logo

మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు: కలెక్టర్‌

జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధిత శాఖల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి తెలిపారు.

Published : 08 Jun 2023 00:49 IST

ఎస్పీ కోటిరెడ్డితో కలిసి మాట్లాడుతున్న నారాయణరెడ్డి

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధిత శాఖల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ కోటిరెడ్డితో కలిసి నార్కోటిక్‌ సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ కళాశాల, పాఠశాల విద్యార్థులు గంజాయికి అలవాటు పడి తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంస్థల్లో తరచుగా తనిఖీలు జరపాలన్నారు. వచ్చే ఆగస్టులో వికారాబాద్‌లో ప్రారంభించే జిల్లా వైద్య కళాశాలలో డీ ఎడిక్ట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటి వరకు 52 మంది నేరస్థులను అరెస్టు చేశామని తెలిపారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్లు సంచిత్‌ గంగ్వార్‌, నారాయణ అమిత్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నవీన్‌చంద్ర, అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్‌, ఆర్డీఓ విజయకుమారి, వ్యవసాయాధికారి గోపాల్‌, జిల్లా వైద్యాధికారి పాల్వన్‌కుమార్‌, జిల్లా సంక్షేమాధికారిణి లలితకుమారి పాల్గొన్నారు.

కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం

ఈనెల 9న నిర్వహించే సంక్షేమ సంబురాల్లో అర్హులైన వెనుకబడిన తరగతులు వారికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తారని నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్‌ హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హులైన అభ్యర్థులు ఈనెల 20 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని