India vs Afghanistan: సూపరో.. సూపర్
బుధవారం.. చిన్నస్వామి స్టేడియంలో ఆ రెండు జట్లు! తిరుగులేని ఫేవరెట్గా భారత్.. కనీస పోటీ అయినా ఇవ్వాలనే లక్ష్యంతో అఫ్గానిస్థాన్! రోహిత్సేన అప్పటికే సిరీస్ గెలవడం వల్ల అదో నామమాత్ర మ్యాచే అందరి దృష్టిలో!
అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి రెండో సూపర్ ఓవర్లో తేలిన ఫలితం
ఉత్కంఠ పోరులో అఫ్గాన్పై భారత్ విజయం
సిరీస్ 3-0తో క్లీన్స్వీప్
రోహిత్ మెరుపు శతకం
భారత్ 212/4 - అఫ్గాన్ 212/6
బెంగళూరు
బుధవారం.. చిన్నస్వామి స్టేడియంలో ఆ రెండు జట్లు! తిరుగులేని ఫేవరెట్గా భారత్ (India vs Afghanistan).. కనీస పోటీ అయినా ఇవ్వాలనే లక్ష్యంతో అఫ్గానిస్థాన్! రోహిత్సేన అప్పటికే సిరీస్ గెలవడం వల్ల అదో నామమాత్ర మ్యాచే అందరి దృష్టిలో! కానీ అది ఎప్పటికీ గుర్తుండిపోయే పోరవుతుందని ఎవరూ ఊహించలేదు. బ్యాటర్ల విధ్వంసక విన్యాసాలతో.. ఫోర్లు, సిక్స్ల మోతతో.. పరుగుల వరదతో, నరాలు తెగే ఉత్కంఠతో.. నామమాత్రమనుకున్న మ్యాచ్ కాస్తా అభిమానులను ఉర్రూతలూగించింది. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టి హద్దుల్లేని వినోదాన్ని పంచింది.
వారెవ్వా ఏం ఆట! విజయం దోబూచులాడుతుంటే, బంతి బంతికీ ఉత్కంఠ పెరిగిపోతుంటే.. ముగింపు అత్యంత రసవత్తరంగా సాగింది. చివరికి విజేత టీమ్ఇండియానే అయినా.. అఫ్గానిస్థాన్ కూడా అద్భుత పోరాటపటిమతో మనసులు గెలుచుకుంది. జట్లు ఎంత హోరాహోరీగా తలపడ్డాయంటే.. అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ ఫలితం తొలిసారి రెండో సూపర్ ఓవర్లో తేలింది. మెరుపు సెంచరీతో రోహిత్ భారత్ విజయంలో హీరోగా నిలిచాడు. రింకు ఇన్నింగ్స్ కూడా అమూల్యమైందే. రెండు జట్లూ 212 పరుగులు చేయడంతో మొదట మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్లో టీమ్ఇండియా నిలిచింది.
హమ్మయ్య.. టీమ్ఇండియా గెలిచింది. బుధవారం ఉత్కంఠ ఊపేసిన మూడో టీ20లో భారత జట్టు రెండో సూపర్ ఓవర్లో అఫ్గాన్ను ఓడించింది. మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. రోహిత్ శర్మ (121 నాటౌట్; 69 బంతుల్లో 11×4, 8×6), రింకు సింగ్ (69 నాటౌట్; 39 బంతుల్లో 2×4, 6×6) మెరుపులతో మొదట భారత్ 4 వికెట్లకు 212 పరుగులు సాధించింది. నైబ్ (55 నాటౌట్; 23 బంతుల్లో 4×4, 4×6), గుర్బాజ్ (50; 32 బంతుల్లో 3×4, 4×6), ఇబ్రహీం జద్రాన్ (50; 41 బంతుల్లో 4×4, 1×6) చెలరేగడంతో అఫ్గాన్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 212 పరుగులే చేసింది. ఫలితంగా ఆట సూపర్ ఓవర్కు వెళ్లింది. అందులో మొదట అఫ్గాన్ 16 పరుగులు చేస్తే.. భారత్ కూడా అన్నే పరుగులు సాధించడంతో రెండో సూపర్ ఓవర్ తప్పలేదు. రెండో సూపర్ ఓవర్లో మొదట భారత్ 11 పరుగులే చేయడంతో గెలుపు కష్టమే అనుకున్నారంతా! కానీ అద్భుతంగా బౌలింగ్ చేసిన రవి బిష్ణోయ్ మూడు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి అఫ్గాన్ ఇన్నింగ్స్ను ముగించాడు. భారత్ను ఆనందంలో ముంచెత్తాడు. మారిన నిబంధనల ప్రకారం ఫలితం తేలే వరకు ఎన్ని సూపర్ ఓవర్లయినా ఆడాలి.
పట్టు వదలని నైబ్..: లక్ష్యం చాలా పెద్దదే అయినా.. ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ రాణించడంతో 10 ఓవర్లలో 85/0తో అఫ్గాన్ రేసులో నిలిచింది. ముఖ్యంగా గుర్బాజ్ చెలరేగిపోయాడు. అవేష్, మకేశ్, దూబె బ్యాటర్లకు అడ్డుకట్ట వేయలేకపోయారు. 11వ ఓవర్లో గుర్బాజ్ను కుల్దీప్ ఔట్ చేయడంతో భారత్కు ఎట్టకేలకు వికెట్ లభించింది. 13వ ఓవర్లో ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లాలను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేయడం అఫ్గాన్ ఆశలకు పెద్ద దెబ్బ. చివరి ఏడు ఓవర్లలో అఫ్గాన్ 105 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ గెలుపుపై సందేహాలే లేవు. కానీ. నైబ్, నబి (34) వీర విధ్వంసంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 6 ఓవర్ల వ్యవధిలో 66 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్లో అఫ్గాన్కు 19 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో జోరు మీదున్న నైబ్. తీవ్ర ఒత్తిడిలో బౌలర్ ముకేశ్. తొలి బంతికి వైడ్ వేశాడు. తర్వాతి బంతికి నైబ్ ఫోర్ కొట్టాడు. ముకేశ్ ఓ డాట్ బాల్ వేసినా.. వెంటనే మరో వైడ్ వేశాడు. ఆ తర్వాతి బంతికి నైబ్ రెండు పరుగులు తీశాడు. నాలుగో బంతికి నైబ్ సిక్స్ బాదడంతో అఫ్గాన్కు చివరి రెండు బంతుల్లో అయిదు పరుగులు అవసరయ్యాయి. నైబ్..అయిదో బంతికి 2, ఆఖరి బంతికి 2 పరుగులు తీయడంతో మ్యాచ్ టై అయింది. ఆట సూపర్ ఓవర్కు వెళ్లింది.
22/4 నుంచి: 212/4.. టీమ్ఇండియాకు ఇంత భారీ స్కోరు ఏమాత్రం ఊహించనిదే. ఎందుకంటే కనీస పోరాటానికి అవసరమైన స్కోరైనా చేస్తుందా అనిపించింది ఓ దశలో. ఆరంభం అంత ఘోరం మరి. 5 ఓవర్లలో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. అయినా భారత్ కొండంత లక్ష్యాన్ని నిర్దేశించిందంటే అది రోహిత్ మెరుపు సెంచరీ, రింకు సింగ్తో అతడి అద్భుత భాగస్వామ్యం చలవే. జట్టు కష్టాల్లో ఉన్న దశలో రింకు కూడా అదిరే ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభం అత్యంత పేలవం. అఫ్గాన్ బౌలర్ ఫరీద్ తొలి మూడు ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. నిజానికి 18 పరుగుల వరకు భారత్ ఒక్క వికెట్టూ కోల్పోలేదు. కానీ 4 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు చేజార్చుకుంది. మూడో ఓవర్లో ఫరీద్ వరుస బంతుల్లో జైస్వాల్ (4), కోహ్లి (0)లను ఔట్ చేసి భారత్కు షాకిచ్చాడు. తన తర్వాతి ఓవర్లో సంజు శాంసన్ (0)నూ ఔట్ చేశాడు. ఈ మధ్యలో శివమ్ దూబె (1)ను అజ్మతుల్లా వెనక్కి పంపాడు. రోహిత్ శర్మ క్రీజులో ఉన్నా.. మరో వైపు వికెట్లు పడుతుండడంతో సాధికారికంగా ఆడలేకపోయాడు. 6 ఓవర్లలో 30/4తో టీమ్ఇండియా పరిస్థితి సంకటంగానే ఉంది. కానీ రింకుతో కలిసి రోహిత్ జట్టును ఆదుకున్నాడు. ఇద్దరూ ముందు ఇన్నింగ్స్ను కుదుటపరిచారు. 11 ఓవర్లకు స్కోరు 65/4. ఆ తర్వాతి ఓవర్ నుంచి మోత మొదలైంది. కానీ రోహిత్, రింకుల విధ్వంసంతో భారత్ ఎవరూ ఊహించనంత స్కోరు సాధించింది. ఫోర్లు, సిక్స్లతో అఫ్గాన్ బౌలింగ్ను తుత్తునియలు చేసిన ఈ జంట.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ బ్యాటర్ల విధ్వంసంతో ఆఖరి 9 ఓవర్లలో టీమ్ఇండియా ఏకంగా 147 పరుగులు రాబట్టింది.
దంచేశాడు..: చాలా ఊహాగానాల మధ్య.. ప్రపంచకప్ నేపథ్యంలో టీ20ల్లోకి (ఈ సిరీస్తో) పునరాగమనం చేశాడు. తొలి మ్యాచ్లో డకౌట్. రెండో మ్యాచ్లో డకౌట్. ఫలితం అతడి ఆటపై, ప్రపంచకప్కు అతడి సంసిద్ధతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అనేక సందేహాలను పటాపంచలు చేస్తే.. అన్ని ప్రశ్నలకూ తన బ్యాటుతోనే సమాధానమిచ్చాడు రోహిత్. టీ20 క్రికెట్లో అయిదో శతకంతో తనలో హిట్మ్యాన్ ఇంకా అలాగే ఉన్నాడని చాటుకున్నాడు. అదిరే ఇన్నింగ్స్తో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. ఆరంభంలో రోహిత్ కాస్త ఇబ్బంది పడ్డాడు. ఎదుర్కొన్న ఏడో బంతికి కానీ ఖాతా తెరవలేకపోయాడు. కానీ క్రమంగా వేగంగా పెంచాడు. రింకు సింగ్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాక రెచ్చిపోయి ఆడాడు .41 బంతుల్లో అర్ధశతకం సాధించిన అతడు.. సెంచరీకి చేరుకోవడానికి మరో 23 బంతులే ఆడాడంటే ఎలా రెచ్చిపోయాడో అర్థం చేసుకోవచ్చు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో (జనత్) రోహిత్ వరుసగా 4, 6, 6 బాదేశాడు. రింకుతో అభేద్యమైన అయిదో వికెట్కు రోహిత్.. 190 పరుగులు జోడించాడు. రింకుది కూడా అంతే విలువైన ఇన్నింగ్స్. జట్టులోకి వచ్చినప్పటి నుంచి నిలకడగా రాణిస్తోన్న అతడు.. మరోసారి తన విలువను చాటుకున్నాడు. జట్టు ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యలో తొలి 19 బంతుల్లో 21 పరుగులు చేసిన అతడు.. పరిస్థితి మెరుగుపడ్డాక చెలరేగి పోయాడు.
భారత్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) నబి (బి) ఫరీద్ 4; రోహిత్ నాటౌట్ 121; కోహ్లి (సి) ఇబ్రహీం జద్రాన్ (బి) ఫరీద్ 0; శివమ్ దూబె (సి) గుర్బాజ్ (బి) అజ్మతుల్లా 1; సంజు శాంసన్ (సి) నబి (బి) ఫరీద్ 0; రింకు సింగ్ నాటౌట్ 69; ఎక్స్ట్రాలు 17 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 212; వికెట్ల పతనం: 1-18, 2-18, 3-21, 4-22; బౌలింగ్: ఫరీద్ అహ్మద్ 4-0-20-3; అజ్మతుల్లా 4-0-33-1; ఖైస్ అహ్మద్ 4-0-28-0; మహ్మద్ సలీమ్ 3-0-43-0; అష్రాఫ్ 2-0-25-0; కరీమ్ జనత్ 3-0-54-0
అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) సుందర్ (బి) కుల్దీప్ 50; ఇబ్రహీం జద్రాన్ (స్టంప్డ్) శాంసన్ (బి) సుందర్ 50; నైబ్ నాటౌట్ 55; అజ్మతుల్లా (సి) రవి బిష్ణోయ్ (బి) సుందర్ 0; నబి (సి) అవేష్ (బి) సుందర్ 34; కరీమ్ జనత్ రనౌట్ 2; నజిబుల్లా (సి) కోహ్లి (బి) అవేష్ 5; షరాఫుద్దీన్ నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 212; వికెట్ల పతనం: 1-93, 2-107, 3-107, 4-163, 5-167, 6-182; బౌలింగ్: ముకేశ్ 4-0-44-0; అవేష్ ఖాన్ 4-0-55-1; రవి బిష్ణోయ్ 4-0-38-0; వాషింగ్టన్ సుందర్ 3-0-18-3; శివమ్ దూబె 2-0-25-0; కుల్దీప్ 3-0-31-1
5
అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ సెంచరీలు. అత్యధిక శతకాల రికార్డు అతడిదే. మాక్స్వెల్, సూర్యకుమార్లను అధిగమించాడు.
- 2020లో ఐసీసీ కొత్త సూపర్ ఓవర్ నిబంధనను ప్రవేశపెట్టింది. మ్యాచ్ టై అయినప్పుడు సూపర్ ఓవర్లో ఫలితం తేలకుంటే.. ఎవరో ఒకరు విజేతగా నిలిచేవరకు సూపర్ ఓవర్లు నిర్వహిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
చెన్నై జట్టుకు గాయాలు ఇబ్బందిగా మారాయి. యువ పేసర్ పతిరన గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. -
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!