logo

నగరంలో తొలిసారి భూగర్భ మెట్రో

విమానాశ్రయం వరకు నిర్మించే ఎక్స్‌ప్రెస్‌ మెట్రో.. ఇప్పుడున్న మెట్రో కంటే మరింత అత్యాధునికంగా, అదనపు సౌకర్యాలతో ఉంటుందని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

Published : 30 Nov 2022 01:31 IST

మెట్రోలో అత్యధిక ప్రయాణాలు చేసిన రజనీకి రూ.10వేల గిఫ్ట్‌ వోచర్‌ ఇస్తున్న ఎన్వీఎస్‌రెడ్డి, చిత్రంలో బెర్నాల్డ్‌, కేవీబీ రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌, అమీర్‌పేట, న్యూస్‌టుడే: విమానాశ్రయం వరకు నిర్మించే ఎక్స్‌ప్రెస్‌ మెట్రో.. ఇప్పుడున్న మెట్రో కంటే మరింత అత్యాధునికంగా, అదనపు సౌకర్యాలతో ఉంటుందని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. మెట్రోరైలు ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో అమీర్‌పేట స్టేషన్‌లో మంగళవారం సాంస్కృతిక, ప్రయాణికుల సత్కార వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రాయదుర్గంలోనే లగేజీని తనిఖీ చేసి నేరుగా శంషాబాద్‌ విమానాశ్రయంలోని టెర్మినల్‌లోకి వెళ్లేలా ఏర్పాట్లు ఉండాలని.. సీఎం కేసీఆర్‌ సూచన మేరకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. 31 కి.మీ. మార్గం బయోడైవర్సిటీ కూడలి దాటి కాజాగూడ మీదుగా.. నానక్‌రాంగూడ వద్ద అవుటర్‌లోకి ప్రవేశించి.. అక్కడి నుంచి ఓఆర్‌ఆర్‌ పక్కగా ఆకాశమార్గంలో శంషాబాద్‌ వరకు మెట్రో వెళుతుందని తెలిపారు. తర్వాత 2.5 కి.మీ. భూగర్భ మార్గం ద్వారా నేరుగా విమానాశ్రయ టెర్మినల్‌ స్టేషన్‌కు చేరుతుందని వివరించారు. డిసెంబరు 9న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన తర్వాత ఈపీసీ కాంట్రాక్ట్‌ ఇచ్చి మూడేళ్లలో పనులు పూర్తిచేస్తామన్నారు. ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ ఛార్జీల సవరణపై అధ్యయనం చేస్తోందని.. వారిచ్చే ప్రతిపాదనలను బట్టి నిర్ణయం ఉంటుందన్నారు.  

4.40 లక్షల ప్రయాణికుల ట్రిప్పులు

కొవిడ్‌ తర్వాత మెట్రో పూర్వ స్థాయికి చేరుకుందని... సోమవారం 4.40 లక్షల ప్రయాణికుల ట్రిప్పులు నమోదయ్యాయని  ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. మెట్రోలో అత్యధికంగా ప్రయాణం చేసిన 15 మంది, ఆన్‌లైన్‌లో ఎక్కువగా రీఛార్జ్‌ చేసుకున్న 10మంది ప్రయాణికులకు రూ.10 వేల విలువైన బహుమతి వోచర్లను ఈ సందర్భంగా అందజేశారు. మెట్రో ఆపరేషన్‌ కార్యక్రమాలు చూస్తున్న కియోలిస్‌ గ్లోబల్‌ సీఈవో బెర్నాల్డ్‌ తబరే, ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో సీవోవో సుధీర్‌ చిప్లుంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని