Andhra News: ప్రభుత్వ నిర్ణయంతో వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం

ప్యాకింగ్‌ లేకుండా విడిగా నూనెల విక్రయాన్ని నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎడిబిల్‌ ఆయిల్స్‌ అండ్‌

Published : 15 Aug 2022 01:13 IST

అమరావతి: ప్యాకింగ్‌ లేకుండా విడిగా నూనెల విక్రయాన్ని నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎడిబిల్‌ ఆయిల్స్‌ అండ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సంఘం డిమాండ్‌ చేసింది. ఇలాంటి ఆదేశాల అమలు వల్ల రాష్ట్రంలో వంట నూనెల ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా లక్షలాది మంది చిరు వ్యాపారులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీవోను వ్యతిరేకిస్తూ వర్తక సంఘాల నేతలు ఆదివారం విజయవాడలో సమావేశమయ్యారు. కల్తీ నెపం వేసి చిన్న దుకాణాలను పక్కన పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ప్యాకింగ్‌తోనే వంటనూనెలు అమ్మాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయగా.. ఉత్తర్వులు వచ్చిన 24 గంటల్లోనే దీన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దారుణమని ఏపీ స్టేట్‌ ఎడిబిల్ ఆయిల్స్‌ అండ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అధ్యక్షుడు సన్నపురెడ్డ పెంచల్‌రెడ్డి అన్నారు. వర్తకులను వాణిజ్య రంగాన్ని దారుణంగా దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్యాకింగ్‌ తప్పనిసరి చేస్తే.. లీటర్‌ నూనె ప్యాకెట్‌పై రూ.15 ధర అదనంగా పెరుగుతుందని తెలిపారు. రోజుకు లక్ష కేజీలు ప్యాకింగ్‌ చేసే సదుపాయం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడా లేదని చెప్పారు. వ్యాపారులతో కనీసం చర్చించకుండా ఆదేశాలు అమలు చేయడం దారుణమన్నారు. ఈ ఆదేశాల అమలు వల్ల వ్యాపారులకు తీవ్ర నష్టం వచ్చి రోడ్డున పడతారని, వర్తకులు దివాలా తీసే పరిస్థితి వస్తుందన్నారు. దీనిపై వెంటనే సీఎం జగన్ స్పందించి ఆదేశాలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని