Rishi Sunak: బ్రిటన్‌ నూతన ప్రధానిగా రిషి సునాక్‌ ఏకగ్రీవ ఎన్నిక

లిజ్‌ ట్రస్‌ రాజీనామాతో టోరీ సభ్యులు తదుపరి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారోనన్న ఉత్కంఠకు తెరపడింది. కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా, బ్రిటన్‌ ప్రధానిగా, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌(Rishi Sunak) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated : 24 Oct 2022 20:38 IST

లండన్‌: లిజ్‌ ట్రస్‌ రాజీనామాతో టోరీ సభ్యులు తదుపరి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారోనన్న ఉత్కంఠకు తెరపడింది. కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా, బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌(Rishi Sunak) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలుత బోరిస్‌ జాన్సన్‌, ఆ తర్వాత పెనీ మోర్డౌంట్‌ సైతం పోటీ నుంచి వైదొలగడంతో రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికై  బ్రిటన్‌ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ఇటీవల లిజ్‌ ట్రస్‌(Liz truss) రాజీనామాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో టోరీ సభ్యులు ఈసారి రిషి వైపే మొగ్గు చూపారు. ఆయనే తమ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని విశ్వసించారు. దీంతో బ్రిటన్‌ పగ్గాలు చేపట్టే అరుదైన అవకాశం రిషి సునాక్‌ను వరించింది. నెలన్నర రోజుల క్రితం లిజ్‌ట్రస్‌ చేతిలో ఓటమిపాలైన అదే సునాక్‌.. నేడు దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. బ్రిటన్‌ పాలనా పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా, మొత్తం 357 మంది టోరీ ఎంపీల్లో సగం మందికి పైగా మద్దతును పొందడం ద్వారా బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగానూ రిషి సునాక్‌ (42) అరుదైన రికార్డు సొంతంచేసుకోవడం విశేషం. 

బోరిస్‌ జాన్సన్‌ అనూహ్య నిర్ణయంతో..

కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడిగా తనకు చట్టసభ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ రిషి సునాక్‌ (Rishi Sunak) కంటే వెనకబడి ఉన్నానని.. ఇటువంటి సమయంలో పోటీ నుంచి వైదొలగడమే మేలని మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భావించారు.  అంతేకాకుండా బరిలోంచి వైదొలుగుతున్నట్టు ఆయన అనూహ్యంగా ప్రకటించారు. కీలక నేతగా ఉన్న బోరిస్‌ పోటీ నుంచి వైదొలగడం, మరో నాయకురాలు పెనీ మోర్డౌంట్‌కు అంతంత మాత్రమే మద్దతు ఉండటంతో బ్రిటన్‌ తదుపరి ప్రధానిగా రిషి సునాక్‌ విజయం దాదాపు ఖాయమైనట్టేనంటూ  ఈ మధ్యాహ్నం నుంచే వార్తలు వెలువడ్డాయి. చివరకు ప్రధాని రేసు నుంచి పెనీ మోర్డౌంట్‌ సైతం వైదొలగడంతో రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు.

సామాన్యుడిగా మొదలై ప్రధాని స్థాయికి..

సామాన్యుడిగా మొదలైన రిషి సునాక్‌ తన కృషి, పట్టుదలతో బ్రిటన్‌ ప్రధాని స్థాయికి ఎదిగారు. కన్జర్వేటివ్‌ పార్టీలో కొత్త తరం నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన బ్రిటన్‌ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి చరిత్ర సృష్టించారు. బ్రిటన్‌ సంక్షోభం వేళ ఆర్థిక మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌ నగరంలో రిషి జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఉష, యశ్‌వీర్‌. భారత్‌లోని పంజాబ్‌లో రిషి సునాక్‌ తల్లిదండ్రుల మూలాలు ఉన్నాయి. వారు టాంజానియా, కెన్యా నుంచి బ్రిటన్‌కు వలస వచ్చారు. సునాక్‌ తండ్రి యశ్‌వీర్‌ వైద్యులు కాగా.. తల్లి మెడికల్‌ షాప్‌ నిర్వహించేవారు. ఆర్థిక రంగాన్ని తన కెరియర్‌గా ఎంచుకున్న ఆయన.. ఆక్స్‌ఫర్డ్‌లో ఫిలాసఫీ, ఎకనామిక్స్‌ అభ్యసించారు.

బెంగళూరులోనే రిషి వివాహం

రిషి సునాక్‌ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తికి స్వయానా అల్లుడు. స్టాన్‌ఫర్డ్‌లో నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షితామూర్తితో ఆయనకు పరిచయం ఏర్పడగా.. 2009లో బెంగళూరులో రిషి, అక్షితల వివాహం జరిగింది. రిషి సునాక్‌, అక్షితామూర్తి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. తొలిసారి రిచ్‌మండ్‌ నుంచి 2015లో ఎంపీగా ఎన్నికైన ఆయన.. 2017, 2019లలోనూ తిరిగి ఎన్నికయ్యారు. 2020 ఫిబ్రవరిలో బోరిస్‌ జాన్సన్‌ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా నియమితులై.. ఈ ఏడాది జులై వరకు కొనసాగిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని