Delhi liquor scam: అభిషేక్‌ అరెస్టు

దిల్లీ మద్యం ముడుపుల కేసులో హైదరాబాద్‌కు చెందిన రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్‌ బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం విధాన రూపకల్పనలో కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూరేలా రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ వ్యవహరించిందనే అభియోగాలున్నాయి.

Updated : 11 Oct 2022 08:26 IST

దిల్లీ మద్యం ముడుపుల కేసులో.. మూడు రోజుల కస్టడీకి అప్పగించిన కోర్టు

సీబీఐ తాజా చర్యతో రాష్ట్రంలో ప్రకంపనలు

తెలంగాణలోని ప్రముఖులకూ నోటీసులు ఇచ్చే అవకాశం

ఈనాడు- దిల్లీ, హైదరాబాద్‌: దిల్లీ మద్యం ముడుపుల కేసులో హైదరాబాద్‌కు చెందిన రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్‌ బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం విధాన రూపకల్పనలో కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూరేలా రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ వ్యవహరించిందనే అభియోగాలున్నాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని అభిషేక్‌ను సీబీఐ అధికారులు ఆదివారం దిల్లీకి పిలిపించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఎదుట సోమవారం హాజరుపరిచారు. విచారణలో అభిషేక్‌ తమ ప్రశ్నలకు సమాధానాలివ్వకుండా దాటవేశాడని.. అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని సీబీఐ అధికారులు కోరారు. మూడు రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. అభిషేక్‌ అరెస్ట్‌ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈ వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై నిందితుడిగా ఉన్నాడు. ఆయన డైరెక్టర్‌గా ఉన్న రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ(లిమిటెడ్‌ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌) సంస్థతో పాటు అరుణ్‌ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌లో అరుణ్‌తో పాటు బోయినపల్లి అభిషేక్‌ కూడా డైరెక్టర్‌గా ఉన్నట్లు బయటపడింది. దీంతో అభిషేక్‌ వ్యాపారాలు, కార్యకలాపాలపైనా సీబీఐ అధికారులు దృష్టిసారించారు. మనీశ్‌ సిసోదియా అనుచరుడు అర్జున్‌పాండేకు విజయ్‌ నాయర్‌ తరఫున మహేంద్రు రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల నగదును అందజేశాడన్నది సీబీఐ అభియోగం. ఈ డబ్బులో కొంత పిళ్లైదని అనుమానిస్తున్నారు. ఈ కేసులో రామచంద్రన్‌ పిళ్లైని కాకుండా.. అనూహ్యంగా అభిషేక్‌ను అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. అతనికి రాష్ట్రంలో ఉన్న సంబంధాల దృష్ట్యా వ్యూహాత్మకంగానే అరెస్టు చేసినట్లు భావిస్తున్నారు.

అభిషేక్‌ వ్యాపారాలకు సంబంధించి సీబీఐ, ఈడీలు ఇప్పటికే సమాచారం సేకరించాయి. ఎస్‌.ఎస్‌. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ ఎల్‌ఎల్‌పీ, మాస్టర్‌ సాండ్‌ ఎల్‌ఎల్‌పీ, వాల్యూకేర్‌ ఈస్తటిక్స్‌  లిమిటెడ్‌, నీయోవెర్స్‌ రియాల్టీ, అనూస్‌ హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌, అగస్తి వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ, రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ, జెయూస్‌ నెట్‌వర్కింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అనూస్‌ ఎలక్ట్రాలిసిస్‌ అండ్‌ ఒబెసిటీ సంస్థలలో అతనికి భాగస్వామ్యం ఉందని ప్రాథమికంగా గుర్తించాయి. ఈ సంస్థలకు ఆడిటింగ్‌ నిర్వహిస్తున్న గోరంట్ల అసోసియేట్స్‌లోనూ సోదాలు జరిగాయి. పిళ్లైకి రాష్ట్రానికి చెందిన అనేక మంది ప్రముఖులతో వ్యాపార భాగస్వామ్యం ఉందని బయటపడింది. అతని తరఫున అభిషేక్‌ కీలకపాత్ర పోషించాడని, దక్షిణాదికి చెందిన అనేక మద్యం సంస్థలకు మధ్యవర్తిగా వ్యవహరించి ముడుపులు కూడగట్టాడన్నది దర్యాప్తు సంస్థల అనుమానం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ వారంలోనే రాష్ట్రానికి చెందిన ప్రముఖులకు విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్రం కేంద్రంగా మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌ అనే వ్యక్తికి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆయన విదేశాల్లో ఉన్నారని, అక్కడి నుంచి తిరిగివచ్చిన తర్వాత విచారణకు హాజరవుతారని కుటుంబసభ్యులు తెలిపారు.


ఇదీ నేపథ్యం..

దిల్లీ ప్రభుత్వ మద్యం విధానం రూపకల్పనలో అవకతవకలు జరిగాయని విచారణ జరపాలంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ లేఖ రాయడంతో సీబీఐ రంగంలోకి దిగింది. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా సహా 16 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. అందులో మొదటి నిందితుడిగా సిసోదియా ఉండగా దిల్లీ ఎక్సైజ్‌ కమిషనర్‌గా వ్యవహరించిన తెలుగు వ్యక్తి అరవ గోపాలకృష్ణ, హైదరాబాద్‌కు చెందిన రామచంద్ర పిళ్లైలపైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో సీబీఐ, ఈడీలు దిల్లీ, హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో సోదాలు నిర్వహించాయి. ఓన్లీ మచ్‌ లౌడర్‌ సంస్థ మాజీ సీఈవో విజయ్‌ నాయర్‌ను సీబీఐ గత నెలలో అరెస్టు చేయగా.. అభిషేక్‌ అరెస్టు రెండోది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని