10 ఐపీఓలు.. రూ.10,000 కోట్ల లక్ష్యం

స్టాక్‌మార్కెట్‌లో ఒడుదొడుకులు ఎలా ఉన్నా, ఈ నెలలోనూ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)ల జోరు కొనసాగనుంది. పబ్లిక్‌ ఇష్యూల ద్వారా రూ.10000 కోట్లకు పైగా సమీకరించడానికి 10 కంపెనీలు

Updated : 06 Dec 2021 17:21 IST

ఈ నెలలోనూ కొనసాగనున్న పబ్లిక్‌ ఇష్యూల జోరు

దిల్లీ: స్టాక్‌మార్కెట్‌లో ఒడుదొడుకులు ఎలా ఉన్నా, ఈ నెలలోనూ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)ల జోరు కొనసాగనుంది. పబ్లిక్‌ ఇష్యూల ద్వారా రూ.10000 కోట్లకు పైగా సమీకరించడానికి 10 కంపెనీలు సిద్ధమైనట్లు మర్చంట్‌ బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌, టెగా ఇండస్ట్రీస్‌ పబ్లిక్‌ ఇష్యూలు నడుస్తున్నాయి. నవంబరులో 10 కంపెనీలు ఐపీఓలను విజయవంతంగా ముగించడం గమనార్హం. ఈ నెలలో పబ్లిక్‌ ఇష్యూకు రానున్న కంపెనీల్లో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఔషధ విక్రయశాలల సంస్థ మెడ్‌ప్లస్‌, ఆతిథ్య సేవల టెక్నాలజీ ప్రొవైడర్‌ రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీస్‌, ఆర్థిక సేవలు అందించే ఆనంద్‌ రాఠీ గ్రూప్‌ సంస్థ ఆనంద్‌ రాఠీ వెల్త్‌ వంటివి ఉన్నాయి. మేదాంత బ్రాండ్‌ కింద ఆసుపత్రులు నిర్వహిస్తున్న గ్లోబల్‌ హెల్త్‌, మెట్రోబ్రాండ్స్‌, శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌, ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌, శ్రీభజరంగ్‌ పవర్‌ అండ్‌ ఇస్పాత్‌, వీఎల్‌సీసీ హెల్త్‌కేర్‌ కూడా ఐపీఓకు వచ్చే అవకాశం ఉంది.

* ఈ కంపెనీలు రూ.10000 కోట్లకు పైగా సమీకరించనున్నాయని, ఈ నిధులు వ్యాపార విస్తరణ, రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు చెబుతున్నారు. కొన్ని ఐపీఓలు ఆఫర్‌ ఫర్‌ సేల్‌గా రానున్నాయి. ప్రమోటర్లు, ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు తమ వాటా విక్రయించుకోవడమే వీటి లక్ష్యం.
* ఈక్విటీ మార్కెట్లలో ఒడుదొడుకులున్నా, బుల్‌ పరుగు కొనసాగడం కంపెనీలు ఐపీఓలకు రావడానికి మొగ్గుచూపేలా చేస్తున్నాయని లెర్న్‌యాప్‌ డాట్‌ కామ్‌ సీఈఓ, వ్యవస్థాపకుడు ప్రతీక్‌ సింగ్‌ అన్నారు. మరికొన్ని నెలలు ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనా వేశారు.
* ఈ ఏడాదిలో ఇప్పటివరకు 51 కంపెనీలు ఐపీఓలకు వచ్చి రూ.లక్ష కోట్లకు పైగా నిధులు సమీకరించాయి.

రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ ధరల శ్రేణి రూ.405-425
రేట్‌ గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీస్‌ రూ.1335 కోట్ల ఐపీఓ ఈ నెల 7న ప్రారంభమై 9న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.405- 425 నిర్ణయించారు. 6న యాంకర్‌ ఇన్వెస్టర్లు బిడ్డింగ్‌లో పాల్గొనున్నారు. ఇష్యూలో భాగంగా రూ.375 కోట్ల వరకు తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)లో 2.26 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లు విక్రయించనున్నారు. ఓఎఫ్‌ఎస్‌లో 1.71 కోట్ల షేర్లను వాగ్నర్‌ లిమిటెడ్‌, 40.44 లక్షల షేర్లను భాను చోప్రా, 12.94 లక్షల షేర్లను మేఘ చోప్రా, 1.52 లక్షల షేర్లను ఉషా చోప్రా విక్రయిస్తారు. రూ.5 కోట్ల షేర్లను ఉద్యోగులకు కేటాయించారు. వీరికి తుది ఇష్యూ ధరలో రూ.40 రాయితీ ఉంటుంది.

* రేమండ్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ జేకే ఫైల్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (జేకేఎఫ్‌ఈఎల్‌) ఐపీఓ ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. వాహన విడిభాగాల వ్యాపారాన్ని జేకే ఫైల్స్‌ నిర్వహిస్తోంది. రూ.800 కోట్ల ఆఫర్‌ ఫర్‌ సేల్‌తో ఈ ఐపీఓ ఉండనుంది.
* టెగా ఇండస్ట్రీస్‌ ఐపీఓకు తొలి రోజు మొదటి గంటలోనే పూర్తి స్పందన లభించింది. మొదటిరోజు  మొత్తంమీద 4.67 రెట్ల స్పందన వచ్చింది. ఇష్యూలో భాగంగా 95,68,636 షేర్లను ఆఫర్‌ చేయగా.. 4,46,62,233 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని