China: చైనాలో అంతుచిక్కని న్యుమోనియా.. మరో మహమ్మారి రాబోతుందా?

చైనాలో అంతుచిక్కని న్యుమోనియా లక్షణాలతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఒక్కరోజే బీజింగ్‌, లియనోనింగ్‌ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో వందల సంఖ్యలో చిన్నారులు చేరారు. దీనిపై ప్రోమెడ్‌ సంస్థ అప్రమత్తం చేసింది. 

Updated : 23 Nov 2023 07:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలితీసుకున్న కొవిడ్‌ 19 (Covid 19) వైరస్‌ చైనా (China) నుంచి వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి మిగిల్చిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ఆ దేశాన్ని మరో ప్రాణంతక జబ్బు వణికిస్తోంది. పాఠశాలలకు వెళ్తోన్న చిన్నారులు అంతుచిక్కని న్యుమోనియా లక్షణాల బారిన పడుతున్నారు. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల వ్యాప్తిని పరిశీలించే ప్రోమెడ్‌ సంస్థ అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఓ నివేదికను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది.

‘‘బుధవారం ఉదయం అనారోగ్యానికి గురైన చిన్నారులతో బీజింగ్‌, లియనోనింగ్‌ ప్రాంతాల్లోని ఆస్పత్రులు నిండిపోయాయి. దగ్గు లేకపోయినా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌, శ్వాససంబంధ ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో ఈ అంతు చిక్కని న్యుమోనియా రకం వ్యాప్తి చెందకుండా పాఠశాలలను యాజమాన్యాలు తాత్కాలికంగా మూసివేశాయి’’ అని ప్రోమెడ్‌ సంస్థ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేసింది. ఒకేసారి వందల మంది పిల్లలు అనారోగ్యానికి గురికావడం అసాధారణ విషయమని, ఈ జబ్బు ఎప్పుడు, ఎలా పుట్టుకొచ్చిందో స్పష్టత లేకపోయినా.. పాఠశాలలోనే వ్యాప్తి చెంది ఉండొచ్చని పేర్కొంది. పలువురు ఉపాధ్యాయులు కూడా ఈ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడినట్లు వెల్లడించింది. ఇది కరోనాలాగా మరో మహమ్మారిగా మారే అవకాశాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ప్రోమెడ్‌ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో చైనా కరోనా నిబంధనలను ఎత్తివేసిందని, అప్పటి నుంచి తరచూ అంటువ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. రెండ్రోజుల కిందట ఆస్పత్రుల వద్ద చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు క్యూ కట్టిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

జబ్బుపై పూర్తి వివరాలివ్వండి: డబ్ల్యూహెచ్‌వో

ఉత్తర చైనాలో అంతుచిక్కని న్యుమోనియా లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సోషల్‌మీడియా వేదికగా స్పందించింది. దీనిపై పూర్తి వివరాలు తెలియజేయాలని చైనాను కోరింది. జబ్బు లక్షణాలు, అనారోగ్యానికి గురవుతున్న చిన్నారులుండే ప్రాంతాల వివరాలు ఇవ్వాలని పేర్కొంది. అలాగే, ఈ జబ్బు వ్యాప్తి చెందకుండా చైనా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని