ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపు పొందండిలా

జాతీయ పెన్షన్ సిస్టం (ఎన్‌పీఎస్): ఎన్‌పీఎస్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మినహాయింపు పొంద‌వ‌చ్చు. ఇది సెక్షన్సెక్షన్ 80 సీసీడీ (1 బీ) కింద 50,000 అదనపు తగ్గింపును అందిస్తుంది. ..

Published : 25 Dec 2020 12:42 IST

పన్ను మిన‌హాయింపు పొంద‌డ‌డం ద్వారా కొంత మొత్తం పొదుపు చేసిన‌ట్టే. మ‌దుప‌ర్లు ప‌న్ను రిటర్నులు దాఖ‌లు చేసేముందు త‌మ‌కు వ‌ర్తించే మిన‌హాయింపుల గురించి తెలుసుకోవాలి. ఆదాయం పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80 సీ కింద ఉన్న పెట్టుబ‌డుల‌ ద్వారా మాత్రమే పన్నుఆదా చేయ‌వ‌చ్చ‌ని చాలా మంది భావిస్తారు. దీని ప్రకారం 1.5 లక్షల పన్ను మినహాయింపు పొంద‌వ‌చ్చు. అయితే 80సీ తోపాటు కొన్ని ఇత‌ర సెక్ష‌న్ల ద్వారా కూడా ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

సెక్షన్ 80 సీసీడీ (1 బీ): జాతీయ పెన్షన్ సిస్టం (ఎన్‌పీఎస్): ఎన్‌పీఎస్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మినహాయింపు పొంద‌వ‌చ్చు. ఇది సెక్షన్సెక్షన్ 80 సీసీడీ (1 బీ) కింద 50,000 అదనపు తగ్గింపును అందిస్తుంది. సాధార‌ణంగా మ‌దుప‌ర్లు త‌మ పిల్లల విద్య, వివాహం వంటి ఆర్థిక లక్ష్యాల కోసం ప్రణాళిక వేస్తారు. కానీ వారి పదవీ విరమణ కోసం ప్రణాళికను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎన్‌పీఎస్ 60 సంవత్సరాల తర్వాత వార్షిక లేదా రెగ్యులర్ పెన్షన్ను అందించే పథకం. మ‌దుప‌ర్లు త‌మ ఎంపిక ప్ర‌కారం ఈక్విటీ, స్థిరాదాయ‌ పెట్టుబడుల‌లో పెట్టవచ్చు. ఈక్విటీ పెట్టుబడులను 75% వ‌ర‌కూ ఉంచవచ్చు. 31.2% అత్యధిక టాక్స్ బ్రాకెట్లో ఉన్నట్లయితే ఎన్‌పీఎస్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 15,600 వరకు ఆదా చేసుకోవచ్చు.

సెక్షన్ 80డీ: ఆరోగ్య బీమా ప్రీమియంలు: పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా, ఆరోగ్య బీమా కవర్ ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా క‌లిగి ఉండాలి. పొదుపుల నుంచి వైద్యం ఖ‌ర్చుకు అయ్యే బిల్లుల‌ను చెల్లించడం వల్ల ఆర్థిక లక్ష్యాల పై ప్ర‌భావం ప‌డుతుంది. ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించే ప్రీమియం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80డీ కింద మినహాయింపు పొందవ‌చ్చు. మీకు, మీ భాగస్వామి పిల్లల కోసం తీసుకున్న ఆరోగ్య బీమా పథకానికి చెల్లించిన ప్రీమియంలపై రూ. 25,000 వరకు ప‌న్ను మిన‌హాయింపు అర్హ‌త ల‌భిస్తుంది. త‌ల్లిదండ్రులు సీనియ‌ర్ సిటిజ‌న్లుగా ఉంటే వారి కోసం కొనుగోలు చేసిన ప్రీమియంలపై రూ. 50,000 ప‌న్ను మిన‌హాయింపు పొందవచ్చు. 31.2% పన్ను స్లాబ్లో ఉన్నవారు ఆరోగ్య బీమా ప్రీమియంలను చెల్లించిన మొత్తంపై ప‌న్ను మిన‌హాయింపు రూ. 75,000 పొంద‌వ‌చ్చు.

సెక్షన్ 80ఈ: విద్య రుణంపై చెల్లించిన వడ్డీ: త‌మ‌ విద్యకు , జీవిత భాగస్వామి లేదా పిల్లల విద్యకు తీసుకున్న రుణంపై చెల్లించిన వడ్డీపై 80ఈ కింద ప‌న్నుమిన‌హాయింపు చేసుకునేందుకు అర్హత ల‌భిస్తుంది.రుణాన్ని తిరిగి చెల్లించటం మొదలుపెట్టిన సంవత్సరం నుంచి ఎనిమిది సంవత్సరాలపాటు చెల్లించిన మొత్తం వడ్డీ మీద మినహాయింపు పొందవచ్చు. అస‌లు మొత్తంపై ప‌న్ను మినహాయింపు వ‌ర్తించ‌దు. ఈ ప‌న్ను మిన‌హాయింపు పొందేంద‌కు , ప్రతి సంవత్సరం రుణదాత నుంచి రుణ చెల్లింపు సర్టిఫికేట్ పొందాలి.

సెక్షన్ 24 (బీ): గృహ రుణంపై వడ్డీని చెల్లించడం: గృహాన్ని కొనుగోలు చేయడం వ్య‌క్తులు సాధారంగా వారి జీవితకాలంలో అతిపెద్ద పెట్టుబడిగా ఉంటుంది. ఇంటి కొనుగోలుకు నిధుల కోసం గృహ రుణాలను తీసుకుంటారు. ప‌న్ను మిన‌హాయింపు విష‌యంలో గృహ రుణంపై మిన‌హాయింపు పొందేందుకు రెండు వేర్వేరు సెక్ష‌న్లు ఉంటాయి. గృహ రుణం అస‌లు, వడ్డీ రెండింటిపై ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. 80సీ కింద గృహ‌రుణం అస‌లుపై మినహాయింపు పొంద‌వ‌చ్చు. గృహానికి సంబంధించి చెల్లించిన వడ్డీపై సెక్షన్ 24 (బి) క్రింద మినహాయింపుపొంద‌వ‌చ్చు.స్వీయ ఆక్రమిత గృహం అయితే మొత్తం రూ. 2 లక్షల పరిమితితో ఉంటుంది. ఇంటిని అద్దెకు ఇస్తే వ‌చ్చే ఆదాయం వ‌డ్డీ చెల్లింపుతో సర్దుబాటు చేసిన తర్వాత నష్టం వచ్చినట్లయితే రూ. 2 లక్షల వ‌ర‌కూ ఇతర ఆదాయాలతో సెటాఫ్ చేసుకోవ‌చ్చు. త‌దుపరి ఎనిమిది సంవత్సరాల వ‌ర‌కూ దీన్ని క్యారీఫార్వ‌ర్డ్ చేసుకోవ‌చ్చు.

సెక్షన్ 80 జీ: విరాళం: స్వచ్ఛంద సంస్థల‌కు డొనేష‌న్లు ఇచ్చే మొత్తం పై పన్ను ప్రయోజనాలను పొంద‌వ‌చ్చు. ఆదాయ పన్ను చట్టం, 1961 కింద కొంత పన్ను మినహాయింపులను అందించడం ద్వారా ఆదాయపన్ను శాఖ స్వచ్ఛంద సంస్థ కోసం విరాళాలను ప్రోత్సహిస్తుంది. మినహాయింపు పరిమితులు విరాళం ఇచ్చే సంస్థ ఆధారంగా కూడా ఉంటుంది. ఉదాహరణకి ప్రధానమంత్రి యొక్క నేషనల్ రిలీఫ్ ఫండ్ కు ఇచ్చే విరాళంపై 100% ప‌న్ను మిన‌హాయింపు పొందవ‌చ్చు. కానీ జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ కు విరాళం 50% మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. ఈ సంస్థల జాబితాను తెలుసుకోవడానికి, ఆదాయపు పన్ను వెబ్సైట్ లాగిన్ అయి “ముఖ్యమైన లింకులు” టాబ్ కింద “మినహాయింపు సంస్థల” లింక్పై క్లిక్ చేయండి.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని