Sirivennela Seetharama Sastry: నీ ఉచ్ఛ్వాసం కవనం.. నీ నిశ్వాసం శోకం
సిరివెన్నెలలో ఆడుకున్న అక్షరాలపై అమావాస్య చీకట్లు అలముకున్నాయి. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా? అంటూ సమాజాన్ని నిగ్గదీసిన యోచనా రుషి శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు. మూడున్నర దశాబ్దాలపాటు తన అక్షరాస్త్రాలతో సామాజిక రుగ్మతలను చెండాడిన కలం యోధుడు కన్నుమూశాడు.
తుదిశ్వాస విడిచిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి
గతంలో ఊపిరితిత్తుల కేన్సర్కు సర్జరీ
ఇటీవల రెండోవైపు మరోసారి శస్త్రచికిత్స
ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సహా రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం
ఈనాడు - హైదరాబాద్
సిరివెన్నెలలో ఆడుకున్న అక్షరాలపై అమావాస్య చీకట్లు అలముకున్నాయి. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా? అంటూ సమాజాన్ని నిగ్గదీసిన యోచనా రుషి శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు. మూడున్నర దశాబ్దాలపాటు తన అక్షరాస్త్రాలతో సామాజిక రుగ్మతలను చెండాడిన కలం యోధుడు కన్నుమూశాడు. అభ్యుదయాన్ని జాలువార్చి... ఆశావాదాన్ని రంగరించి... చైతన్యాన్ని ప్రోది చేసి... కుర్రకారుపై చిలిపి ప్రేమలనూ చిలకరించిన సీతారామశాస్త్రి సిరా శాశ్వతంగా ఇంకిపోయింది. ‘చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ...’ అంటూ నింగికెగసిపోయింది. ‘నటరాజస్వామి జటాఝూటిలోకి చేరకుంటే.. విరుచుకుపడు సురగంగకు విలువేముందీ’... అంటూ ‘కల’చాలనం చేసిన సాహితీ శిఖరం ఒరిగిపోయింది. ‘ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్లిన పదాలు... ఝల్లుఝల్లున ఉప్పొంగిన జనహృదయాల’కు తీరని శోకం మిగిల్చింది.
తెలుగు తెరకు వెన్నెలసోన లాంటి పదాలతో అక్షరకాంతులు అద్దిన ప్రముఖ గేయ రచయిత ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’(66) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు కన్నుమూశారు. ఆరోగ్యం తీవ్రంగా విషమించి ఆయన తుదిశ్వాస విడిచినట్లు కిమ్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.భాస్కరరావు తెలిపారు. ‘‘సీతారామశాస్త్రికి ఆరేళ్ల క్రితం ఊపిరితిత్తులకు కేన్సర్ సోకింది. సర్జరీ చేసి కొంత భాగం తొలగించారు. తర్వాత గుండెలో సమస్య తలెత్తడంతో బైపాస్ సర్జరీ చేశారు. మళ్లీ కొద్ది రోజుల క్రితం ఊపిరితిత్తులకు రెండోవైపు కేన్సర్ కన్పించింది. బంజారాహిల్స్లోని ఓ ఆసుపత్రిలో చేరడంతో సర్జరీ చేసి కొంత భాగం తొలగించారు. రెండురోజుల వరకు ఆరోగ్యం నిలకడగానే ఉంది. తర్వాత న్యుమోనియా, ఇతర సమస్యలు తలెత్తాయి. నవంబరు 24న కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తొలి రెండు రోజులు ఆయన చికిత్సకు స్పందించారు. న్యుమోనియా ఇతర సమస్యలతో ఆక్సిజన్ సక్రమంగా అందలేదు. దీంతో ఎక్మో యంత్రం సాయం అందించాం. అయిదు రోజుల నుంచి ఆయన ఎక్మోపైనే చికిత్స పొందారు. అప్పటికే కేన్సర్ సోకడం.. గతంలో బైపాస్ సర్జరీ.. దీనికితోడు అధిక బరువు ఇతర సమస్యలతోపాటు కిడ్నీలు విఫలమయ్యాయి. కిమ్స్ వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆరోగ్యం పూర్తిగా విషమించింది’’ అని డాక్టర్ భాస్కరరావు వివరించారు. సిరివెన్నెల మృతికి ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్మోహన్రెడ్డి సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.
‘సిరివెన్నెల’ చిత్రంతో విధాత తలపున.. పాటతో ప్రాచుర్యం పొందిన ఆయన ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఎనిమిది వందలకు పైగా చిత్రాల్లో మూడు వేలకు పైగా పాటలు రచించిన సిరివెన్నెల అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. సినీ పరిశ్రమకు చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం 2019లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 11 నంది పురస్కారాలు ఆయనకు దక్కాయి. తన పాటలతో తెలుగు ప్రేక్షకుడి స్థాయిని పెంచిన శాస్త్రి 1955 మే 20న చేంబోలు వేంకటయోగి, సుబ్బలక్ష్మి దంపతులకు ప్రథమ సంతానంగా మధ్యప్రదేశ్లోని శివనిలో జన్మించారు. ఆయన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం అనకాపల్లిలో జరిగాయి. కాకినాడలో ఇంటర్మీడియట్ చేశారు. ఆ తర్వాత ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్లో చేరారు. ఏడాది పూర్తయ్యాక టెలికంలో అసిస్టెంట్గా ఉద్యోగం రావడంతో చదువుకు స్వస్తి పలికి అందులో చేరారు. రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, కాకినాడలలో పనిచేశారు. ఆ సమయంలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా అందుకున్నారు. ఎంఏ ప్రథమ సంవత్సరంలో చదువు ముగించారు. కాకినాడలో పనిచేస్తున్నప్పుడు ఏర్పడిన సాహితీ పరిచయాలు ఆయన జీవితాన్ని మలుపుతిప్పాయి. ‘భరణి’ అనే కలం పేరుతో పత్రికల్లో కథలు, కవితలు రాసిన ఆయన.. మిత్రులు, సోదరుడి ప్రోత్సాహంతో రచనా వ్యాసంగంపై దృష్టి పెట్టారు. ఆ సమయంలోనే ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ ‘సిరివెన్నెల’ సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. మొదట బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘జననీ జన్మభూమి’ సినిమాతో సీతారామశాస్త్రి సినీ ప్రయాణం మొదలైనా, ‘సిరివెన్నెల’ పాటలతోనే ఆయనకు గుర్తింపు లభించింది. ఆ సినిమాలోని ‘విధాత తలపున..’ పాటకు తొలి నంది పురస్కారం లభించింది. ఆపై కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకూ పాటలు రచించారు. కళాతపస్వితో పాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సిరివెన్నెలను ప్రేమగా సీతారాముడు అని పిలిచేవారు. మూడున్నర దశాబ్దాలుగా సాగుతున్న ‘సిరివెన్నెల’ సినీ ప్రయాణం ఆయన తుదిశ్వాస వరకు కొనసాగింది. ఇటీవలి ‘నారప్ప’, ‘కొండపొలం’, ‘ఆర్.ఆర్.ఆర్’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలకూ ఆయన పాటలు రాశారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న సిరివెన్నెల
జగమంత కుటుంబం ఆయనది..
‘చక్రం’ సినిమా కోసం ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అంటూ తన కలాన్ని కదిలించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అందుకు తగ్గట్టే జగమంత తెలుగు కుటుంబాన్ని, వాళ్ల ప్రేమాభిమానాల్ని సంపాదించుకున్నారు. ‘సిరివెన్నెల’ పాట లేకుండా సినిమా చేయడానికి ఇష్టపడని దర్శక నిర్మాతలు, కథానాయకులు చాలామందే ఉన్నారు. ఆయనకు భార్య పద్మావతి, కుమార్తె లలితాదేవి, కుమారులు సాయి వెంకట యోగేశ్వరశర్మ, రాజా భవానీ శంకరశర్మ (రాజా) ఉన్నారు. యోగేశ్వరశర్మ సంగీత దర్శకుడిగా, రాజా నటుడిగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ వీరికి దగ్గరి బంధువు. తాను దర్శకత్వం వహించే ప్రతి సినిమాలోనూ సీతారామశాస్త్రి పాట ఉండాల్సిందే అంటుంటారు త్రివిక్రమ్.
పాటలకు కిరీటాలు..
‘సిరివెన్నెల’లోని ‘విధాత తలపున’., ‘శ్రుతిలయలు’లోని ‘తెలవారదేమో స్వామి’, ‘స్వర్ణకమలం’లోని ‘అందెల రవమిది పదములదా’.., ‘గాయం’లోని ‘సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని’.., ‘శుభలగ్నం’లోని ‘చిలకా ఏ తోడు లేకా’.., ‘శ్రీకారం’ సినిమాలోని ‘మనసు కాస్త కలత పడితే’.., ‘సిందూరం’లోని ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే’.., ‘ప్రేమకథ’లోని ‘దేవుడు కనిపిస్తాడని’.., ‘చక్రం’ సినిమాలోని ‘జగమంత కుటుంబం నాది’.., ‘గమ్యం’లోని ‘ఎంత వరకు ఎందు కొరకు’.., ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లోని ‘మరీ అంతగా..’ పాటలకుగానూ సిరివెన్నెలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలు దక్కాయి.
నేడు అంత్యక్రియలు..
సిరివెన్నెల భౌతిక కాయానికి బుధవారం హైదరాబాద్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల సందర్శన కోసం తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆవరణలో ఉంచనునున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
విషాదంలో చిత్రపరిశ్రమ
తెలుగు సినిమా పాటకు రెండు కళ్లలాంటి వారు వేటూరి, సిరివెన్నెల. వేటూరి మనకు ఇదివరకే దూరం కాగా, ఇప్పుడు సిరివెన్నెల సెలవు పలకడంతో తెలుగు పాట విషాదంలో మునిగిపోయింది. సిరివెన్నెల ఇక లేరని తెలియగానే చిత్రసీమ మూగబోయింది. ఆయనతో అనుబంధం ఉన్న పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు, తోటి రచయితలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మనసు పొరల్లో గూడు కట్టుకున్న అజ్ఞానాంధకారాన్ని పారదోలేలా పదునైన పదాలతో అక్షర వెన్నెలను కురిపించారు.. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అంటూ ఆశాజ్యోతులు వెలిగించారు..
తరలిరాదా తనే వసంతం.. తన దరికిరాని వనాల కోసం’ అంటూ పీడితులను ఊరడించారు.. ‘తన వేళ్లే సంకెళ్లై కదలలేని మొక్కలా.. ఆమనికై ఎదురుచూస్తూ ఆగిపోకు ఎక్కడా’.. అంటూ నిరాశావాదులను వెన్నుతట్టారు.
సినిమా పాటంటే ఆ సందర్భాన్ని సన్నివేశాన్ని మాత్రమే పూరించేది కాదనీ, దానికీ ఎంతో అర్థం, పరమార్థం, పది కాలాల ఆయుర్దాయం ఉంటాయని నిరూపించారాయన.. తన పాళీని అమృతంలో అద్ది సాహితీ సేద్యం చేసి అక్షరాలను అజరామరం చేసిన శ్రామికుడు.. అక్షర సేద్యాన్ని అర్ధంతరంగా వదిలేసి వెళ్లిపోయిన పాటల తోటమాలి.
సినీ సాహిత్యం ఆయనతో సుసంపన్నం
- జస్టిస్ ఎన్.వి.రమణ, సీజేఐ
నలుగురి నోట పది కాలాలు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సీతారామశాస్త్రి సుసంపన్నం చేశారు. తెలుగు సినీ నేపథ్య గీతాల్లో సాహిత్యం పాలు తగ్గుతున్న తరుణంలో శాస్త్రి ప్రవేశం పాటకు ఊపిరులూదింది. ఆ సాహితీ విరించికి నా శ్రద్ధాంజలి.
కోలుకుంటారనుకున్న తరుణంలో విషాదం
- ఎం.వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
ఈనాడు, దిల్లీ: సినీగేయ రచయిత సీతారామశాస్త్రి పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తొలి సినిమా సిరివెన్నెలను ఇంటిపేరుగా మార్చుకొని తెలుగుభాషకు పట్టం కడుతూ.. ఆయన రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించేవారిలో నేనూ ఒకణ్ని. ఆయన అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిసి కిమ్స్ వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాను. త్వరలోనే కోలుకుంటారని భావిస్తుండగా ఈ వార్త వినాల్సి రావడం విచారకరం. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి.
నన్నెంతో బాధించింది: ప్రధాని మోదీ
అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల మరణం నన్నెంతగానో బాధించింది. ఆయన రచనలలో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను.
హత్తుకునే సాహిత్యం: హోంమంత్రి అమిత్షా
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 3 వేలకు పైగా పాటలకు మనస్సుకు హత్తుకొనే రీతిలో సాహిత్యాన్ని అందించి, 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు పొందిన పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం బాధాకరం.
అద్భుత సాహితీ కర్త: గవర్నర్ తమిళిసై
ఈనాడు, హైదరాబాద్: తెలుగు సినీగేయ రచయిత సిరివెన్నెల మరణంతో సినీ పరిశ్రమ గొప్ప సాహితీవేత్తను కోల్పోయింది. ఆయన అద్భుత సాహిత్యాన్ని సృష్టించారు. సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.
ఆయనలేని లోటు పూడ్చలేనిది: కిషన్రెడ్డి
సిరివెన్నెలలేని లోటు పూడ్చలేనిది. శాస్త్రితో 1985 నుంచి పరిచయం ఉంది. సినిమాల్లోకి రాకముందు నుంచే ఆర్.ఎస్.ఎస్.తో సాన్నిహిత్యం ఉంది. ఇటీవల హైదరాబాద్లో నన్ను కలసి దేశభక్తి పాటల సీడీ ఇచ్చి వెళ్లారు. దేశభక్తి పాటల రచనలో ఆయనది మహోన్నత స్థానం.
హరియాణా గవర్నర్ దత్తాత్రేయ సంతాపం
సిరివెన్నెల ఆకస్మిక మరణం పట్ల హరియాణా గవర్నర్ దత్తాత్రేయ సంతాపం తెలిపారు. తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం ప్రకటించారు.
విలువల శిఖరం: జగన్, ఏపీ సీఎం
తెలుగు సినీగేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఉండిపోతాయి.
పాటతో చైతన్యం: చంద్రబాబు, తెదేపా అధినేత
అంచెలంచెలుగా ఎదిగిన సీతారామశాస్త్రి జీవితం యువతకు ఆదర్శం. తన పాటలతో తెలుగు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు.
తీరని లోటు: పవన్ జనసేన అధినేత
తెలుగు సాహిత్యానికి సీతారామశాస్త్రి మరణం తీరని లోటు. వాగ్దేవీ వరప్రసాదంగా తెలుగునాట నడయాడిన విద్వత్కవి సిరివెన్నెల.
హృదయాలను గెలిచారు: సీఎం కేసీఆర్
సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న సిరివెన్నెల సాహిత్య ప్రస్థానం సామాజిక, సంప్రదాయ అంశాలను స్పృశిస్తూ సాగింది. పండిత పామరుల హృదయాలను ఆయన గెలిచారు. సిరివెన్నెల మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీతసాహిత్యాభిమానులకు తీరని లోటు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
నడి వేసవిలో వణికించిన వాన
భగభగమనే ఎండలతో దాదాపు 10 రోజులుగా అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. మంగళవారం ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. -
మేడిగడ్డ రెండు గేట్లను పూర్తిగా తొలగించండి
‘కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగిన ఏడో బ్లాకులో తెరుచుకోని ఎనిమిది రేడియల్ గేట్లలో రెండింటిని పూర్తిగా తొలగించాలి. -
‘రైతు భరోసా’ బంద్
‘రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు అందజేసే పంట సాయం పంపిణీని తక్షణం నిలుపుదల చేయాలి. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. -
అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్
యూఎస్లో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ నెల 31 వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ సమయాల (స్లాట్స్)ను అమెరికా ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బీసీ, సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
రైతుభరోసాపై త్వరలో విధివిధానాలు
రాష్ట్రంలోని అర్హులైన రైతులకే రైతుభరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
ప్రధాని మోదీతో పీవీ కుటుంబ సభ్యుల భేటీ
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు. -
20 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో మే 14 వరకు, సీబీఐ కేసులో 20 వరకు పొడిగించింది. -
ఓట్ల ప్రయాణంలో.. నోట్ల దోపిడీ
ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అన్న తేడా లేదు. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి. రైళ్లలో నెల క్రితమే అయిపోయి.. వెయిటింగ్ లిస్టులు వందలు దాటేశాయి. -
50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలి
తెలంగాణలో 50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలని పీఆర్టీయూటీఎస్ సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
కనీస వేతనం రూ.30 వేలు ఉండాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ.30 వేలు, గరిష్ఠ వేతనం రూ.2,48,150, ఫిట్మెంట్ 30 శాతంతో కొత్త పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్యూటీఎఫ్) శివశంకర్ను కోరింది. -
ముఖ గుర్తింపు విధానం నుంచి మినహాయించండి!
తెలంగాణలోని పాఠశాలల్లో హాజరు నమోదుకు కొత్త విద్యాసంవత్సరం నుంచి చేపడుతున్న ముఖగుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానం నుంచి అంధ ఉపాధ్యాయులకు మినహాయింపునివ్వాలని రాష్ట్ర అంధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.మల్లేశం, రాఘవేందర్రెడ్డి, ఇతర నేతలు అనిల్కుమార్, జి.మల్లేశ్, నాగేంద్రమ్మలు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కోరారు. -
గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫైన్ ఆర్ట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోర్సులు
గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని మహిళల ఫైన్ ఆర్ట్స్ అకాడమీ (సిరిసిల్ల)లో బీఏ ఆనర్స్ ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ-డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. -
టీఎస్ఈఏపీసెట్కు తొలిరోజు 90 శాతానికి పైగా హాజరు
తెలంగాణలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీఎస్ఈఏపీసెట్-2024’ పరీక్షకు మంగళవారం 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. -
కర్ణాటకలో నేడు కృష్ణా జలాల విడుదల
కర్ణాటక నుంచి తెలంగాణకు బుధవారం కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్ నుంచి 1.9 టీఎంసీల నీటిని దిగువకు వదిలేందుకు అక్కడి జలవనరుల శాఖ అంగీకరించింది. -
భూగర్భ జలాలు వేగంగా ఖాళీ!
రాష్ట్రంలో భూగర్భ జలాలు చాలా వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ప్రాజెక్టులు, ఇతర నీటి వనరులకు ఈ ఏడాది ఆశించిన మేర ప్రవాహాలు రాలేదు. చెరువులు, నీటి కుంటలు ఎండిపోయాయి. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత మొక్కజొన్న పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!