నిమిషం ఆలస్యమైనా అనుమతించరు

రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష ఉంటుంది.

Updated : 21 Jan 2023 05:48 IST

రేపే పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల తర్వాత  నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, పెన్‌డ్రైవ్‌, బ్లూటూత్‌ పరికరాలు, స్మార్ట్‌ వాచ్‌, కాలిక్యులేటర్‌, పర్సు, నోట్సు, ఛార్ట్‌లు, పేపర్లు, రికార్డింగ్‌ పరికరాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు వంటివేవీ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. వాటిని పరీక్ష కేంద్రాల వద్దకు తీసుకురావొద్దని, భద్రపరచటానికి ఎలాంటి ఏర్పాట్లూ ఉండవని పోలీసు నియామక మండలి తెలిపింది. ‘‘అభ్యర్థులు ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి. ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటరు కార్డు, రేషన్‌కార్డు వంటి ఒరిజినల్‌ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొని రావాలి. పరీక్ష హాల్‌ టికెట్‌, బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్‌ తెచ్చుకోవాలి’’ అని పోలీసు నియామక మండలి అభ్యర్థులకు సూచించింది.

ఒక్కో పోస్టుకు 83 మంది పోటీ

మొత్తం 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగా.. 5,03,486 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,95,415 మంది పురుషులు, 1,08,071 మంది మహిళలు. ఒక్కో పోస్టుకు సగటున 83 మంది పోటీ పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని