జనాభా పెంచేందుకు చైనా అవస్థలు

చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా జననాలను పెంచేందుకు మరిన్ని చర్యలు చేపట్టింది.

Published : 09 Mar 2023 06:12 IST

వధువులకిచ్చే ‘కైలీ’ కట్టడికి చర్యలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా జననాలను పెంచేందుకు మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పెళ్లి సమయంలో వధువుకు పెళ్లి కుమారుడు సొమ్ము ముట్టజెప్పే సంప్రదాయాన్ని కట్టడి చేయడం మొదలుపెట్టింది. చైనాలో వరుడు తన సంపదను వధువువద్ద ప్రదర్శించడానికి, ఆమెను పెంచినందుకు అత్తింటి వారికి సొమ్ములు ముట్టజెప్పే సంప్రదాయం ఉంది. దీనిని ‘కైలీ’ అంటారు. చైనాలో జరిగే మూడొంతుల పెళ్లిళ్లలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇందుకోసం వరుడి కుటుంబాల్లో వార్షికాదాయానికి దాదాపు కొన్ని రెట్ల మొత్తం వధువు కుటుంబికులకు చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో జననాల రేటు పతనాన్ని అడ్డుకునేందుకు చైనా అధికారులు ఈ సంప్రదాయంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే దేశంలో చాలా తక్కువ మంది పెళ్లిళ్లు చేసుకుని సంతానాన్ని కంటున్నారు. ఈ పరిస్థితికి ‘కైలీ’ కారణమని భావిస్తున్నారు. జనవరిలో సెంట్రల్‌ హుబే ప్రావిన్స్‌లో అధికారులు కైలీ విధానం అమలు చేసేవారిపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు జింగ్సి నగరంలో కైలీ అడగబోమని యువతుల చేత సంతకాలు చేయించారు. ఉమెన్స్‌ డే సందర్భంగా జింగ్షూ ప్రావిన్స్‌ రాజధానిలో సామూహిక వివాహాలను ఏర్పాటు చేశారు.  చైనాలో వన్‌ఛైల్డ్‌ పాలసీని అమలు చేసిన సమయంలో కైలీ విధానం అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో పురుషుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయి.. స్త్రీల సంఖ్య తగ్గింది. దీంతో వధువు కుటుంబికులు భారీ స్థాయిలో సొమ్మును ఆశించడం మొదలుపెట్టారు. తమ జనాభా ఇటీవలి కాలంలో తొలిసారిగా తగ్గినట్లు చైనా ప్రకటించింది.


ఇంటర్నెట్‌ కేబుళ్లను చైనా ధ్వంసం చేసింది: తైవాన్‌

నవ్‌గన్‌ (తైవాన్‌): తైవాన్‌ను ఇప్పటికే ముప్పుతిప్పలు పెడుతున్న చైనా తాజాగా మరో చర్యకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. తమ దేశానికి చెందిన ఓ ద్వీపమైన మట్సు ప్రజలకు ఇంటర్నెట్‌ సేవలు అందకుండా కేబుళ్లను ఆ దేశం ధ్వంసం చేసిందని పేర్కొంది. చైనాకు సమీపంలోని మట్సులో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవడంతో ఆ ద్వీపంలో నివసిస్తున్నవారు విద్యుత్తు బిల్లుల చెల్లింపులు, వైద్యుల అపాయింట్‌మెంట్ల కోసం ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించింది. మట్సుకు చెందిన 14,000 మంది రెండు సబ్‌మెరైన్‌ ఇంటర్నెట్‌ కేబుళ్ల ఆధారంగా సేవలు పొందుతారు. రెండు చైనా నౌకలు వీటిని ధ్వంసం చేశాయని తైవాన్‌ నేషనల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (ఎన్‌సీసీ) ఆరోపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని