logo

వివాహిత గర్భధారణపై తప్పుడు నివేదిక

గర్భం దాల్చిన ఓ వివాహితకు తప్పుడు నివేదిక ఇవ్వడంతోపాటు గర్భస్రావం చేయించిన ఘటనలో క్లినిక్‌, డయాగ్నొస్టిక్‌ కేంద్రం నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదుచేశారు.

Published : 27 Jan 2023 03:49 IST

క్లినిక్‌, డయాగ్నస్టిక్‌ కేంద్రంపై కేసు నమోదు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: గర్భం దాల్చిన ఓ వివాహితకు తప్పుడు నివేదిక ఇవ్వడంతోపాటు గర్భస్రావం చేయించిన ఘటనలో క్లినిక్‌, డయాగ్నొస్టిక్‌ కేంద్రం నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి సమీపంలోని ఏవీబీపురానికి చెందిన వివాహిత(27) గర్భం దాల్చడంతో ఆమె మధురానగర్‌లోని ఉమా క్లినిక్‌లో పరీక్షలు చేయించుకుంది. క్లినిక్‌ నిర్వాహకురాలు డా.వై.మాధవి ఆమెను పంజాగుట్ట ఠాణా పరిధిలోని రేడియన్స్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌కు స్కానింగ్‌ కోసం పంపింది. బాధితురాలికి ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ(గర్భాశయంలో కాకుండా వేరొక చోట ఫలదీకరణ) ఉందని డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ నివేదిక ఇచ్చింది. బాధితురాలు ఉమా క్లినిక్‌కు వెళ్లగా రిపోర్టు చూసిన డా.మాధవి గర్భం ప్రమాదంలో ఉందని అబార్షన్‌ చేయించుకోవాలని సూచించి ఎస్సార్‌నగర్‌లోని విజయ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అక్కడ వైద్యులు బాధితురాలికి గర్భస్రావం జరిగేలా ఇంజెక్షన్లు చేశారు. రెండు రోజులైనా గర్భస్రావం జరగకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు మరోచోటకు వెళ్లి మళ్లీ స్కానింగ్‌ చేయించారు. అక్కడ గర్భం బాగానే ఉందని, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ కాదని రిపోర్టు వచ్చింది. అప్పటికే బాధితురాలికి ఇంజెక్షన్లు ఇవ్వడంతో గర్భస్రావం జరిగింది. దీంతో బాధితురాలు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్‌ చేసిన పోలీసులు కేసును ఎస్సార్‌నగర్‌కు బదిలీ చేశారు. రేడియన్స్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌, ఉమా క్లినిక్‌పై కేసు నమోదు చేసుకుని సబ్‌ఇన్‌స్పెక్టర్‌ సందీప్‌ దర్యాప్తు జరుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని