logo

కారుపై పొక్లెయిన్‌ పిడుగు!

ఓ రోడ్డు ప్రమాదం తల్లికి కొడుకు, కోడలు, కూతురిని.. ఇద్దరు చిన్నారులకు తల్లిదండ్రులను దూరం చేసింది. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Published : 29 Mar 2023 06:27 IST

ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు

పొక్లెయిన్‌ పడటంతో నుజ్జునుజ్జైన కారు

భీమ్‌గల్‌, న్యూస్‌టుడే: ఓ రోడ్డు ప్రమాదం తల్లికి కొడుకు, కోడలు, కూతురిని.. ఇద్దరు చిన్నారులకు తల్లిదండ్రులను దూరం చేసింది. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. భీమ్‌గల్‌ ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి కథనం ప్రకారం... మోర్తాడ్‌ మండలం దొన్కల్‌కు చెందిన లక్ష్మి తన కుటుంబ సభ్యులతో బడాభీమ్‌గల్‌ ఎల్లమ్మ వద్దకు మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లారు. కారులో మొత్తం ఏడుగురితో తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం రాత్రి భీమ్‌గల్‌ పట్టణంలోని విద్యుత్తు ఉపకేంద్రం వద్ద ట్రాక్టర్‌ ట్రాలీపై ఉన్న పొక్లెయిన్‌ వారి కారుపై పడింది. అందులో ఉన్న లక్ష్మి కొడుకు ముప్పారపు రాజేశ్వర్‌(45), కోడలు జ్యోతి(42), కూతురు రమ(41) అక్కడికక్కడే మృతి చెందారు. నుజ్జునజ్జయిన కారులో నుంచి మృతదేహాలను, క్షతగాత్రులను బయటికి తీసేందుకు 108 సిబ్బంది దినేష్‌, నరేందర్‌, వంశీ గంట పాటు శ్రమించారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మి, అల్లుడు చుక్కాల రాజేశ్వర్‌ను 108 అంబులెన్సులో నిజామాబాద్‌ జనరల్‌ ఆసుపత్రికి, మృతదేహాలను ఆర్మూర్‌ ప్రాంతీయాసుపత్రికి తరలించారు. ముప్పారపు రాజేశ్వర్‌-జ్యోతి దంపతులకు కూతురు, కొడుకు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. విగతజీవులైన తన కొడుకు, కూతురు, కోడలిని చూస్తూ.. లక్ష్మి రోదించడం స్థానికుల్ని కలిచివేసింది. రమకు ఆర్మూర్‌ మండలం గోవింద్‌పేట్‌కు చెందిన చుక్కాల రాజేశ్వర్‌తో పెళ్లైంది. ట్రాక్టర్‌ ట్రాలీపై నుంచి పొక్లెయిన్‌ ఎదురుగా వస్తున్న కారుపై ఎలా పడింది? కారు ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొట్టిందా? అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
మంత్రి దిగ్భ్రాంతి : రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని