Air India: ఎయిరిండియాలో మరో విడత VRS.. 40 ఏళ్లు దాటిన వారికి వర్తింపు

Air India VRS: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా మరోసారి స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. 40 ఏళ్లు దాటిన ఉద్యోగులకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. దరఖాస్తుకు నెలన్నర గడువు ఇచ్చింది.

Updated : 17 Mar 2023 15:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాటాల నేతృత్వంలోని ఎయిరిండియా (Air India) మరోసారి స్వచ్ఛంద విరమణ పథకాన్ని (VRS) ప్రకటించింది. టాటాల చేతికి వచ్చిన తర్వాత ఇది వరకే  వీఆర్‌ఎస్‌ను ప్రకటించిన ఆ సంస్థ తాజాగా.. నాన్-ఫ్లయింగ్‌ స్టాఫ్‌కు ఈ పథకాన్ని ఎంచుకునే అవకాశం కల్పించింది. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 40 ఏళ్లు దాటిన పర్మినెంట్‌ జనరల్‌ కేడర్‌కు చెందిన ఉద్యోగులతో పాటు క్లరికల్‌, నైపుణ్యం లేని కేటగిరీలకు చెందిన ఉద్యోగులకూ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ఎయిరిండియా తన ఇంటర్నల్‌ మెమోలో తెలియజేసింది. మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. వీరికి ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. మార్చి 31లోపు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునే వారికి ఎక్స్‌గ్రేషియా మొత్తంపై రూ.1లక్ష అదనంగా చెల్లిస్తామని తెలిపింది. తాజాగా స్వచ్ఛంద విరమణ పథకానికి దాదాపు 2,100 ఉద్యోగులు అర్హులుగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

గతేడాది ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్‌.. ఆ సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పాత తరానికి చెందిన ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ఇచ్చి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గతేడాది జూన్‌లో తొలి విడత వీఆర్‌ఎస్‌ పథకాన్ని ప్రకటించింది. ఫ్లయింగ్‌, నాన్ ఫ్లయింగ్‌ సిబ్బందికి ఈ పథకాన్ని వర్తింపజేసింది. మొత్తం 4,200 మంది ఈ పథకానికి అర్హులు కాగా.. అందులో 1500 మంది వీఆర్‌ఎస్‌ను ఎంచుకున్నారు. ఇతరులకు వీఆర్‌ఎస్‌ వర్తింపజేయాలన్న ఉద్యోగుల కోరిక మేరకు రెండో విడత ఈ పథకాన్ని ప్రకటిస్తున్నట్లు ఎయిరిండియా చీఫ్‌ హెచ్ఆర్‌ సురేశ్‌ దత్‌ త్రిపాఠి తెలిపారు. మరోవైపు భారీ సంఖ్యలో ఇటీవల విమానాలకు ఆర్డర్‌ పెట్టిన ఎయిరిండియా ఈ ఏడాది దాదాపు 5వేల మందిని నియమించుకోనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లయింగ్‌, నాన్‌ ఫ్లయింగ్‌ కలిపి మొత్తం 11 వేల మంది ఎయిరిండియాలో పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని