అత్యాచార నిందితుల జాబితాతో వెబ్‌సైట్‌

రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితుల జాబితాతో రిజిస్టర్‌ రూపొందించాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 04 Dec 2022 05:36 IST

ఐటీ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులకు మంత్రి కేటీఆర్‌ సూచన
తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ప్రారంభం

ఈనాడు-హైదరాబాద్‌, రాయదుర్గం-న్యూస్‌టుడే: రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితుల జాబితాతో రిజిస్టర్‌ రూపొందించాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ తయారు చేసి.. అందులో వారి పేర్లను నమోదు చేయాలని సూచించారు. దేశంలోనే తొలిసారిగా సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ(సీఓఈ)’ కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. సైబర్‌ నేరాల కట్టడికి సీఓఈ పనితీరుపై పోలీసు అధికారులు, సాంకేతిక నిపుణులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసు సమావేశ మందిరంలో ఐటీ సంస్థల ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. అత్యాచారం కేసుల్లో నిందితుల జాబితా రూపొందించాలని సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్‌ కొంతకాలం క్రితం తనకు సూచించారని చెప్పారు. దీని ఆధారంగా నిందితులకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో నిషేధం ఉంటుందని స్పష్టంచేశారు. సైబర్‌ బాధితుల్లో విద్యావంతులు, ఐటీ నిపుణులు ఉండటంపై ఆందోళన వెలిబుచ్చారు.

1930 టోల్‌ఫ్రీ నంబర్‌పై అవగాహన కల్పించాలి

1930 టోల్‌ఫ్రీ నంబర్‌ నిత్యం అందుబాటులో ఉంటుందనే విషయం అందరికీ తెలిసేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఐటీ ఉద్యోగులపై ఉందని పేర్కొన్నారు. ఇటీవల డ్రోన్‌ ప్రదర్శనలో అత్యవసర సమయంలో స్పందించే డ్రోన్‌ను ఔత్సాహిక మహిళలు రూపొందించారని గుర్తుచేశారు. బాధితులు ఫోన్‌ చేస్తే పోలీసుల కన్నా ముందే డ్రోన్‌ చేరుతుందన్నారు. సైరన్‌తో చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయటంతోపాటు నేరాన్ని వీడియో తీస్తుందన్నారు. ఈ తరహా డ్రోన్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏవియేషన్‌ అధికారులతో మాట్లాడాలని పోలీసు ఉన్నతాధికారులకు కేటీఆర్‌ సూచించారు. మైక్రోసాఫ్ట్‌ ఎండీ రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ కొవిడ్‌కు ముందు సైబర్‌ నేరాలు 20 శాతం ఉండేవని.. ప్రస్తుతం 80 శాతానికి చేరాయని ఆందోళన వెలిబుచ్చారు. సైయంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బి.వి.ఆర్‌.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. 50 శాతం టెక్‌ సంస్థలు తమ ప్రధాన కేంద్రాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని, ఈ నేపథ్యంలో మెరుగైన పోలీసింగ్‌ కోసం రెండేళ్లపాటు అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌అలీ, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, ఏసీబీ డీజీ అంజనీకుమార్‌, హైదరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు సీవీ ఆనంద్‌, మహేశ్‌ భగవత్‌, అదనపు డీజీ జితేందర్‌, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని