logo

వృథాను అరికడదాం.. సద్వినియోగం చేద్దాం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నదులపై చెక్‌డ్యాంల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో పెద్దగా సాగు, తాగు నీటి ప్రాజెక్టులు లేకపోవడంతో వృథా నీటిని ఒడిసి పట్టాలనే ఉద్దేశంతో చెక్‌డ్యాంలు నిర్మించి భూగర్భ జలాలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Published : 29 Mar 2023 02:21 IST

నదులపై చెక్‌డ్యాంల నిర్మాణం
రైతుల సాగుకు ఉపయోగం
న్యూస్‌టుడే, యాలాల

గోవింద్‌రావుపేట్‌లో ప్రారంభమైన పనులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నదులపై చెక్‌డ్యాంల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో పెద్దగా సాగు, తాగు నీటి ప్రాజెక్టులు లేకపోవడంతో వృథా నీటిని ఒడిసి పట్టాలనే ఉద్దేశంతో చెక్‌డ్యాంలు నిర్మించి భూగర్భ జలాలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా 2020 సంవత్సరంలో యాలాల మండలంలోని యాలాల అనుబంధ గ్రామమైన కాకరవేణి నదిపై గోవింద్‌రావుపేట్‌లో చెక్‌ డ్యాంకు రూ.5.75కోట్లు, కాగ్నా నదిపై కోకట్‌, సంగెంకుర్థు గ్రామాల మధ్య చెక్‌ డ్యాంల నిర్మాణానికి రూ.9.62 కోట్లను మంజూరు చేసింది. గోవింద్‌రావుపేట్‌లో 170 మీటర్ల పొడవు, 3 మీటర్ల ఎత్తు, కోకట్‌లో 280 మీ.పొడవు, 3.25ఎత్తులో వీటిని నిర్మించేందుకు ఇప్పటికే  పనులు ప్రారంభించారు. దీంతో  సాగుకు నీటి కొరత తీరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

పెరగనున్న భూగర్భ నీటి మట్టాలు

చెక్‌డ్యాంలు నిర్మించడం ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగు, తాగు నీటి అవసరాలు  తీరనున్నాయి. ఇప్పటికే నదుల పరీవాహక ప్రాంత ప్రజలు రూ.లక్షలు ఖర్చు పెట్టి బోరుబావులు తవ్వించి నీరు పడక అప్పుల పాలు అవుతున్నారు. చెక్‌డ్యాంలు నిర్మించడం ద్వారా వరద నీరు నిలవడంతో 40 నుంచి 70 అడుగుల లోపే నీరు లభించే అవకాశం ఉంది. ఈ డ్యాంల ద్వారా దాదాపు వేయి ఎకరాలకు నీరు అందుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాగ్నానదిపై పాత తాండూరులో చెక్‌డ్యాం నిర్మించడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి బోర్లు వేస్తే 40 అడుగులకే నీరు లభిస్తోందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.


మే చివరి నాటికి పూర్తి చేస్తాం
- నవీన్‌ నీటిపారుదల శాఖ ఏఈ, యాలాల

కాగ్నా, కాకరవేణి నదులపై నిర్మిస్తున్న చెక్‌డ్యాంలను మే చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం ఇసుకలో మునిగిపోయిన సిమెంట్‌ కరకట్టలను వెలికితీసి పనులను ప్రారంభించాం. రైతులకు వీలైనంత తొందరగా సాగు నీరు అందించేందుకు కృషి చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని