Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 15 Aug 2022 21:07 IST

1. ఏడాది ఓపిక పట్టండి.. కాంగ్రెస్ కార్యకర్తలెవరూ పార్టీ వీడొద్దు: రేవంత్‌ రెడ్డి

పార్టీ ఫిరాయింపులకు తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ ప్రయోగశాలగా మార్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో సర్పంచ్‌, ఎంపీటీసీలను అధికార పార్టీ కొనుగోలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు రేవంత్‌ వీడియో విడుదల చేశారు. తాను ఇప్పటికే మునుగోడులో పర్యటించాల్సి ఉన్నా.. కొవిడ్‌ కారణంగా రాలేకపోయానని రేవంత్‌ పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి మునుగోడులోనే ఉంటానని వెల్లడించారు.

2. తెలంగాణలో రేపు సామూహిక జాతీయ గీతాలాపన.. 1నిమిషం పాటు రెడ్‌ సిగ్నల్‌

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపనకు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రేపు ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన చేయనున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్ ఆబిడ్స్ జీపీవో కూడలి వద్ద గీతాలాపనలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆబిడ్స్ జీపీఓ సర్కిల్, నెక్లెస్ రోడ్డు కూడలి ప్రాంతాల్లో ఏర్పాట్లను సీఎస్ సోమేశ్‌ కుమార్, ఉన్నతాధికారులు పరిశీలించారు.


Video: సుస్థిర సమాజం కోసం యువశక్తి


3. రుణ గ్రహీతలకు SBI షాక్‌.. మరోసారి రుణ రేట్ల పెంపు!

ప్రభుత్వరంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మరోసారి రుణ గ్రహీతలకు షాకిచ్చింది. కీలక బెంచ్‌ మార్క్‌ వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. ఇటీవల రెపో రేట్లను ఆర్‌బీఐ (RBI) 50 బేసిస్‌ పాయింట్ల మేర సవరించిన నేపథ్యంలో బ్యాంక్‌ ఈ నిర్ణయి తీసుకుంది. పెంచిన రేట్లు నేటి (ఆగస్టు 15) నుంచే అమల్లోకి వస్తాయని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐలు భారం కానున్నాయి.

4. బోల్తా కొడుతున్న బాలీవుడ్‌ మూవీలు.. కారణం అదేనా?

‘హిందీ సినిమాలు ఈ సంవత్సరం ప్రథమార్ధంలో వెనుకబడిన మాట నిజమే. కానీ, సెకండాఫ్‌లో పరిస్థితి చక్కబడుతుంది. పెద్ద హీరోలైన ఆమిర్‌ ఖాన్‌, అక్షయ్‌ సినిమాలు బాలీవుడ్‌కి పూర్వవైభవం తెస్తాయి’ కొద్దిరోజుల క్రితం ఒక బాలీవుడ్‌ ప్రముఖుడు చేసిన వ్యాఖ్యలివి. ప్రేక్షకులు కూడా ‘లాల్‌ సింగ్‌ చడ్డా’, ‘రక్షా బంధన్‌’లకు ఆ సత్తా ఉందని నమ్మారు. గతవారం రెండు సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. కానీ, ఫలితం.. ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లు ఉంది. కంటెంట్‌ అంత బలంగా లేదు.

5. Airtel నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌.. బెన్‌ఫిట్స్‌ ఇవే..

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌ (Airtel) రెండు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను ప్రకటించింది. రూ.519, రూ.779 విలువ గల రెండు సరికొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. రోజుకు 1.5 జీబీ డేటా కలిగిన ఈ రెండు ప్లాన్లలో ఒకటి 2 నెలలు, మరొకటి 3 నెలల వ్యాలిడిటీతో వస్తున్నాయి. పూర్తి క్యాలెండర్‌ నెల రీఛార్జి కోరుకునే వారు ఈ ప్లాన్లపై ఓ లుక్కేయొచ్చు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల జియో పలు ఆఫర్లు ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ ఈ ప్లాన్లను తీసుకొచ్చింది.


Video: ఎమ్మెల్యేలపై మంత్రి పెద్దిరెడ్డి సరదా వ్యాఖ్యలు


6. ఆ స్టార్‌ క్రికెటర్‌ను మా దేశం తరఫున ఆడమని కోరా: కివీస్‌ మాజీ బ్యాటర్‌

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్‌ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌ తన ఆత్మ కథ ‘బ్లాక్‌ అండ్ వైట్’ పుస్తకంలో కొంగొత్త విషయాలను వెల్లడిస్తున్నాడు. 2011లో భారత టీ20 లీగ్‌లో ఓ ఫ్రాంచైజీ యాజమాని ఒకరు తనను నాలుగు చెంపదెబ్బలు (చిన్నవే) కొట్టాడని.. అలానే రాహుల్ ద్రవిడ్‌కు ఉన్న క్రేజ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం వంటి సందర్భాలను తెలిపాడు. తాజాగా ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్‌ గురించీ ఓ సంచలన విషయం బయటపెట్టాడు.

7. జెండా ఎగురవేసేందుకు వృద్ధ జంట ప్రయాస.. ఆనంద్‌ మహీంద్రా ఎమోషనల్‌ పోస్ట్‌

డెబ్భై ఐదేళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభించింది. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఊరూ వాడా అంతా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన ఓ ఫొటో.. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ విజయవంతమైందని చెప్పేందుకు నిలువెత్తు నిదర్శంగా నిలిచింది.

8. తాలిబన్ల పాలనలో అఫ్గానిస్థాన్‌.. ఏడాదైనా ఏకాకిగానే..!

అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా బలగాలు నిష్క్రమించిన వెంటనే ఆ ప్రాంతంపై తాలిబన్లు  దండెత్తారు. అదే సమయంలో దేశాధ్యక్షుడు దేశం విడిచి పారిపోవడంతో తాలిబన్‌ సేనలు మొత్తం దేశాన్ని ఆక్రమించుకోవడం వెనువెంటనే జరిగిపోయాయి. అనంతరం అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు తాలిబన్లు ప్రకటించారు. ఇలా తాలిబన్‌ పాలన మొదలై ఏడాది పూర్తైనప్పటికీ ప్రపంచ దేశాలు మాత్రం వారిని అధికారికంగా గుర్తించకపోవడంతో అఫ్గానిస్థాన్‌ ఏకాకిగానే మిగిలిపోయింది.


Video: గొంతు నొప్పితో బాధపడుతున్నారా..?


9. అవినీతి కేసులో ఆంగ్‌ సాన్‌ సూకీకి ఆరేళ్ల జైలు శిక్ష!

మయన్మార్‌ కీలక నేత, నోబెల్‌ బహుమతి విజేత ఆంగ్​సాన్​సూకీ(77)కి అక్కడి కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించినట్లు సమాచారం. నాలుగు అవినీతి కేసులతో సూకీకి సంబంధం ఉన్నట్లు పేర్కొంటూ కోర్టు ఆమెకు ఆరేళ్ల జైలు శిక్షను ఖరారు చేసినట్లు అనధికార వర్గాలు తెలిపాయి. దేశంలో ఆరోగ్యం, విద్యను ప్రోత్సహించేందుకు ఆమె స్థాపించిన ‘డా ఖిన్ క్యీ’ ఫౌండేషన్ నిధులను దుర్వినియోగం చేశారంటూ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది.

10. భారత జాతీయ గీతం ‘జనగణమన’ వినిపించిన పాకిస్థానీ మ్యుజీషియన్‌

ఓ పాకిస్థానీ మ్యుజీషియన్‌ సామరస్యాన్ని చాటుకున్నాడు. భారత్‌ 75వ 'స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న వేళ.. మన జాతీయ గీతమైన ‘జనగణమన’ను ఆయన ‘రబాబ్‌’ ద్వారా వాయించి భారతీయులకు అంకితమిచ్చాడు. పాకిస్థాన్‌కు చెందిన సియాల్‌ ఖాన్‌ రబాబ్‌ వాయిద్యకారుడు. (తంబూర తరహాలో ఉండే రబాబ్‌ పాకిస్థాన్‌, ఆఫ్గనిస్థాన్‌తోపాటు కశ్మీర్‌లోనూ ప్రసిద్ధి). భారత జాతీయ గీతమైన ‘జనగణమన’ను రబాబ్‌తో అద్భుతంగా వాయించిన సియాల్‌ ఖాన్.. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని