Telangana News: విడివిడిగా ఉద్యోగ ప్రకటనలు!

రాష్ట్రంలో భారీగా చేపట్టిన ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలూ లేకుండా సజావుగా సాగేందుకు వీలుగా అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 80,039 ఉద్యోగాలకు సంబంధించి వేర్వేరు నియామక సంస్థల

Updated : 11 Mar 2022 05:33 IST

నియామకాలు ఆగకుండా సాగేలా చర్యలు
జారీకి ముందే విధిగా న్యాయసలహాలు
పక్కా కార్యాచరణకు ప్రభుత్వ సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీగా చేపట్టిన ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలూ లేకుండా సజావుగా సాగేందుకు వీలుగా అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 80,039 ఉద్యోగాలకు సంబంధించి వేర్వేరు నియామక సంస్థల ద్వారా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటితో పాటు పలు కీలక అంశాలపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశం చర్చించగా టీఎస్‌పీఎస్సీ అధికారులతో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు గురువారం భేటీ అయ్యారు. గతంలో నియామకాలకు సంబంధించి పలు కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌కు సంబంధించిన 23,000 పోస్టులు ఇలాంటి వివాదాల్లో ఉన్నందున వాటి నియామకాలు పూర్తికాలేదు. అందుకే కొత్తగా చేపడుతున్న ఉద్యోగాలకు న్యాయపరమైన ఆటంకాలు ఎదురవకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో చర్చించి, పలు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీలైనంత తక్కువ సంఖ్యలో పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్లు ఇవ్వాలనే ప్రతిపాదన ప్రధానమైంది. అలాగే నోటిఫికేషన్ల జారీకిముందు న్యాయసలహా తీసుకోవాలనే అంశంపైనా చర్చించారు. ఏకమొత్తంగా నోటిఫికేషన్‌ వెలువడితే దానిపై కోర్టులో కేసు పడితే ఆ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయే వీలుంటుంది. అలాకాకుండా వివిధ కేటగిరి పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్‌ ఇస్తే.. కోర్టు కేసు పడి ఒకటీరెండు ఆగిపోయినా.. మిగిలిన వాటి ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా సీఎస్‌ అధ్యక్షతనగల రాష్ట్రస్థాయి నియామకాల కమిటీద్వారా కార్యాచరణను చేపట్టే వీలుంది.

జిల్లాలవారీగా నోటిఫికేషన్లు..

బుధవారం ప్రకటించిన ఉద్యోగాల్లో 27 శాఖలకు చెందినవి ఉన్నాయి. వీటిని జిల్లా, జోనల్‌, బహుళ జోనల్‌ పోస్టులుగా విభజించారు. ఇప్పటికే హోంశాఖకు ప్రత్యేకంగా పోలీసు నియామక మండలి ఉంది. దాని ద్వారా ఆ శాఖ పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడుతుంది. ఉపాధ్యాయ పోస్టులకు విద్యాశాఖ డీఎస్సీ లేదా టీఆర్‌టీ ద్వారా నోటిఫికేషన్లు వెలువడతాయని తెలుస్తోంది. జిల్లా స్థాయి పోస్టులను ఏ జిల్లాకు ఆ జిల్లాలో భర్తీ చేయడానికి వీలుగా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి ఎంపిక కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్లు జిల్లాలవారీగా విడుదల చేస్తారు. వైద్యఆరోగ్య శాఖలకు ప్రత్యేక నియామక మండలి ఉంది. నీటిపారుదల శాఖ పోస్టులకు సైతం ప్రత్యేక నియామక మండలి ఏర్పాటు ఆలోచన ఉంది. సంక్షేమ శాఖలకు విడిగా, ఇంజినీరింగ్‌ సర్వీసు పోస్టులన్నింటి కోసం విడిగా ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేసి కేడర్‌వారీగా నియామకాలు జరపాలనే ప్రతిపాదనలను పరిశీలించనుంది.

టీఎస్‌పీఎస్సీ ద్వారా ఎలా..

రాష్ట్రంలోని ప్రధాన నియామక సంస్థ టీఎస్‌పీఎస్సీకి ఏయే బాధ్యతలు అప్పగించాలనే దానిపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు గురువారం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కార్యదర్శిలతో సమావేశమయ్యారు. ఏయే నియామకాలు చేపట్టాలి, కమిషన్‌ సన్నద్ధత, కోర్టు కేసులు, వాటి పరిష్కారం, నోటిఫికేషన్లు ఎలా ఇవ్వాలి అనే అంశాలపై చర్చించారు. మొదటి నుంచి గ్రూపు-1, 2, 3, 4 నియామకాలు సర్వీసు కమిషన్‌ద్వారా జరుగుతున్నాయి. ఈసారి ఆ పోస్టులను పూర్తిగా ఇవ్వాలా, కొన్నింటిని జిల్లా ఎంపిక కమిటీలకు ఇవ్వాలా అనే దానిపైనా చర్చ జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని