్‌ చూస్తే భారత్‌, పాక్‌లే ఫేవరెట్‌లుగా బరిలోకి దిగుతున్నాయి. దీంతో సూపర్‌ 4లో కూడా ఈ రెండు జట్లే ఆధిపత్యం చలాయించి, ఫైనల్‌లో మరోసారి తలపడే అవకాశం ఉంది. ఇదే నిజమైతే క్రికెట్‌ అభిమానులు ఈ ఆసియా కప్‌లో దాయాదుల సమరాన్ని మూడుసార్లు వీక్షించే అవకాశం దక్కుతుంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని