Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 31 Jan 2023 17:07 IST

1. త్వరలోనే విశాఖకు షిఫ్ట్‌ అవుతున్నా: సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం రాజధాని కాబోతోందని.. త్వరలో తాను కూడా అక్కడికి షిఫ్ట్‌ అవుతున్నట్లు చెప్పారు. దిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో నిర్వహించిన ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎం మాట్లాడారు. ‘‘మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో ఇన్వెస్టర్ల సదస్సు జరగనుంది. మిమ్మల్ని విశాఖకు ఆహ్వానిస్తున్నా. విశాఖపట్నం రాజధాని కాబోతోంది. కొన్ని నెలల్లో నేను కూడా అక్కడికి షిఫ్ట్‌ అవుతున్నా. మిమ్మల్ని మరోసారి విశాఖలో కలవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. లోక్‌సభ ముందు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వే (Economic Survey)ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్‌సభ (Lok sabha)ను రేపటికి (ఫిబ్రవరి 1వ తేదీ)కి వాయిదా వేశారు. అంతకుముందు పార్లమెంట్‌లో దివంగత ఎంపీలు, మాజీ సభ్యులకు నివాళులర్పించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3.  అత్యాచారం కేసులో.. ఆశారాంకు మరోసారి జీవితఖైదు

ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూ (Asaram Bapu) మరో అత్యాచార కేసులో దోషిగా తేలారు. ఈ కేసులో ఆయనకు జీవితఖైదు విధిస్తూ గుజరాత్‌ (Gujarat) కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. కాగా.. ఇప్పటికే ఆయన మరో రేప్‌ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. దాదాపు పదేళ్ల క్రితం నాటి అత్యాచారం కేసులో గాంధీనగర్‌ కోర్టు ఆశారాంను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. 2013లో గుజరాత్‌ మోతేరాలోని ఆశారాం బాపూ (Asaram Bapu) ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు సూరత్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4.  ఓఎల్ఎక్స్‌లోనూ తొలగింపులు.. 1500 మందికి ఉద్వాసన!

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతోంది. పెద్ద పెద్ద సంస్థల నుంచి స్టార్టప్‌ల వరకు అన్ని సంస్థలూ తమ ఉద్యోగులను ఇంటికి (Layoffs)పంపిస్తున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌లో సెకండ్‌ హ్యాండ్‌ వస్తువులను విక్రయించే వేదికగా అందరికీ సుపరిచితమైన ఓఎల్‌ఎక్స్‌ గ్రూప్‌ (OLX) సైతం ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలో 10 వేల మంది పనిచేస్తుండగా.. అందులో 15 శాతం మంది అంటే దాదాపు 1500 మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఉన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. గవర్నర్‌కు ఉద్యోగుల ఫిర్యాదు అంశంపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్‌ 

రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఉద్యోగులపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. వేతనాలు, ఇతర బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ కొద్దిరోజుల క్రితం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. గవర్నర్‌కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలను విరుద్ధమని.. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆ సంఘం నేతలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇరువురి వాదనలు విని తీర్పును రిజర్వ్‌చేసింది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. మహేశ్‌బాబు చెట్టెక్కి కూర్చున్నాడు

 సినిమాలో నటించమని అడిగితే బాల్యంలో మహేశ్‌బాబు చెట్టెక్కి కూర్చున్నాడని దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఓ సందర్భంలో చెప్పారు. ఆయన తెరకెక్కించిన ‘పోరాటం’ (1983) సినిమాలో మహేశ్‌ పూర్తిస్థాయి పాత్రలో బాలనటుడిగా సందడి చేశారు. ఈ సినిమాలో తన తండ్రి కృష్ణ సోదరుడి పాత్రలో నటించారు. ఇందులో మహేశ్‌ నటించడం గురించి దివంగత కోడి రామకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. బాల్యంలో మహేశ్‌ చాలా అల్లరి చేసేవాడని తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7.  సూచీల్లో కొనసాగిన ‘బడ్జెట్‌’ అప్రమత్తత!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి.సెన్సెక్స్‌ 49.49 పాయింట్ల లాభంతో 59549.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 13.20 లాభపడి 17662.20 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 81.90గా ఉంది. ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, బీపీసీఎల్‌, అదానీ పోర్ట్స్‌ తదితర షేర్లు లాభపడగా.. టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బ్రిటానియా, టెక్‌ మహీంద్రా, సిల్పా కంపెనీల షేర్లు నష్టాల బాటపట్టాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. వన్డేలకు శుభ్‌మన్‌ గిల్‌.. టీ20లకు పృథ్వీ షా సరిపోతారు: గంభీర్‌

వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు.. సెంచరీలు బాదేశాడు. భవిష్యత్తులో భారత స్టార్‌ బ్యాటర్‌ అవుతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే వన్డేల్లో రాణించిన విధంగా టీ20ల్లో మాత్రం శుభ్‌మన్‌ గిల్ ప్రతిభ కనబరచలేకపోయాడు. తాజాగా కివీస్‌తో టీ20 సిరీసుల్లోనూ పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్‌ కూడా గిల్‌ ప్రదర్శనపై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో అనుకొన్న విధంగా రాణించలేకపోతున్నాడని.. అదే సమయంలో మరో యువ బ్యాటర్ పృథ్వీ షా టీ20లకు సరిగ్గా సరిపోతాడని గంభీర్‌ తెలిపాడు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


9. ఈ ఏడాది వృద్ధి రేటు 7%.. ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలు

ప్రపంచంలో భారత్‌ అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని ఆర్థిక సర్వే (Economic Survey) తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2022- 23లో 7శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. 2023- 24లో అది 6.5 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. ‘పర్చేజింగ్‌ పవర్‌ ప్యారిటీ (PPP)’ పరంగా చూస్తే ప్రపంచంలోనే భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని పేర్కొంది. బడ్జెట్‌ (Budget 2023) సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వే (Economic Survey)ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఆర్‌డీ చేస్తున్నారా? ఇవి గుర్తుంచుకోండి..

 పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆర్థిక లక్ష్యాల సాధన కోసం సహాయపడే మార్గాలను ఎంచుకోవాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేనివారు, నెలవారీగా నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేసి పెట్టుబడులు పెట్టాలనుకునేవారు రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతాను ఎంచుకోవచ్చు. ఇది సురక్షితమైన మార్గం. మీ స్వల్పకాల ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు సహాయపడుతుంది. ఆర్‌డీ ఖాతా టర్మ్‌ డిపాజిట్‌ మాదిరిగా పనిచేస్తుంది. ఎటువంటి నష్టభయం లేకుండా క్రమమైన డిపాజిట్లు చేస్తూ మంచి రాబడిని సాధించవచ్చు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు