logo

అరకిలో అదనం.. అన్నదాతకు అన్యాయం!

జిల్లాలో తూకాలు ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలన్నింటిలోనూ అరకిలో అదనంగా తూకం వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

Published : 02 Dec 2022 04:31 IST

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌

మడుపుగల్‌ కొనుగోలు కేంద్రంలో కాంటాలు వేస్తున్న హమాలీలు

జిల్లాలో తూకాలు ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలన్నింటిలోనూ అరకిలో అదనంగా తూకం వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మిల్లర్ల ప్రయోజనం కోసం అదనంగా కాంటా వేస్తున్నారు. ఫలితంగా ఎంతో శ్రమించి పంట పండించిన కర్షకులు దగాపడుతున్నారు. తరుగు పేరిట ప్రతి బస్తాకు అర కిలో చొప్పున అదనంగా తూకం వేస్తున్నారు. ఖాళీ బస్తాతో కలిపి 40.600కిలోల చొప్పున తూకం వేయాలి. నిర్వాహకులు అరకిలో అదనంగా 41.200గా వేస్తున్నారు. ఈ లెక్కన 200 బస్తాలు పండిన రైతులకు బస్తాకు అరకిలో చొప్పున క్వింటాలు ధాన్యం నష్టపోతున్నారు. జిల్లాలో 1.32 లక్షల మంది రైతులు 2.12 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు.3.17 లక్షల టన్నులు దిగుబడులు వస్తాయని వ్యవసాయాధికారులు అంచనాలు రూపొందించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించే వారందరికీ నష్టం వాటిల్లుతోందని అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అదనంగా తూకానికి అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


మహబూబాబాద్‌ మండలం ముడుపుగల్లు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఇది. ఇక్కడ 41.200 కిలోలు చూపిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40.600 కిలోల చొప్పున బస్తా కాంటా వేయాలి. నిర్వాహకులు అదనంగా అరకిలో తూకమేస్తున్నారు. కేంద్రంలో మూడు చోట్ల కాంటాలు నిర్వహిస్తుండగా అన్ని చోట్ల ఇదే విధంగా జరుగుతోంది. ఎక్కువ కాంటా ఎందుకు వేస్తున్నారని నిర్వాహకులను ప్రశ్నిస్తే మిల్లర్లు బరువు తక్కువగా వస్తుందని దిగుమతి చేసుకోవడం లేదని.. దీంతో అదనంగా తూకమేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో తాము నష్టపోతున్నామని నిబంధనల ప్రకారమే కాంటాలు చేయాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు.


208 కేంద్రాలు

ఐకేపీ, పీఏసీఎస్‌, జీసీసీ, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మెప్మా ద్వారా జిల్లాలో 239 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. 208 ప్రారంభించి కొనుగోలు చేస్తుండగా ఇప్పటి వరకు 2265 టన్నుల ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించినట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ లెక్కన తరుగు రూపంలో క్వింటాళ్ల కొద్ది నష్టపోయి ఉంటామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్వాహకులు ఏమంటున్నారంటే

కేంద్రాల్లో తూకం వేసి నిల్వ చేసిన బస్తాలను మిల్లులకు పంపినప్పుడు బరువు తగ్గిందని మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో అదనంగా తూకం వేస్తున్నామంటున్నారు. అప్పుడప్పుడు తేమ శాతం అధికంగా ఉందని దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారన్నారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తున్నట్లు చెబుతున్నారు. ముడుపుగల్‌ కేంద్రం నుంచి పంపించిన సుమారు మూడు లారీల ధాన్యాన్ని బరువు తక్కువగా ఉందని తీసుకోవడానికి నిరాకరిస్తే గోనె సంచులకు చిల్లులు పడడం వల్ల తరగు వచ్చిందని చెప్పామన్నారు.


నిబంధనల ప్రకారమే తూకాలు

కృష్ణవేణి, జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్‌

కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులను నిబంధనల ప్రకారం తాలు, దుమ్ము లేకుండా, 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని తూకం వేయాలని చెప్పాం. అలా కాకుండా వారికి నచ్చినట్లుగా..అదనంగా తూకం వేస్తూ అన్నదాతలను నష్టపరిచడం సరికాదు. అలాంటివి ఉంటే నిర్వాహకులను హెచ్చరించి నిబంధనల ప్రకారం కాంటాలు చేయాలని సూచిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని