icon icon icon
icon icon icon

ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీరు

‘ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీరందించడటమే తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళతాం.

Published : 22 Apr 2024 06:52 IST

ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం
సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యం
జగన్‌.. మీ చిల్లర వ్యవహారాలు ఆపాలి
చిరంజీవి జోలికొస్తే సహించేది లేదు..
నరసాపురం, భీమవరం వారాహి సభల్లో జనసేనాని పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, భీమవరం: ‘ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీరందించడటమే తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళతాం. నదులను అనుసంధానిస్తాం. వీలైనంత త్వరగా పోలవరం పూర్తి చేసి వలసలు, పస్తులు లేని రాష్ట్రాన్ని నిర్మిస్తాం. చేతివృత్తులను ఆదుకుంటాం. భవన నిర్మాణ కార్మికులను కాపాడుకుంటాం..’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, భీమవరంలలో ఆదివారం నిర్వహించిన వారాహి విజయభేరి సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు కీలకమని రాష్ట్ర భవిష్యత్తు కోసం కేంద్రంతో మాట్లాడి పొత్తు కోసం చాలా విషయాల్లో తగ్గానని అన్నారు. అన్న క్యాంటీన్లతోపాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లనూ నడిపిస్తామన్నారు. వశిష్ట వారధి పూర్తి చేయకుండా ఓట్లు అడగబోనని చెప్పిన జగన్‌కు ఈ ఎన్నికల్లో ప్రచారానికే అర్హత లేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతమున్న బీసీ రిజర్వేషన్లను 24 శాతం చేసి రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేశారని, రిజర్వేషన్‌ను తమ కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని తెలిపారు. కోనసీమలో రైలు కూత నరసాపురం వరకు వినిపించేలా చేస్తామని హామీనిచ్చారు.

‘ఆక్వా రైతులు కష్టాలు చెప్పి జగన్‌ను సాయం కోరితే వారికి గుదిబండలా మారారు. తెదేపా ప్రభుత్వం యూనిట్‌ విద్యుత్తు రూపాయిన్నర రాయితీతో ఇస్తే జగన్‌ రూ.5 చేసి నిండా ముంచారు. ప్యాలెస్‌ల మీద ప్యాలెస్‌లు కడుతున్న జగన్‌కు హార్బర్‌, జెట్టి కట్టడం చేత కాలేదు. 70 లక్షల మత్స్యకార కుటుంబాలను దోచేందుకు 217 జీవో తెచ్చారు. దాన్ని మన ప్రభుత్వం రాగానే రద్దు చేస్తాం. మత్స్యకారులకు రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తింపజేస్తాం’ అని పేర్కొన్నారు. శెట్టి బలిజలపై తప్పుడు ఎక్సైజ్‌ కేసులు తొలగిస్తామని అన్నారు.

ఓటు బ్యాంకు రాజకీయాలు కావు..

‘నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు. అన్ని కులాలు బాగుపడాలని కోరుకునేవాణ్ని. ఓటుబ్యాంకు రాజకీయాలు చేయను. జగన్‌కు కాపు ఓట్లు కావాలి. వారితో నన్ను తిట్టించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. మీరు శివశివాని స్కూల్‌లో పేపర్లు లీక్‌ చేసే కాలంలోనే చేగువేరా గురించి చదువుతున్నా. మీకు, నాకు అంత వ్యత్యాసముంది. నేను ఎమ్మెల్యే ప్రసాదరాజును తిడితే ఆయన్ని మాత్రమే తిట్టినట్లు. ఆయన కులాన్ని కాదు. నరసాపురంలో కక్షకట్టి ఒకే కులానికి చెందిన 40 మంది అధికారులను అన్యాయంగా బదిలీ చేయించారు. జగన్‌.. మీరు కులాలను విడగొడితే నేను ఏకం చేస్తా. వైకాపా గూండాలకు ఇదే హెచ్చరిస్తున్నా..’ అని పవన్‌ పేర్కొన్నారు.

సజ్జలా.. మా అన్న జోలికి రావద్దు

‘మా అన్నయ్య వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. సీఎం రమేశ్‌, పంచకర్ల రమేశ్‌కు ఇద్దరికి మద్దతు తెలుపుతున్నానని అన్నయ్య అనగానే చిరంజీవి వచ్చినా ఎవరొచ్చినా సింహం సింగిల్‌గా వస్తుందంటూ సజ్జల ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీరు ప్రజల పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తింటున్నారు. ఎన్నికల సంఘం పార్టీలకు అనుకూలంగా మాట్లాడొద్దని చెప్పినా మారరు. అన్నయ్య అజాతశత్రువు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మా అన్నయ్య జోలికి వస్తే సహించేది లేదు. గతంలో మూడు రాజధానుల నిర్ణయం మంచిదేనని ఆయనతో అనుకూలంగా మాట్లాడించినా.. తమ్ముడిగా సహించా. వైకాపా పాలనలో చిరంజీవి, రజినీకాంత్‌ వంటి గొప్పవారికే మాట్లాడే స్వేచ్ఛ లేదు’ అని పవన్‌ తెలిపారు. ‘రాష్ట్రంలో 50 స్థానాల్లో బలమైన అభ్యర్థులుండీ పోటీ చేయగలిగే స్థాయిలో ఉండీ మీ భవిష్యత్తు కోసం వెనక్కి తగ్గా. జనసేన పోటీ చేస్తోంది 21 స్థానాలు కాదు.. 175 అని గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీలో వశిష్ట వారధి, డీఎస్సీ, నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై చర్చించాలంటే కూటమి ప్రభుత్వం రావాలి’ అని పవన్‌ పేర్కొన్నారు. సభలో కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ (భాజపా), ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్‌ (జనసేన), మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు తదితరులు పాల్గొన్నారు.


గ్రంధి శ్రీనుకు డిపాజిట్లు రాకుండా చేస్తాం

‘గ్రంధి శ్రీనివాస్‌ను ఏం అనకండి. కాపుల ఓట్లు చీలిపోతాయి’ అని మా పార్టీలో వారే అంటుంటే నాకే నీరసం వచ్చేసింది. ఏ కులం వారు చేసినా తప్పు తప్పే. భీమవరంలో 2 ఎకరాలు కొందామని చూస్తుంటే.. అమ్మకందారులను గ్రంధి శ్రీనివాస్‌ బెదిరించారు. ఆయనకు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాం’ అని పవన్‌ అన్నారు. ‘జగన్‌ లాగా మూడోతరం రాజకీయ నాయకుడిని కాదు. కింది నుంచి పైకొచ్చిన వాడిని. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడే జగన్‌ ముఖ్యమంత్రా.. ముర్ఖుడా!’ అని పవన్‌ నిప్పులు చెరిగారు. ‘జగన్‌.. నేను భీమవరం నుంచి పారిపోవడం కాదు.. మీరే హామీల నుంచి పారిపోయారు. కోడికత్తితో పొడిస్తే అరిచినట్లు అవ్వలూ.. అమ్మలూ.. అక్కలూ అని దీర్ఘాలుతీస్తూ హామీలిచ్చారు. కరెంటు బిల్లుల వంకతో వేలమందికి పింఛన్లు తొలగించారు. జగన్‌ గెలిస్తే ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టేస్తారు. డిజిటలీకరణ చేసి మీ ఆస్తులు దోచేస్తారు. ఆలోచించి ఓటేయండి’ అని పవన్‌ హితవు పలికారు.

జ్వరంతో ఉన్నా మీ కోసం వచ్చా..

‘రాష్ట్రంలో ఏటా 1.3 లక్షల మంది విద్యార్థులు పట్టభద్రులవుతున్నా.. 30 శాతం మందికి కూడా ఉద్యోగాలు దొరకడం లేదు. వైకాపా రూ.5 వేలిచ్చి యువతను వాలంటరు ఉద్యోగాలకు పరిమితం చేయడం దారుణం. 20 రోజులుగా వైరల్‌ జ్వరంతో బాధపడుతున్నా ప్రజల భవిష్యత్తు కోసమే బయటకు వచ్చా’ అని జనసేనాని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img