సర్కారు విద్యార్థులకు కిచిడీ, వెజ్‌ బిర్యానీ

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం(పీఎం పోషణ్‌)లో కిచిడీ, వెజ్‌ బిర్యానీ అందించనున్నారు. గత విద్యా సంవత్సరం వరకు ప్రతి శనివారం వెజ్‌ బిర్యానీ పెట్టాలని సూచించేవారు.

Published : 02 Jun 2023 04:53 IST

రోజూ మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ తప్పనిసరి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం(పీఎం పోషణ్‌)లో కిచిడీ, వెజ్‌ బిర్యానీ అందించనున్నారు. గత విద్యా సంవత్సరం వరకు ప్రతి శనివారం వెజ్‌ బిర్యానీ పెట్టాలని సూచించేవారు. ఈసారి నుంచి వారంలో ఒకరోజు కిచిడీ, వెజ్‌ బిర్యానీ తప్పనిసరి చేశారు. వీటికి తోడు రోజూ మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ అందించనున్నారు. గతేడాది మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని జాయింట్‌ రివ్యూ మిషన్‌ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మెనూ మార్చాలని సూచించింది. ఈ క్రమంలో జాతీయ పోషకాహార సంస్థ కూడా కొత్త మెనూ రూపొందించింది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటి నుంచి(ఈ నెల 12) దీనిని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన గురువారం డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల(1- 5 తరగతులు) పిల్లలకు అన్నం వండి పెట్టినందుకు వస్తువుల ఖర్చు(మెటీరియల్‌ కాస్ట్‌) కింద రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.5.45, 6-10 తరగతులకు రూ.8.17 చెల్లిస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు 26 వేల బడుల్లో 22 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.

ఆ ధరతో సాధ్యమేనా?

ఇప్పటికే తమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ధరతో భోజనం సమకూర్చడం సాధ్యం కావడం లేదని వంట కార్మికులు చెబుతున్నారు. ధర పెంచాలని ఎన్నోమార్లు ధర్నాలు చేశారు. కొన్ని బడుల్లో తమ వల్ల కాదని వంట మానేశారు. కరోనా తరువాత నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరిగాయి. కేంద్రం మాత్రం రెండేళ్ల తరువాత 9.6శాతమే ధర పెంచింది. వాస్తవానికి ఏటా 7.5శాతం పెంచాలి. ఇప్పటివరకు వచ్చే ఏడాదికి సంబంధించి ధర పెంచుతూ ఆదేశాలు జారీ చేయకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మారిన మెనూను ధర పెంచకుండా అమలు చేయడం కష్టమని స్పష్టం చేస్తున్నారు. తమ గౌరవ వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచుతామని ఏడాది క్రితం స్వయంగా సీఎం ప్రకటించారని, దానిపై కొద్ది నెలల క్రితం జీఓ కూడా ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదని వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని