logo

అమరావతి ఆశ.. రమణబాబు దురాశ

కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో అపహరణకు గురైన 105 కిలోల వెండి, రూ.2.05 లక్షల నగదు కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.

Published : 02 Apr 2023 02:49 IST

తొమ్మిది నెలల కిందటనే స్టేషన్లో సొత్తు మాయం
81.52 కిలోల వెండి, రూ.10 లక్షల నగదు స్వాధీనం
ఇప్పటి వరకు నలుగురి అరెస్టు

పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, వెండి

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో అపహరణకు గురైన 105 కిలోల వెండి, రూ.2.05 లక్షల నగదు కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి కర్నూలు బుధవారపేటకు చెందిన అమరావతి( కౌతాళం హెడ్‌ కానిస్టేబుల్‌), ఆత్మకూరు పట్టణం నేతాజీ నగర్‌కు చెందిన రమణబాబు(కోడుమూరు కానిస్టేబుల్‌), అమరావతి భర్త విజయ్‌భాస్కర్‌ (బుధవారపేట), ఆమె మరిది భరత్‌సింహా(ప్రకాశ్‌నగర్‌)ను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో అదనపు ఎస్పీ ప్రసాద్‌, సిబ్బందితో కలిసి ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ శనివారం వివరాలు వెల్లడించారు.


105 కిలోల వెండి.. రూ.2.05 లక్షల నగదు

* 2021 జనవరి 27న కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద సెబ్‌ అధికారులు తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్‌ నుంచి కారులో వస్తున్న తమిళనాడు రాష్ట్రం సేలం వ్యాపారి సందన్‌ భారతిగోవిందరాజ్‌ వద్ద 105 కిలోల వెండి, రూ.2.05 లక్షల నగదు దొరికింది. సరైన ఆధార పత్రాలు లేకపోవటంతో అక్రమ రవాణాగా పరిగణిస్తూ సీజ్‌ చేసి కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో సీఐ విక్రమ్‌సంహాకు అప్పగించారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో రూ.35 లక్షల జరిమానా విధించారు.


వ్యాపారి రారని నిర్ధారించుకుని

* బాధితులు జరిమానా చెల్లించకపోవటంతో సొత్తు స్టేషన్‌లో ఉంచారు. అప్పట్లో స్టేషన్‌ రైటర్‌గా ఉన్న కానిస్టేబుల్‌ రమణబాబు ఠాణాలోని ప్రాపర్టీ గదిలో వెండిని భద్రపరిచి రూ.2.05 లక్షలు వాడుకున్నారు. కొన్నాళ్లకు సీఐ విక్రమ్‌సింహా బదిలీ కావడంతో ఆయన స్థానంలో శేషయ్య వచ్చారు. ఇదే సమయంలో రమణబాబు బదిలీ కావడంతో తను వాడుకున్న రూ.2.05 లక్షలు స్టేషన్‌ రైటర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ అమరావతికి తిరిగి ఇచ్చేశారు.
* వెండి తీసుకెళ్లేందుకు తమిళనాడు వ్యాపారి ఆసక్తి చూపటం లేదన్న విషయాన్ని పసిగట్టిన అమరావతికి కాజేయాలన్న దుర్భుద్ధి పుట్టింది. వ్యాపారికి అమరావతి పలుమార్లు వాట్సాప్‌ కాల్‌ చేశారు.. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో  ఇక వారు రారని నిర్ధారించుకున్నారు. వెండి అపహరించే ఆలోచనను కానిస్టేబుల్‌ రమణబాబుకు చెప్పి అతడిని భాగస్వామిగా చేసుకుంది.


భర్తను రప్పించి.. బ్యాగులు బయటకు తోసి

వెండిని కాజేయాలన్న ఆలోచనలో ఉన్న అమరావతి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సీజ్‌ చేసి స్టేషన్‌లో ఉంచిన మద్యాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం మే 24న చేపట్టారు. సిబ్బంది హడావుడిగా ఉన్న సమయంలో అమరావతి స్టేషన్‌ మొదటి అంతస్తులో ఉన్న వెండిని కిందికి తీసుకొచ్చి సీఐ గదికి మార్చింది. అర్ధరాత్రి    11.30 గంటల సమయంలో తన భర్తతో స్టేషన్‌కు వచ్చింది. సీఐ గదిలో కిటికీకి గ్రిల్‌ లేకపోవటంతో రెండు బ్యాగుల వెండిని బయటకు తోశారు. వాటిని తీసుకొని విజయ్‌భాస్కర్‌ అక్కడి నుంచి ఉడాయించారు. తర్వాత విజయ్‌భాస్కర్‌ తన తమ్ముడు భరత్‌సింహా ద్వారా 23 కిలోల వెండి విక్రయించారు.


వీటికి సమాధానాలేవీ

వెండి చోరీ ఉదంతంలో పలు విషయాలు మిస్టరీగా మారాయి. రికవరీ విషయంలో స్పష్టత కొరవడింది. వెండి విక్రయించిన తర్వాత హెడ్‌ కానిస్టేబుల్‌ అమరావతితో చేతులు కలిపిన కానిస్టేబుల్‌ రమణబాబు వాటా లెక్క చెప్పలేదు. 23 కిలోల వెండి విక్రయించి నగదుగా మార్చుకున్నట్లు చెప్పిన ఉన్నతాధికారులు ఆ డబ్బుతో ఏమి  కొనుగోలు చేశారో చెప్పలేదు. కొత్త కారులో పారిపోతున్నట్లు చెప్పినా.. ఆ కారు ఎవరిది.. ఎప్పుడు కొనుగోలు చేశారో వివరాలు వెల్లడించలేదు.


వ్యాపారి రావడంతో వెలుగులోకి

వెండి ధర పెరిగేసరికి ఇటీవల తమిళనాడు వ్యాపారి వెండికి పన్ను చెల్లించి విడుదల ఉత్తర్వు పొందారు. వెండి తీసుకెళ్లేందుకు కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్‌కు రావటంతో వెండి, నగదు మాయమైనట్లు బయటపడింది. ఈ ఉదంతం కాస్త వివాదాస్పదంగా మారటంతో కేసు నమోదుకు ఎస్పీ ఆదేశించారు. చర్యలు తీసుకుంటారని గ్రహించిన నిందితులు ముందస్తు బెయిల్‌ పొందేందుకు కారులో కర్ణాటక రాష్ట్రానికి పారిపోతుండగా పట్టుకున్నామని, 81.52 కిలోల వెండి, రూ.10 లక్షల నగదు వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. జరిగిన ఘటన బాధాకరమని ఎస్పీ విచారం వ్యక్తం చేస్తూ మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పర్యవేక్షణలో విచారణ జరిపించి లోపాలు గుర్తిస్తామని, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని