logo

పరిశీలిస్తూ..ఆదేశాలిస్తూ..

దేశంలోనే తొలిసారిగా అత్యంత సాంకేతికతతో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (వైటీపీఎస్‌)ను సీఎం కేసీఆర్‌ సోమవారం సందర్శించారు.

Published : 29 Nov 2022 06:25 IST

యాదాద్రి విద్యుత్తు కేంద్రంలో నాలుగు గంటల పాటు సీఎం కేసీఆర్‌ పర్యటన

సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్లభూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్‌, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, నలమోతు భాస్కర్‌రావు, శానంపూడి సైదిరెడ్డి, తదితరులు

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, దామరచర్ల: దేశంలోనే తొలిసారిగా అత్యంత సాంకేతికతతో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (వైటీపీఎస్‌)ను సీఎం కేసీఆర్‌ సోమవారం సందర్శించారు. జూన్‌ 8, 2015న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా...ఏడేళ్ల అనంతరం ఆయన ప్లాంట్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. మధ్యాహ్నం   హైదరాబాద్‌ నుంచి వాయు మార్గంలో ఇక్కడకు చేరుకున్న ముఖ్యమంత్రి ప్రాజెక్టులో నిర్మిస్తున్న ఐదు బాయిలర్లు, యూనిట్లను ఆసాంతం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును జెన్‌కో, బీహెచ్‌ఈఎల్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలపై అక్కడికక్కడే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుమారు నాలుగు గంటల పాటు ప్లాంట్‌ ప్రాంగణంలోనే గడిపిన ఆయన  దాదాపు రెండు గంటల పాటు ప్లాంట్‌ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న జెన్‌కో, ట్రాన్స్‌కో ఇంజినీర్లు, బీహెచ్‌ఈఎల్‌ అధికారులను అభినందించారు. గత ఐదేళ్ల నుంచి ప్లాంట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎండీ ప్రభాకర్‌రావు, జెన్‌కో చీఫ్‌ ఇంజినీరు సమ్మయ్య సీఎం కేసీఆర్‌కు వివరించారు. సాయంత్రం 4.53 గంటలకు సీఎం ప్లాంటు నుంచి హైదరాబాద్‌కు హెలికాఫ్టర్‌లో బయలుదేరారు.

ధాన్యం దిగుబడుల్లో స్వయం సమృద్ధి

ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో ధాన్యం దిగుబడుల్లో స్వయం సమృద్ధి సాధించామని కేసీఆర్‌ అన్నారు. ప్లాంట్‌ పరిశీలన ముగిసిన అనంతరం జెన్‌కో సీఎండీ క్యాంపు కార్యాలయంలో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, మంత్రులు జగదీశ్‌రెడ్డి, దయాకర్‌రావు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేశారు. సుమారు గంట పాటు రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు, రైస్‌ మిల్లుల స్థాపనపై ఆయన ప్రజాప్రతినిధులతో చర్చించారు. చైనాలో రైస్‌మిల్లులు, వరి సాగు, దిగుబడులు ఎలా ఉంటాయి, మన పరిస్థితులు ఏంటి? భవిష్యత్తులో ధాన్యం దిగుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందునా మన దగ్గరా ఎలాంటి మిల్లులను స్థాపించాలనే దానిపై అధికారులు, ఎమ్మెల్యేలతో చర్చించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములవుతున్న అధికారులను సీఎండీ ప్రభాకర్‌రావు సీఎం కేసీఆర్‌కు పరిచయం చేశారు.

వంటలు బాగున్నాయ్‌..

మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం వంటకాలు బాగున్నాయని, ఇక్కడే చేశారా? అని ప్రశ్నించగా...జెన్‌కో అధికారులు ఇక్కడే చేశామని సీఎంకు వివరించారు. అన్ని వంటలు బాగున్నాయని ముఖ్యమంత్రి అధికారులకు కితాబునిచ్చారు.

పనుల ప్రగతిపై విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, అధికారులతో సమీక్షిస్తున్న కేసీఆర్‌. చిత్రంలో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, తదితరులు


సమస్యలపై కేసీఆర్‌కు ఎమ్మెల్యే వినతి.. పరిష్కారానికి సీఎం ఆదేశాలు

దామరచర్ల, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ పవర్‌ప్లాంటు పనుల పరిశీలనకు వచ్చిన సందర్భంగా నియోజకవర్గంలో పలు సమస్యలను మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఉమ్మడి దామరచర్ల మండలంలో కళ్లేపల్లి, తిమ్మాపురం, పుట్టలగడ్డ, ఉల్సాయిపాలెం తదితర గ్రామాలో పోడుభూముల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌, ఆర్డీవోను ఆదేశించారు. ప్లాంటు నిర్మాణం, రైల్వేలైను కింద భూములు కోల్పోయిన వారికి జాబ్‌కార్డు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. గ్రామాల్లో సీసీ రోడ్లకు రూ.25.30 కోట్లు, డ్రైనేజీ, అంతర్గత రహదారులకు రూ.60 కోట్లు, నర్సాపురం-తిమ్మాపురం బీటీ రహదారి, దామరచర్ల నుంచి వైటీపీఎస్‌ వరకు నాలుగు వరుసల రహదారి కోసం రూ.60 కోట్లు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గంలో 10 చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేయాలన్నారు. రైస్‌మిల్లులపై ఉన్న కమర్షియల్‌ పన్ను రద్దు చేయడంతో మిల్లర్లు ధన్యవాదాలు తెలిపారు. ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.24 కోట్ల నిధులను మంజూరు చేయాలని ప్రతిపాదనలు అందజేశారు.

సీఎంకు వినతి... పలు సమస్యలపై మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. దామరచర్ల నుంచి వైటీపీఎస్‌ వరకు నాలుగు వరుసల సీసీ రహదారి నిర్మాణం, రైతాంగ, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

నిర్మాణంలో ఉన్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం


భారీ బందోబస్తు

దామరచర్ల, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా సోమవారం పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. దామరచర్ల నుంచి పవర్‌ప్లాంటు వరకు వీర్లపాలెం రహదారిపై భారీగా పోలీసులు మోహరించారు. ఐదుగురు సీఐలు, 10మంది ఎస్సైలు, వందమందికి పైగా పోలీసులు విధులలో పాల్గొన్నారు. కేసీఆర్‌ వాయుమార్గంలో ప్లాంటుకు రాగా, విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉదయం 11గంటలకు వాహనాలలో అక్కడికి చేరారు. తొలుత మంత్రితో పాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాత్రమే లోపలికి అనుమతించారు. అంతకు ముందు జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ట్రైకార్‌ ఛైర్మన్‌ రాంచందర్‌నాయక్‌ను ప్రధాన ద్వారం వద్ద నిలిపేయడంతో వారు వెనుదిరిగారు. మంత్రి జగదీశ్‌రెడ్డి వచ్చాక ఆయన కాన్వాయ్‌ వెంట లోపలికి ప్రవేశించారు.

* స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులను తొలుత ప్లాంటులోకి అనమతించలేదు. తదుపరి ఎమ్మెల్యే భాస్కర్‌రావు జోక్యం చేసుకొని పోలీసు ఉన్నతాధికారులకు నచ్చజెప్పడంతో సమారు 100మందిని లోపలికి అనుమతించారు.

* ప్లాంటులోకి మీడియాను అనుమతించకపోవడంతో పాత్రికేయులు ప్రధానద్వారం వద్ద పడిగాపులు కాశారు. లోపలికి అనుమతించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గంటసేపు వేచి ఉండి అక్కడి నుంచి వెనుదిరిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని