Mekapati Goutham Reddy: ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌

Updated : 22 Feb 2022 05:42 IST

హైదరాబాద్‌లోని నివాసంలో గుండెపోటు, అపోలోకు తరలింపు
వైద్యులు గంటన్నర ప్రయత్నించినా ఫలితం శూన్యం  
రేపు ఉదయగిరిలో అంత్యక్రియలు

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి -న్యూస్‌టుడే, ఫిలింనగర్‌: ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు కారులో ఆయన్ను జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యవసర విభాగంలో చేర్చిన వైద్యులు కార్డియో పల్మనరీ రిససటేషన్‌ (సీపీఆర్‌) చేశారు. ఎంత ప్రయత్నించినా గౌతమ్‌రెడ్డిలో చలనం లేకపోవడంతో ఉదయం 9.16 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. ‘మంత్రి గౌతమ్‌రెడ్డి ఉదయం ఇంట్లోనే గుండెపోటుకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయనలో ఎలాంటి స్పందన లేదు. శ్వాస కూడా తీసుకోవడం లేదు. గుండె వైద్యనిపుణులు, అత్యవసర వైద్య సిబ్బంది మంత్రిని రక్షించేందుకు ప్రయత్నించారు. దాదాపు 90 నిమిషాలపాటు సీపీఆర్‌ చేశారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది’ అని అపోలో వైద్య వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో అపోలో ఆసుపత్రి నుంచి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించారు. ఆయన మృతి పట్ల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌, తెదేపా అధినేత చంద్రబాబు ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.

రెండుసార్లు కొవిడ్‌ నుంచి బయటపడి...

గౌతమ్‌రెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి. తండ్రిబాటలోనే రాజకీయ అరంగేట్రం చేసి 2014, 2019ల్లో వరుసగా రెండుసార్లు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో మంత్రి పదవి వరించింది. వివాదరహితుడిగా.. పరిశ్రమల, ఐటీ శాఖల్లో తనదైన ముద్ర వేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా దుబాయ్‌లో పర్యటించి, ఆదివారమే నగరానికి తిరిగొచ్చారు. గౌతమ్‌రెడ్డి రెండుసార్లు కొవిడ్‌ బారిన పడ్డారు. మొదటి వేవ్‌లోనే ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో రెండు, మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండి, కోలుకున్నారు. గత నెల 22న మరోసారి (కరోనా మూడో వేవ్‌లో) కొవిడ్‌ బారినపడి ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉండి కోలుకున్నారు. గుండె ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపించిందా అనే అంశాన్ని కూడా వైద్య వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల గౌతమ్‌రెడ్డి బాగా శ్రద్ధ చూపుతుంటారు. నిత్యం రెండు గంటలపాటు వ్యాయామం చేస్తుంటారని సన్నిహితులు తెలిపారు. ఆరోగ్యపరంగానూ ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన హఠాన్మరణాన్ని కుటుంబసభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గౌతమ్‌రెడ్డి వ్యాయమం చేస్తూ ఉండగా గుండెపోటుకు లోనయ్యారనే ప్రచారం అవాస్తవమని కుటుంబ సభ్యులు తెలిపారు.

అపోలోకు తెలంగాణ మంత్రులు

గౌతమ్‌రెడ్డి మృతి వార్త తెలియగానే తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు సురేష్‌రెడ్డి, వైతెపా అధ్యక్షురాలు షర్మిల, సీఎం జగన్‌ తల్లి విజయమ్మ, తదితరులు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన మృతికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సంతాపం తెలిపారు.

రెండు రోజులు సంతాప దినాలు

ఏపీ ప్రభుత్వం సోమ, మంగళవారాల్ని సంతాప దినాలుగా ప్రకటించింది. గౌతమ్‌అంత్యక్రియలు బుధవారం ఉ. 11 గంటలకు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నారు.


నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది

- నాగేశ్వరరావు, డ్రైవర్‌, ప్రత్యక్షసాక్షి

సోమవారం ఉదయం 7.20 సమయంలో నిద్ర లేచి బయటకు వచ్చిన ఆయన సోఫాలో కూర్చున్నారు. ఒక్కసారిగా గుండెను చేతితో పట్టుకొని విలవిలలాడిపోయారు. గట్టిగా పిలవడంతో కింద ఉన్న నేను పరుగెత్తుకుంటూ పైకి వచ్చాను. అప్పటికే ఆయన కింద పడిపోయి ఉన్నారు. కూర్చోబెట్టి గుండెలపై బాగా వత్తాను. మంచినీళ్లు అడిగారు. తెచ్చి ఇచ్చినా తాగలేదు. వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు లిఫ్ట్‌ వద్దకు తీసుకొచ్చేసరికి నాలుక మడతపడింది. నెమ్మదిగా అపస్మారక స్థితికి వెళ్లిపోతున్నారు. కారులో పడుకోబెట్టి 13 నిమిషాల్లోనే ఆసుపత్రికి తీసుకొచ్చాం. కారులో వచ్చేటప్పుడు శ్వాస ఉంది కానీ మాట్లాడలేదు. ఆసుపత్రిలో చేర్పించాం. ఆయన ఉదయం 8 గంటలకు జిమ్‌కు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఒక ఫంక్షన్‌కు వెళ్లి రాత్రి 9.30 గంటలకు తిరిగి వచ్చాం. మాకు దేవుడులాంటి మా సార్‌.. దూరమవడం జీర్ణించుకోలేకపోతున్నాం.


గౌతమ్‌రెడ్డి వ్యక్తిగతం

స్వస్థలం: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి
జననం : 2-11-1971
కుటుంబం: భార్య శ్రీకీర్తి, కుమార్తె సాయి అనన్యరెడ్డి, కుమారుడు అర్జున్‌ రెడ్డి
విద్యాభ్యాసం: ఊటీలోని గుడ్‌షెపర్డ్‌లో పాఠశాల విద్య, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ప్లస్‌ టూ, భద్రుకా కళాశాలలో డిగ్రీ, మాంచెస్టర్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌లో ఎమ్మెస్సీ (టెక్స్‌టైల్స్‌) పూర్తి చేశారు.

 


గౌతమ్‌రెడ్డితో పదేళ్లకు పైగా స్నేహం
- మంత్రి కేటీఆర్‌

గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనతో నాకు దాదాపు 10- 12 ఏళ్ల అనుబంధం ఉంది. అద్భుతమైన భవిష్యత్తున్న నాయకుడు ఇలా మృతి చెందడం ఎంతో బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా.  


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని