logo

Sai Dharam Tej: మా కుటుంబమంతా పవన్‌ వెంటే: సాయిధరమ్‌ తేజ్‌

‘బ్రో’ చిత్రంలో నా క్యారెక్టర్‌ చనిపోయినప్పుడు భ్రమతో మూడు గంటలు ఏడ్చా.. పవన్‌ మామయ్యకు దూరమై పోతున్నాననే బాధతో.  కానీ మేమంతా పవన్‌ కల్యాణ్‌తోనే జీవితాంతం ఉంటాం.’

Updated : 02 Aug 2023 10:02 IST

‘బ్రో’ విజయోత్సవ సమావేశంలో నటుడు సాయి ధరమ్‌తేజ్‌

మాట్లాడుతున్న సాయిధరమ్‌తేజ్‌

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: ‘బ్రో’ చిత్రంలో నా క్యారెక్టర్‌ చనిపోయినప్పుడు భ్రమతో మూడు గంటలు ఏడ్చా.. పవన్‌ మామయ్యకు దూరమై పోతున్నాననే బాధతో.  కానీ మేమంతా పవన్‌ కల్యాణ్‌తోనే జీవితాంతం ఉంటాం.’ అని నటుడు సాయి ధరమ్‌తేజ్‌ అన్నారు. పవన్‌, సాయితేజ్‌ నటించిన ‘బ్రో’ చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్రబృందం మంగళవారం శ్రీనగర్‌ కాలనీలోని ఓ హోటల్‌కు వచ్చింది. ఈ సందర్భంగా సాయి ధరమ్‌తేజ్‌ విలేకర్లతో మాట్లాడుతూ మామయ్య పక్కన నటించడం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. బ్రో చిత్రం కధ వినగానే ఎప్పుడెప్పుడు చేస్తానోనని ఆత్రుతగా ఎదురు చూశానని, చిరంజీవి మామయ్యతో నటించేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటించడానికి తానెప్పుడూ సిద్ధమేనన్నారు. మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. ‘స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక లఘు చిత్రం చేశా. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంత్రి అంబటి రాంబాబుపై జోకులు వేసే ఉద్దేశంతో ఆ సీన్‌ తీయలేదు. సినిమా, రాజకీయాలను వేర్వేరుగా చూడండి. నాకు రాజకీయ అనుభవం లేదు. మా కుటుంబ సభ్యులంతా పవన్‌ కల్యాణ్‌తోనే ఉంటాం.’ అని సాయిధరమ్‌తేజ్‌ స్పష్టం చేశారు.

సినిమా దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ నటించడం కంటే దర్శకుడిగా రాణించడమే చాలా ఇష్టమన్నారు. గత 16 ఏళ్లుగా దర్శకత్వం చేస్తున్నానని, పవన్‌తో అందరూ సినిమాలు తీయాలనుకుంటున్నా తనకు ‘టైం’ వచ్చిందన్నారు. పవన్‌ కల్యాణ్‌తో పది నిమిషాలు మాట్లాడితే ఆయన వ్యక్తిత్వం అర్థమవుతుందన్నారు. ఈ చిత్రం తీసేందుకు సాయి ధరమ్‌తేజ్‌ ఆరోగ్యం కోలుకొని త్వరగా రావాలని రెండేళ్లు ఎదురు చూశానని సముద్రఖని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని