icon icon icon
icon icon icon

Ys Sharmila: జగన్‌ మానసిక పరిస్థితి చూస్తుంటే భయమేస్తోంది: వైఎస్‌ షర్మిల

పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుల చుట్టూ తిరిగి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్పించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. 

Updated : 04 May 2024 17:07 IST

కడప: పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుల చుట్టూ తిరిగి వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్పించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. శనివారం కడపలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘ జగన్‌ కేసులకు సంబంధించి తొలుత సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్సార్ పేరు లేదు. కుట్ర పూరితంగా ఆయన పేరు చేర్చారు. ఈ విషయాన్ని సోనియాగాంధీ స్వయంగా నాతో చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ వైఎస్సార్ పేరును ఛార్జిషీట్‌లో చేర్చిందని జగన్‌ గతంలో ఆరోపించారు. కానీ, ఆయన సీఎం అయిన ఆరు రోజుల్లోనే సుధాకర్‌రెడ్డికి ఏఏజీ పదవి వచ్చింది. జగన్‌ ఆదేశాలు లేకుండానే పొన్నవోలుకు ఏఏజీ పదవి వచ్చిందా? కేసుల నుంచి జగన్‌ బయటపడాలంటే ఛార్జ్‌షీట్‌లో వైఎస్సార్ పేరు ఉండేలా చూశారు.

వైఎస్సార్ విషయంలోనే ఇంత దారుణానికి ఒడిగట్టారంటే మిమ్మల్ని ప్రజలు ఎలా నమ్మాలి? తన తండ్రి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్పించిన వ్యక్తికి సీఎం అయిన ఆరు రోజుల్లోనే ఏఏజీ (అడిషినల్‌ అడ్వకేట్‌ జనరల్‌) పదవి ఇచ్చారంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో మీరే ఆలోచించుకోవాలి. వివేకానందరెడ్డి హత్యకు గురైతే అందులో చంద్రబాబు హస్తం ఉందని ఆరోజు జగన్‌ ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపించాలన్నారు. కానీ, జగన్‌ సీఎం అయిన తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదని ఆయనే స్వయంగా చెప్పారు. ఇలా అప్పుడొక మాట, ఇప్పుడొక మాట మారుస్తున్నది జగన్‌.

చంద్రబాబు తనను కంట్రోలు చేస్తున్నారని జగన్‌ ఆరోపిస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. చంద్రబాబు చెబితేనే కాంగ్రెస్‌లో చేరానని చెబుతున్నారు. ఆయన చెబితినే 3,200 కి.మీ. పాదయాత్ర చేశానా? సమైక్యాంధ్ర కోసం తిరిగానా? తెలంగాణలో ఓదార్పు యాత్ర చేశానా? బై.. బై.. బాబు క్యాంపెయిన్‌ నడిపానా? వీటన్నింటికీ జగన్‌ సమాధానం చెప్పాలి. న్యాయం కోసం పోరాడుతున్న సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారని దుర్మార్గంగా ఆరోపిస్తున్నారు. జగన్‌ మానసిక పరిస్థితి చూస్తోంటే నాకు భయమేస్తోంది. ఏది జరిగినా చంద్రబాబే కారణం అని ఆరోపిస్తున్నారు. జగన్‌కు ఓ అద్దం పంపుతున్నా. అద్దంలో చూసుకుంటే జగన్‌ ముఖం కనిపిస్తుందో ..చంద్రబాబు కనిపిస్తున్నారో గమనించాలి’’ అని షర్మిల అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img