logo

ఎలిగెత్తిన జనం.. ఎగిరిన త్రివర్ణం

ఎలుగెత్తి పాడారు స్వేచ్ఛాగీతం.. మురిసింది జన పతాకం. గణతంత్ర వేడుకలు గురువారం ఊరువాడలా కనులపండువగా సాగాయి.

Updated : 27 Jan 2023 06:31 IST

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి : కలెక్టర్‌ కోటేశ్వరరావు

పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

కర్నూలు సచివాలయం, కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే, బృందం: జనం పదం కదిపారు.. ఎలుగెత్తి పాడారు స్వేచ్ఛాగీతం.. మురిసింది జన పతాకం. గణతంత్ర వేడుకలు గురువారం ఊరువాడలా కనులపండువగా సాగాయి. త్రివర్ణ పతాకాలను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు స్మరించుకున్నారు.  జిల్లా కేంద్రంలోని పోలీసు మైదానంలో నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

* జిల్లా సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు పరేడ్‌ మైదానంలో గురువారం ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌తో కలిసి పెరేడ్‌ వీక్షించి.. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ కర్నూలుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ నాగప్ప రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడు కావడం జిల్లావాసులకు గర్వకారణమన్నారు.

 

ఎథీనా స్కూలు విద్యార్థుల నృత్య ప్రదర్శన


కలెక్టర్‌ ప్రగతి నివేదిక వివరిస్తూ...  రూ.1,942 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న వేదవతి ఎత్తిపోతల పథకం ద్వారా 80 వేల ఎకరాలకు నీరిచ్చేందుకుగాను పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. రూ.1,985 కోట్ల అంచనా వ్యయంతో రాజోలిబండ కుడిగట్టు కాలువ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో రూ.93 కోట్లతో 9,635 ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు 8 ఎత్తిపోతల పథకాలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ఆదోనిలో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న వైద్య కళాశాల పనులు 2025 డిసెంబరు నాటికి పూర్తి చేసేలా పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు.

* సర్వజన వైద్యశాలలో రూ.120 కోట్లతో క్యాన్సర్‌ ఆసుపత్రి ఏర్పాటుచేస్తున్నామని.. త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. కర్నూలు, ఆదోని ఆసుపత్రుల్లో రూ.2 కోట్లతో చేపడుతున్న డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్వెన్షన్‌ సెంటర్‌ పనులు త్వరలో పూర్తి కానున్నాయన్నారు.
*ఉగాది నాటికి 13,774 ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయించేలా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విప్లవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. 29,693 మంది విద్యార్థులు, 2,318 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు అందించామన్నారు.  


వలసల నివారణకు చర్యలు

వలసల నివారణకు, ఆదోని పశ్చిమ ప్రాంతం అభివృద్దికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని కలెక్టర్‌ చెప్పారు. ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల్లోని అన్ని మండలాలతో కలిపి ఆదోని ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మైక్రో ఇరిగేషన్‌ ద్వారా రానున్న ఐదేళ్లలో ఆదోని ప్రాంతంలోని 5,960 హెక్టార్లను సాగులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉద్యానశాఖ ద్వారా ఐదేళ్లలో పది వేల మంది రైతుల పొలాల్లో ఉద్యాన పంటల సాగు లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, జేసీ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, సెబ్‌ అదనపు ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌, డీఆర్వో నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


ప్రగతి ప్రదర్శన

గణతంత్ర వేడుకల్లో భాగంగా 12 ప్రభుత్వ శాఖల శకటాలను ప్రదర్శించారు. సమగ్రశిక్ష అభియాన్‌, వ్యవసాయ శాఖకు ప్రథమ, ద్వితీయ బహుమతులు.. గృహ నిర్మాణ, పంచాయతీరాజ్‌ శాఖ శకటాలకు తృతీయ బహుమతి లభించింది.


మురిసిన విద్యార్థి లోకం

పరేడ్‌ మైదానంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎడిఫై పాఠశాల.. ఏకదంతాయ పాటకు, యూఆర్‌ఎస్‌ పాఠశాల.. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి సంబంధించిన దేశభక్తి పాటకు, ఎథీనా విద్యార్థులు రామం రాగవం పాటకు, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యార్థులు లంబాడీ పాటకు, కేశవరెడ్డి పాఠశాలకు చెందిన 270 విద్యార్థులు సైరా నరసింహారెడ్డి సినిమా పాటకు నృత్య ప్రదర్శన ఇచ్చారు. కృష్ణగిరి మండలం కేజీబీవీ పాఠశాల విద్యార్థుల రోప్‌ స్కిప్పింగ్‌ నృత్యం చేశారు.


సమరయోధుల కుటుంబసభ్యులకు సన్మానం

గణతంత్ర దినోత్సవానికి హాజరైన ఏడుగురు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యులను కలెక్టర్‌ కోటేశ్వరరావు, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గుర్రం వెంకటరెడ్డి కుమారుడు జైపాల్‌రెడ్డి, సర్దార్‌ నాగప్ప కుమారుడు సర్దార్‌ బుచ్చిబాబు, జి.సత్యనారాయణ సతీమణి సుబ్బమ్మ, శుభాకర్‌ భార్య ఎం.సి.ఎంకమ్మ, ఎస్‌డీ నారాయణరావు కుమారుడు ఎస్‌డీ నరేంద్ర ప్రసాద్‌, ఎంఎస్‌కే బియాబానీ కుమారుడు, కుమార్తె బాషా బియాబాని, జైనత్‌బీబీ, తుక్కోజీరావు కుమారుడు చంద్రకాంత్‌ను సన్మానించారు.

ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి నాటకాన్ని పాట రూపంలో ప్రదర్శిస్తున్న కేశవరెడ్డి పాఠశాల విద్యార్థులు

స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను సన్మానిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని