logo

స్వచ్ఛతకు కొన్నాళ్లు ఆ‘గాలి’

‘జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం’ (నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం/ఎన్‌.సి.ఎ.పి.)లో భాగంగా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.100.75 కోట్ల జీవీఎంసీకి మంజూరయ్యాయి.

Published : 29 Nov 2022 03:29 IST

కమ్మేస్తున్న కాలుష్యం కట్టడికి చర్యలు అంతంతే

ఈనాడు, విశాఖపట్నం

* కాలుష్య శాతాన్ని గుర్తించడానికి కాలుష్య నియంత్రణ మండలి దగ్గర తొమ్మిది ఎ.ఎ.క్యు.(యాంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ) కేంద్రాలు ఉన్నాయి. తాజాగా మరో నాలుగు    సి.ఎ.ఎ.క్యు.(కంటిన్యూవస్‌ యాంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ) కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో ఒకటి ఎండాడ, మరొకటి గాజువాక దగ్గర నెలకొల్పుతారు. మరో రెండు నాలుగైదు నెలల్లో అందుబాటులోకి తెస్తారు.

* దుమ్ము, ధూళి ఎగరకుండా నియంత్రించడంలో ‘స్వీపింగ్‌ యంత్రాలు’ది కీలక పాత్ర. 8 యంత్రాలు కొనుగోలు చేయబోతున్నారు.

* కాపులుప్పాడ డంపింగ్‌ యార్డ్‌ చుట్టూ ప్రహరీ నిర్మించాలని నిర్ణయించారు. లోపల పచ్చదనాన్ని అభివృద్ధి చేయనున్నారు.

పరిశ్రమల కేంద్రంగా మారిన విశాఖలో స్వచ్ఛమైన గాలి అందటం అంత తేలిక కాదు. ప్రస్తుతం గాలి నాణ్యత 202 పాయింట్లుగా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు గుర్తించింది.

‘జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం’ (నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం/ఎన్‌.సి.ఎ.పి.)లో భాగంగా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.100.75 కోట్ల జీవీఎంసీకి మంజూరయ్యాయి. పనులు మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి. 2020-21లో రూ.73 కోట్లు విడుదలలో ఆలస్యం జరగడం, కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో పనులు పూర్తిచేయడానికి అవాంతరాలు తలెత్తాయి. 2019లో ఉన్న కాలుష్య తీవ్రతలో కనీసం 25 నుంచి 30శాతం తగ్గుదలను 2026 నాటికి తీసుకురావాలన్నది ఎన్‌.సి.ఎ.పి. లక్ష్యం. తాజా మరో రూ. 27.75 కోట్లు విడుదలయ్యాయి. కాలానుగుణంగా వాహనాలు, పరిశ్రమలు పెరిగి కాలుష్య తీవ్రత కూడా ఎక్కువవుతుంటుంది. ఆ పెరుగుదలను అడ్డుకుంటూ...కాలుష్యాన్ని భారీగా తగ్గించాలన్న లక్ష్యం చేరుకోవాలంటే కఠినమైన చర్యలను తీసుకోవాల్సి ఉన్నా...కార్యాచరణ వేగవంతంగా సాగడం లేదు.

ట్రాఫిక్‌ కూడళ్ల వద్దే..: నగరంలో ట్రాఫిక్‌ కూడళ్లు కాలుష్యానికి కేంద్రాలుగా మారుతున్నాయి. చాలా కూడళ్లు ఇరుకుగా ఉన్నాయి. సిగ్నళ్లు పడితే ఎక్కువ సేపు అధిక సంఖ్యలో వాహనాలు ఆగాలి. అందుకే  ‘ఆర్‌ అండ్‌ బీ’ జంక్షన్‌, లంకెలపాలెం, కాకానినగర్‌, లా కాలేజీ, ఎండాడ, డైరీఫారం, హనుమంతువాక, కొమ్మాది, సింహాచలం , గాజువాక జంక్షన్‌లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 18 కూడళ్లలో ఫౌంటెన్లు నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది.

ఫౌంటెన్లు ఏర్పాటు చేస్తే వాతావరణంలో చెలరేగే దుమ్ము, ధూళి దగ్గరి నీళ్లలో కలిసి కాలుష్యం కొంత తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు. పలు చోట్ల రహదారి ఆకృతుల్లో లోపాలను గుర్తించి సవరిస్తారు. కొన్ని అంచుల వరకూ విస్తరిస్తారు. ఫలితంగా వాహనాల రాకపోకల వేగం పెరుగుతుంది. ట్రాఫిక్‌ అవాంతరాలు తలెత్తక కాలుష్య శాతం తగ్గుతుంది. విజయవాడలో కొన్నేళ్లుగా సీఎన్‌జీతో నడిచే బస్సులు 200లకు పైగా వినియోగిస్తున్నారు. వేలాది సీఎన్‌జీ ఆటోలున్నాయి. విశాఖలో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. దాదాపు 600 బస్సులున్నా...సీఎన్‌జీతో నడిచేది ఒక్కటీ లేదు. మరో వైపు కాలం చెల్లిన  బస్సులను కూడా ఉపయోగించేస్తున్నారు. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యం భారీగా ఉంటోంది. నగరంలో తిరిగే 30 వేలకు పైగా ఆటోల్లో 98 శాతం ఆటోలు డీజిల్‌తో నడిచేవే.


అవగాహన కల్పిస్తున్నాం

నగరంలో కాలుష్య తీవ్రతను గణనీయంగా తగ్గించేందుకు వీలుగా పలు చర్యలు చేపట్టాం. వాటిని సాధ్యమైనంత వేగంగా పూర్తిచేసేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఎన్‌.సి.ఎ.పి. లక్ష్యానికి అనుగుణంగా  కాలుష్య తీవ్రత తగ్గేలా భాగస్వాములందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాం.

పి.రాజాబాబు, కమిషనర్‌, జీవీఎంసీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని