శంకరలక్ష్మి డైరీ నుంచే పాస్‌వర్డ్‌ తస్కరణ

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ పోలీసులకు కీలక ఆధారం లభించింది. రెండోసారి పోలీసు కస్టడీలోకి తీసుకొన్న ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, డాక్యానాయక్‌, రాజేంద్రనాయక్‌ల నుంచి సోమవారం కీలక వివరాలు రాబట్టినట్టు సమాచారం.

Updated : 28 Mar 2023 06:45 IST

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ నిర్ధారణ
ప్రవీణ్‌కుమార్‌ నివాసంలో రూ.5 లక్షల నగదు స్వాధీనం!
మరో నిందితుడు తిరుపతయ్య అరెస్టు.. 15కు చేరిన అరెస్టులు
రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌కు లుక్‌అవుట్‌ నోటీసులు!

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ పోలీసులకు కీలక ఆధారం లభించింది. రెండోసారి పోలీసు కస్టడీలోకి తీసుకొన్న ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, డాక్యానాయక్‌, రాజేంద్రనాయక్‌ల నుంచి సోమవారం కీలక వివరాలు రాబట్టినట్టు సమాచారం. కాన్ఫిడెన్షియల్‌ విభాగం సూపరింటెండెంట్‌ శంకరలక్ష్మి డైరీ నుంచి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తస్కరించినట్టు తాజాగా నిర్ధారణకు వచ్చారు. ఆమె డైరీ నుంచి పాస్‌వర్డ్‌ కొట్టేసి గతేడాది అక్టోబరు 1న ఆమె కంప్యూటర్‌లోని ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసినట్టు రాజశేఖర్‌రెడ్డి అంగీకరించినట్టు సమాచారం. కొన్ని ప్రశ్నపత్రాలను ప్రవీణ్‌కుమార్‌ పెన్‌డ్రైవ్‌లోకి మార్చినట్టు వెల్లడించినట్టు తెలుస్తోంది. మరోవైపు, బడంగ్‌పేట్‌లోని ప్రవీణ్‌కుమార్‌ నివాసంలో తనిఖీ చేసిన సిట్‌ పోలీసులు రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

రెండోసారి కస్టడీలోకి తీసుకున్న ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, డాక్యానాయక్‌, రాజేందర్‌లను సోమవారం రెండోరోజూ సుదీర్ఘంగా విచారించారు. డాక్యానాయక్‌, రాజేందర్‌లను ఉదయం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సొంతూరికి తీసుకెళ్లారు. వారిద్దరూ అక్కడ మంతనాలు జరిపిన కొందరు వ్యక్తుల వివరాలను సిట్‌ పోలీసులు సేకరించినట్టు సమాచారం. నిందితుల నుంచి సేకరించిన ఫోన్‌ నంబర్ల ఆధారంగా అనుమానితుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. వారిలో ఇప్పటివరకూ ఆరుగురిని గుర్తించి ప్రశ్నించారు. మరో ముగ్గురి సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్‌ అయినట్టు గుర్తించారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఈ ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు అంచనాకు వచ్చారు. వీరికి ప్రశ్నపత్రాల లీకేజీతో ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నారు. గ్రూప్‌-1లో 100కు పైగా మార్కులు సాధించిన 121 మంది యువతీ, యువకుల్లో ఇప్పటివరకూ 60 మందిని విచారించారు. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌కు సోమవారం సిట్‌ పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

మహబూబ్‌నగర్‌ జిల్లా సల్కర్‌పేటలో తిరుపతయ్య ఇంటికి వచ్చి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. కుటుంబ సభ్యులను విచారించారు. గండీడ్‌ ఎంపీడీవో కార్యాలయానికి సైతం అధికారులు వెళ్లి వివరాలు సేకరించారు.


15కు చేరిన అరెస్టులు

లీకేజీ కేసులో తిరుపతయ్యను సిట్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. దీంతో అరెస్టయిన వారి సంఖ్య 15కు చేరింది. మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం సల్కర్‌పేట గ్రామానికి చెందిన తిరుపతయ్య ఉపాధి హామీ పథకం పర్యవేక్షకుడిగా పనిచేస్తున్నాడు. ఒకే మండలం, విభాగంలో పనిచేస్తున్న డాక్యానాయక్‌తో అతనికి పాత పరిచయాలున్నాయి. తన వద్ద ఏఈ ప్రశ్నపత్రం ఉందని తిరుపతయ్యకు డాక్యానాయక్‌ చెప్పాడు. దీన్ని సొమ్ము చేసుకునేందుకు రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం నేరెళ్లపల్లికి చెందిన రాజేందర్‌కుమార్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని రూ.5 లక్షలు తీసుకొని ప్రశ్నపత్రం చేతికిచ్చేందుకు తిరుపతయ్య దళారీగా వ్యవహరించాడని నిర్ధారణ కావటంతో అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని