logo

నాణ్యమైన బొగ్గు.. ఆదాయం వైపు మొగ్గు

సింగరేణి బొగ్గు పరిమాణం తగ్గించి సరఫరా చేయాలని సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఇటీవల అధికారులను ఆదేశించారు.

Updated : 26 May 2023 05:46 IST

తక్కువ పరిమాణం.. ఎక్కువ ధర

శ్రీరాంపూర్‌లోని సింగరేణి సీహెచ్‌పీ (పాత చిత్రం)

న్యూస్‌టుడే, శ్రీరాంపూర్‌: సింగరేణి బొగ్గు పరిమాణం తగ్గించి సరఫరా చేయాలని సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఇటీవల అధికారులను ఆదేశించారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న సీహెచ్‌పీల ద్వారా బొగ్గును వివిధ పరిమాణాలుగా చేసి, నాణ్యమైన బొగ్గు పంపిణీ చేస్తోంది. యాజమాన్యం పంపిణీ చేసే బొగ్గు వివిధ పరిమాణాల్లో ఉంటుంది. ఇందులో 100 నుంచి 250 మి.మీ. వరకు బొగ్గును వివిధ పరిశ్రమలతోపాటు థర్మల్‌ కేంద్రాలకు రవాణా చేస్తోంది. విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గును పొడిగా మార్చి బాయిలర్లలో మండించడం ద్వారా వచ్చే ఉష్ణశక్తిని టర్బైన్లకు అందించి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో అధిక మందం ఉన్న బొగ్గును పొడిగా మార్చాలంటే విద్యుత్తు కేంద్రాలకు అదనపు సమయం పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బొగ్గు మందాన్ని 100 మి.మీ.లకు తగ్గిస్తే, విద్యుత్తు కేంద్రాల్లో దాన్ని పొడిగా మార్చడం సులభ తరం అవుతుందనే ఉద్దేశంతో తక్కువ పరిమాణం బొగ్గు కావాలని కోరుతున్నాయి. దీనికి ప్రతిఫలంగా టన్ను బొగ్గుకు అదనంగా రూ. 17 చొప్పున చెల్లించడానికి విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు ముందుకొచ్చినట్లు సంస్థ సీఎండీ శ్రీధర్‌ ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రస్తావించారు.

80 శాతం థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలకే..

సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో 80 శాతానికి పైగా థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలకే సరఫరా అవుతోంది. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోని బొగ్గు ఆధారిత విద్యుత్తు కేంద్రాలకు సింగరేణి బొగ్గు వినియోగం అవుతోంది. పరిమాణం తగ్గించడం ద్వారా సింగరేణికి ఏటా అదనంగా రూ. 60 కోట్ల నుంచి రూ. వంద కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా. దీనికోసం సింగరేణి కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ (సీహెచ్‌పీ)లలో వినియోగించే క్రషర్లలో మరిన్ని మార్పులు చేర్పులు చేస్తూ, 100 మి.మీ.కన్నా తక్కువ బొగ్గును జల్లెడ పట్టేలా ఏర్పాట్లు చేయడానికి యాజమాన్యం సన్నద్ధం అవుతోంది.

సీహెచ్‌పీల సామర్థ్యం పెంపు

సీహెచ్‌పీల సామర్థ్యాన్ని 109 మిలియన్‌ టన్నుల నుంచి 133 టన్నులకు పెంచాలని యాజమాన్యం నిర్ణయించింది. 2024-25 నాటికి కొత్తగా ఏర్పాటు చేయనున్న సీహెచ్‌పీల్లో వీకే ఓసీ వద్ద 4.5 మిలియన్‌ టన్నులు, జేకే ఓసీ వద్ద 2 మి.ట., గోలేటిలో 3.5మి.ట., ఒడిశాలోని నైనీ కోల్‌ బ్లాక్‌ వద్ద 5 మి.ట. రవాణా సామర్థ్యంతో నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించింది. 2025-26 నుంచి సీహెచ్‌పీలలో క్రషింగ్‌, రవాణా సామర్థ్యాన్ని ఏటా 23 మి.ట. చొప్పున పెంచడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామగుండం-2 ఏరియాలో 5 మి.ట., వీకే-ృ, నైనీల్లో 10 మి.ట.చొప్పున సీహెచ్‌పీలను విస్తరించాలని నిర్ణయించింది. మందమర్రి సీహెచ్‌పీతోపాటు రైల్వే సైడింగ్‌ కోసం యాజమాన్యం రూ. 130 కోట్లు కేటాయించనుంది. వచ్చే జులై నాటికి మందమర్రిలో పనులు పూర్తయ్యేలా యాజమాన్యం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 సీహెచ్‌పీల ద్వారా నాణ్యమైన బొగ్గును వినియోగదారులకు సరఫరా చేస్తున్న యాజమాన్యం సీహెచ్‌పీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎక్కువ మొత్తం బొగ్గును రవాణా చేయడానికి ప్రయత్నిస్తోంది. స్పాంజ్‌ ఐరన్‌, ఫార్మా కంపెనీలకు పంపిణీ చేస్తున్న విధంగా విద్యుత్తు కర్మాగారాలకు బొగ్గు నాణ్యతను పెంచే దిశగా యాజమాన్యం అడుగులు వేస్తూ, అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు యత్నిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని