అవినీతి చెక్‌పోస్టులకు అడ్డుకట్ట!

రాష్ట్రంలో రవాణాశాఖ చెక్‌పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

Updated : 05 May 2024 04:39 IST

రవాణాశాఖవి 15 చోట్ల శాశ్వతంగా తొలగింపు
కోడ్‌ ముగిశాక ప్రభుత్వం కీలక నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రవాణాశాఖ చెక్‌పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖకు మొత్తం 15 చెక్‌పోస్టులున్నాయి. ఇందులో సాలూర, ఆదిలాబాద్‌, జహీరాబాద్‌, మద్నూర్‌, భైంసా, వాంకిడి, అలంపూర్‌, కృష్ణా, నాగార్జునసాగర్‌, విష్ణుపురం, కోదాడ, కల్లూర్‌, అశ్వారావుపేట, పాల్వంచ.. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. మరొకటి కామారెడ్డిలో ఉంది. ఒక్కో చోట 10-15 మంది అధికారులు, ఉద్యోగులు ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే వాహనాలను, పర్మిట్లు తనిఖీ చేయాలి. అయితే ఇవి అవినీతి కేంద్రాలుగా మారాయన్న ఆరోపణలు దశాబ్దాలుగా ఉన్నాయి. ఒక్కో చెక్‌పోస్టు దగ్గర పర్మిట్‌ లేని వాహనాల నుంచి నామమాత్రపు జరిమానాలే విధిస్తుంటే.. రాష్ట్రంలోకి వచ్చాక జిల్లాల్లో అంతకు ఎన్నో రెట్లు జరిమానా వసూలవుతున్నట్లు సమాచారం. అంటే సరిహద్దుల్లో నిబంధనల అమలు సక్రమంగా జరగడం లేదని తెలుస్తోంది.

గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు..

దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యం, రవాణా పర్మిట్లు సహా వాహనాల అనుమతులు ఆన్‌లైన్‌లోనే ఇస్తున్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో రవాణాశాఖ చెక్‌పోస్టులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే సర్క్యులర్‌ జారీ చేసింది. పలు రాష్ట్రాలు వీటిని తొలగించాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో వీటిపై చర్చించి తొలగించేందుకు మొగ్గుచూపారు. ఎన్నికల కోడ్‌ రావడానికి కొద్దిరోజుల ముందు ఉన్నతాధికారులు తొలగింపుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. వీటిల్లో రాష్ట్రవ్యాప్తంగా 150 మందికిపైగా పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగుల్ని జిల్లాలు, హైదరాబాద్‌లో వినియోగించుకోవాలని రవాణాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. కొద్దివారాల క్రితం ఓ పొరుగురాష్ట్రం చెక్‌పోస్టులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

యూజర్‌ ఛార్జీల ఆదాయం ఇక రవాణాశాఖకే

వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌, ఇతర సేవల సమయంలో రవాణాశాఖ వాహనదారుల నుంచి లైఫ్‌ట్యాక్స్‌తోపాటు యూజర్‌ ఛార్జీలను కూడా వసూలు చేస్తోంది. ఏటా ఈ మొత్తం రూ.130 కోట్ల వరకు వస్తున్నట్లు సమాచారం. రవాణాశాఖకు హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో భవనాలు సరిగా లేవని.. కొత్త భవనాలు, కంప్యూటర్లు వంటి అవసరాలకు నిధులు కావాలని మంత్రి పొన్నం ఎన్నికల కోడ్‌కి ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. యూజర్‌ ఛార్జీల ఆదాయాన్ని కొత్త భవనాలు, మౌలిక సదుపాయాలకు ఉపయోగించుకుంటామని ప్రతిపాదించగా సీఎం, డిప్యూటీ సీఎం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఎన్నికల కోడ్‌ ముగిశాక అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని