Jasprit Bumrah: బుమ్రాపై ‘వైట్‌ బాల్’ స్పెషలిస్ట్‌ ముద్ర.. కానీ, ఆ రోజు..: రవిశాస్త్రి

టీమ్‌ఇండియా స్టార్లు విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రాపై మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Published : 10 Feb 2024 14:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో భారత్‌ నుంచి అగ్రస్థానం సాధించిన తొలి పేసర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో వేగంగా 150 వికెట్లు తీసిన భారత పేసర్‌గానూ అవతరించాడు. 2018లో టెస్టుల్లోకి అడుగు పెట్టిన బుమ్రా ఇప్పటి వరకు 34 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 155 వికెట్లు తీశాడు. భారత ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఉన్న సమయంలోనే బుమ్రా సుదీర్ఘ ఫార్మాట్‌లోకి వచ్చాడు. అంతకుముందు వరకూ బుమ్రాపై ‘వైట్ బాల్’ స్పెషలిస్ట్‌గానే ముద్ర వేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రవిశాస్త్రి (Ravi Shastri) వెల్లడించాడు.

‘‘నేను తొలిసారి బుమ్రాతో మాట్లాడిన రోజు ఇప్పటికీ గుర్తుంది. అది కోల్‌కతాలో అనుకుంటా! టెస్టు క్రికెట్‌ ఆడే ఆసక్తి ఉందా? లేదా? అని అడిగా. ‘అలాంటి అవకాశమే వస్తే నా జీవితంలో అతిపెద్ద రోజుగా మిగిలిపోతుంది’ అని బుమ్రా అన్నాడు. అప్పటి వరకూ అతడిని కేవలం ‘వైట్‌ బాల్’ స్పెషలిస్ట్‌గానే చూశారు. అతడికి ఇష్టం లేకపోయినా అలా ముద్ర వేసేశారు. కానీ, బుమ్రాలో వికెట్లు తీయాలనే కసి, ఆకలి ఉందని నాకు తెలుసు. దీంతో టెస్టులు ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అతడికి చెప్పా. దక్షిణాఫ్రికా పర్యటనకు తీసుకెళ్తానన్నా. బుమ్రా కూడా టెస్టు అరంగేట్రం చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు. విరాట్‌తో కలిసి టెస్టులు ఆడాలనేది అతడి కోరిక. చాలా మంది క్రికెటర్లు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతాలు చేసిన వారున్నారు. ఎవరికీ ఆ గణాంకాలు గుర్తుండవు. కానీ, టెస్టుల్లో ఎలా ఆడారనేదే అభిమానులు చూస్తారు. సుదీర్ఘ ఫార్మాట్‌కు అంత విలువ ఉంది’’ అని రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు.

అప్పుడు సానబెట్టని వజ్రంలా కోహ్లీ

భారత జట్టు డైరక్టర్‌గా 2014లో రవిశాస్త్రి సేవలందించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో విదేశీ గడ్డపై టీమ్‌ఇండియా అద్భుత విజయాలు సాధించడంలో రవిశాస్త్రి కీలక పాత్ర పోషించాడు. విరాట్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే విరాట్ కోహ్లీపై నా దృష్టిపడింది. నేను బాధ్యతలు తీసుకున్న రెండో నెలలోనే కోహ్లీకి ఓ విషయం చెప్పా. భవిష్యత్తులో కెప్టెన్సీ చేపట్టాల్సి ఉంటుంది. ‘నిశితంగా గమనించు. ప్రతి అంశాన్నీ పరిశీలించు. సిద్ధంగా ఉండు’ అని కోహ్లీతో అన్నాను. అప్పటికి విరాట్ నాకు ఇంకా సానబెట్టని వజ్రంలా కనిపించాడు. సారథ్యం చేపట్టిన తర్వాత కోహ్లీ టెస్టు క్రికెట్‌పై పూర్తి స్థాయి దృష్టిసారించాడు. క్లిష్టమైన పిచ్‌లపైనా జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. ఆసీస్‌ లేదా పాకిస్థాన్‌ ప్రత్యర్థి ఎవరైనా సరే దూకుడుగా వ్యవహరించాం’’ అని మాజీ ప్రధాన కోచ్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని