సీబీఐకి అన్ని వివరాలూ చెప్పాం

నకిలీ అధికారి కేసు విషయంలో సీబీఐ విచారణకు రమ్మని నోటిసు ఇస్తే వెంటనే వెళ్లి పూర్తి వివరాలు ఇచ్చామని, 20 నిమిషాల్లో విచారణ పూర్తయ్యిందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.

Published : 05 Dec 2022 04:24 IST

శ్రీనివాస్‌తో ఎలాంటి సంబంధం లేదు
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: నకిలీ అధికారి కేసు విషయంలో సీబీఐ విచారణకు రమ్మని నోటిసు ఇస్తే వెంటనే వెళ్లి పూర్తి వివరాలు ఇచ్చామని, 20 నిమిషాల్లో విచారణ పూర్తయ్యిందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కరీంనగర్‌లోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ఎదుట నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో  మాట్లాడుతూ... సీబీఐ అరెస్టు చేసిన కొమ్మురెడ్డి శ్రీనివాస్‌ అనే వ్యక్తి కాపు సామాజికవర్గానికి చెందిన వారని, తనకు తాను సీబీఐ అధికారిగా అందరికీ చెప్పారని, కొన్ని రోజుల ముందు వరకు ఆయన పేరు వినడమే కానీ, కలవలేదన్నారు. అరెస్టు కంటే ముందు ఓ రోజు ధర్మేందర్‌ అనే వ్యక్తి వచ్చి సీబీఐ అధికారి శ్రీనివాస్‌ కాపు సంఘ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారన్నారు. ఫిలింనగర్‌ అతిథిగృహంలో ఉండగా తాను వెెళితే అక్కడున్నవారు ఐపీఎస్‌ అధికారిగా శ్రీనివాస్‌ను తనకు పరిచయం చేశారని, కాపు బిడ్డగా గర్వపడ్డామన్నారు. మీ మేడం ఐఏఎస్‌ అంటున్నారు కదా అని నగరానికి రమ్మని ఆహ్వానించామని తెలిపారు. ఆ తర్వాత ఆయన ఒక్కడే వస్తే కాపు సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఫొటోలు దిగి ఎక్కడి వారు అక్కడికి వెళ్లిపోయారన్నారు. మూడు రోజులకు సీబీఐ శ్రీనివాస్‌ను అరెస్టు చేసినట్లు తెలిసిందన్నారు. సంఘం కార్యక్రమంలో భాగంగా తనతో దిగిన ఫొటోలు ఉండడంతో తనకూ నోటీసు ఇచ్చి విచారణకు పిలిపించారని గంగుల పేర్కొన్నారు. తన బావ అయిన ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు శ్రీనివాస్‌ పరిచయమని, అతని బంధువుల ఇంట్లో పెళ్లికి సాయం అడిగితే రూ.15 లక్షల రుణం ఇప్పించారన్నారు. ఆ మొత్తం ఇంకా చెల్లించాల్సి ఉందని తెలిపారు. కాపు సంఘం పెద్దగా రవిచంద్ర ఎందరికో సహాయం చేస్తారు... అతనికి రుణం ఇవ్వడం తప్ప, చేసిందేమీ లేదన్నారు. ఇదే విషయాన్ని సీబీఐ విచారణలో చెప్పామని మంత్రి వివరించారు. శ్రీనివాస్‌ వివరాలు, తమ దగ్గర తీసుకున్న వివరాలు ఒకేలా ఉన్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చారని తెలిపారు. శ్రీనివాస్‌  వైజాగ్‌లో సీబీఐ కాలనీలో వైన్‌ షాప్‌ నడిపిస్తారని, అక్కడ అందరూ సీబీఐ శ్రీనివాస్‌ అంటారని పేర్కొన్నారు. గొప్పలు చెప్పుకోవడానికి ఈ పేరును ఉపయోగించుకున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని