
Fire Accident: ముంబయిలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురిమృతి
ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కనీసం ఆరుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం.. సెంట్రల్ ముంబయిలోని తాడ్దేవ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బృహత్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిధిలోని గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న 20 అంతస్తుల కమలా భవనంలోని 18వ అంతస్తులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక బృందాలు సహా ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
అప్పటికే పలువురు తీవ్రంగా గాయపడడంతో వారిని స్థానిక భాటియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 13 ఫైర్ ఇంజిన్లు, 7 వాటర్ జెట్టీలు మంటల్ని అదుపులోకి తెచ్చాయి. భారీ ఎత్తున పొగ అలముకోవడంతో భవనంలోని వారిని పోలీసులు ఖాళీ చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.