Maldives: మాల్దీవుల నుంచి భారత్‌ దళాలు వెళ్లిపోవాల్సిందే: అధ్యక్షుడు మయిజ్జు

మాల్దీవుల్లోని భారత్‌ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్‌ మయిజ్జు మరోసారి కోరారు.

Updated : 11 Jan 2024 14:06 IST

మాలే: మాల్దీవుల (Maldives) నుంచి భారత్‌ దళాలు వెళ్లిపోవాలని ఆ దేశ నూతన అధ్యక్షుడు మహ్మద్‌ మయిజ్జు (Mohamed Muizzu) మరోసారి కోరారు. తాము పూర్తి స్వతంత్రంగా ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు శనివారం ఆ దేశ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మాల్దీవుల అధ్యక్షుడిగా మయిజ్జు ప్రమాణం చేసిన ఒక రోజు వ్యవధిలోనే ఈ ప్రకటన వెలువడింది. హిందూ మహాసముద్రంలో చిన్నదీవుల సమూహమైన మాల్దీవులపై పట్టుకోసం భారత్, చైనా పోటీ పడుతున్న వేళ.. ప్రధానిగా ఎన్నికైన రోజునే తన ఆలోచన బయటపెట్టిన ఆయన.. తాజాగా ఈ ప్రకటన వెలువరించడం గమనార్హం. 

తాజా ప్రకటనకు ముందే.. ప్రమాణస్వీకారానికి వచ్చిన భారత భూ విజ్ఞానశాస్త్ర శాఖ మంత్రి కిరణ్‌ రిజిజుతో మయిజ్జు.. ఈ అంశంపై చర్చించినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. భారత్‌కు చెందిన దాదాపు 70 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం అక్కడ ఉంటోంది. భారత్‌ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్‌లో గస్తీకి సహకరిస్తాయి. తాను అధికారంలోకి వస్తే మాల్దీవుల్లోని భారత్‌ బలగాలను వెనక్కి పంపిస్తానని మయిజ్జు ఎన్నికల సమయంలో హమీ ఇచ్చారు.  ఈ నేపథ్యంలో ఆయన అధికారం చేపట్టిన తర్వాతి రోజునే చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రమాణంస్వీకారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మాల్దీవుల్లో ఇతర దేశాలకు చెందిన సైనికులెవరూ ఉండొద్దు’ అంటూ పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి అన్నారు.  

గమ్యం చేరని ‘స్టార్‌షిప్‌’.. అతిపెద్ద రాకెట్‌ ప్రయోగం రెండోసారి విఫలం!

అయితే, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అత్యవసర వైద్య పరిస్థితులు తలెత్తినప్పుడు అక్కడి పౌరులను తరలించేందుకు భారతీయ హెలికాప్టర్లు, విమానాల సహకారం గురించి కిరణ్‌ రిజిజు వద్ద మయిజ్జు ప్రస్తావించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మారుమూల ద్వీపంలోనూ అంతర్జాతీయ పర్యాటకులు పోటెత్తడానికి ఈ భరోసా కూడా ప్రదానమైనదని ఆయన కొనియాడినట్లు తెలిపాయి. మాల్దీవుల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిరంతర సహకారం కోసం ఇరుదేశాలు ఆచరణీయమైన పరిష్కారాలను చర్చించేందుకు అంగీకారం కుదిరినట్లు చెప్పాయి.

చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామీన్‌కు మయిజ్జు సన్నిహితుడు. మాల్దీవులకు భారత్‌తోనే అనుబంధం ఎక్కువ. అయితే 2013లో అధికారంలోకి వచ్చిన యామీన్‌ గయూమ్‌ భారత్‌ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించి చైనాకు దగ్గరయ్యాడు. ఇప్పటివరకు అధికారంలో ఉన్న ఇబ్రహీం సోలిహ్‌ భారత్‌తో సన్నిహిత సంబంధాలకు కృషి చేశారు. భారత పశ్చిమ తీరానికి సమీపంలో ఉన్న లక్షదీవులకు దిగువున ఈ మాల్దీవులు ఉన్నాయి. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్లే  కీలకమైన సముద్రమార్గం ఇక్కడకు సమీపంలోనే ఉంది. మాల్దీవులు చిన్న దేశం కావడంతో భారత్‌ ఎక్కువగా సాయం చేసింది. మాల్దీవుల్లో చైనా ఎలాంటి చర్యలకు పాల్పడినా భారత భద్రతపై పెను ప్రమాదం చూపించే అవకాశముంది. దీంతో ముందుగానే మాల్దీవుల యంత్రాంగాన్ని కట్టడి చేయాలని రక్షణ రంగ నిపుణులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని